త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinnaswamy Stadium | బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో దొంగ‌లు.. భారీ ఎత్తున ఫోన్ల చోరీ..

Chinnaswamy Stadium | బెంగ‌ళూరులోని ఎం.చిన్న‌స్వామి స్టేడియంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించేందుకు వ‌చ్చిన చాలా మంది ప్రేక్ష‌కులు త‌మ ఫోన్ల‌ను పోగొట్టుకున్న‌ట్లు ఫిర్యాదు చేశారు. స్టేడియంలో భారీ జ‌న సందోహం మ‌ధ్య త‌మ ఫోన్ల‌ను ఎవ‌రో దొంగిలించార‌ని వారు పేర్కొన్నారు.

S

Cricket | Published On Mar 30, 2026, 3.00 pm IST

Chinnaswamy Stadium | బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో దొంగ‌లు.. భారీ ఎత్తున ఫోన్ల చోరీ..
Advertisement

Chinnaswamy Stadium | బెంగ‌ళూరులోని ఎం.చిన్న‌స్వామి స్టేడియంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించేందుకు వ‌చ్చిన చాలా మంది ప్రేక్ష‌కులు త‌మ ఫోన్ల‌ను పోగొట్టుకున్న‌ట్లు ఫిర్యాదు చేశారు. స్టేడియంలో భారీ జ‌న సందోహం మ‌ధ్య త‌మ ఫోన్ల‌ను ఎవ‌రో దొంగిలించార‌ని వారు పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్టేడియం స్టాండ్ల‌లోనే ఫోన్ల‌ను పోగొట్టుకున్న‌ట్లు ప్రేక్ష‌కులు తెలిపారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ స‌మ‌యంలో జ‌న సందోహం ఎక్కువైంద‌ని, ఆ స‌మ‌యంలోనే త‌మ ఫోన్లు చోరీకి గుర‌య్యాయ‌ని వారు తెలిపారు.

30 ఫోన్లు పోయిన‌ట్లు ఫిర్యాదులు..

ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా గుమిగూడి ఉన్న చోట్ల‌, బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో ఫోన్ల‌ను పోగొట్టుకున్న‌ట్లు తెలిపారు. మ‌రికొంద‌రు ప్రేక్ష‌కులు త‌మ ఫోన్ల‌ను స్టేడియం స‌మీపంలోని మెట్రో స్టేష‌న్‌, క‌బ్బ‌న్ పార్క్ వంటి ప్రాంతాల్లో పోగొట్టుకున్న‌ట్లు ఫిర్యాదుల‌లో పేర్కొన్నారు. క‌బ్బ‌న్ పార్క్ పోలీస్ స్టేష‌న్‌లోనే అధికంగా ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు పోలీసు అధికారులు తెలిపారు. కొంద‌రు బాధితులు క‌ర్ణాట‌క పోలీస్ యాప్ ద్వారా ఈ-లాస్ట్ ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌ల‌ను సెంట్ర‌ల్ డివిజ‌న్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ అక్ష‌య్ హకే ధ్రువీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మొత్తం 30 ఫోన్లు దొంగిలించ‌బ‌డిన‌ట్లు ఫిర్యాదులు అందాయ‌ని తెలిపారు.

చోరీ అయిన ఫోన్ల సంఖ్య ఇంకా ఎక్కువే..?

చిన్న‌స్వామి స్టేడియంలో, బ‌య‌ట జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌ల‌పై తాము ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని అక్ష‌య్ హ‌కే తెలిపారు. ఈ ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన కొంద‌రు అనుమానితుల‌ను తాము ఇప్ప‌టికే గుర్తించామ‌ని, వారిని ప్ర‌శ్నిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. కొంద‌రిని అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు జ‌న సందోహం ఉన్న ప్రాంతాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. అయితే ప్ర‌త్య‌క్ష సాక్షులు, సోష‌ల్ మీడియా పోస్టుల ప్ర‌కారం ఈ దొంగ‌త‌నాల సంఖ్య మ‌రింత ఎక్కువ‌గానే ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. రితు తివారి అనే ఓ కంటెంట్ క్రియేట‌ర్ ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ స్టేడియంలోని పి3 అనే స్టాండ్‌లోనే ఏకంగా 50 నుంచి 60 ఫోన్ల‌ను దొంగించార‌ని తెలిపింది. తన భ‌ర్త ఫోన్ కూడా పోయింద‌ని ఆమె వివ‌రించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు వెళ్లేవారు త‌మ ఫోన్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆమె సూచించింది. మొద‌టి ఇన్నింగ్స్ అనంత‌రం నీళ్లు తెచ్చేందుకు త‌న భ‌ర్త వెళ్లాడ‌ని, అదే స‌మ‌యంలో ఫోన్ పోయినట్లు గుర్తించాడ‌ని తెలిపింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ చాలా మంది తమ ఫోన్ల‌ను పోగొట్టుకున్న‌ట్లు తెలిపార‌ని ఆమె వెల్ల‌డించింది.

మొద‌టి ఇన్నింగ్స్ త‌రువాతే చోరీలు..

స్టేడియంలో ఉన్న పోలీసులను సంప్ర‌దించిన‌ప్ప‌టికీ వారి నుంచి స‌రైన స్పంద‌న రాలేద‌ని ప‌లువురు బాధితులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. త‌రువాత స‌మీప పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ల‌గా అక్క‌డ కూడా అనేక మంది బాధితులు ఉన్న‌ట్లు తెలిపారు. కాగా పోలీసులు కాంప్లిమెంట‌రీ టిక్కెట్ల‌తో వ‌చ్చిన 10 నుంచి 12 మంది చిన్నారుల‌ను అదుపులోకి తీసుకున్నార‌ని అన్నారు. స్టేడియంల‌లో ఫోన్ల‌ను దొంగిలించ‌డం ఒక‌రి ప‌ని కాద‌ని, కొంద‌రు క‌ల‌సి క‌ట్టుగానే ఈ ప‌ని చేస్తుండ‌వ‌చ్చ‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డ్డారు. సాధార‌ణంగా ఐపీఎల్ మ్యాచ్‌ల స‌మ‌యంలో స్టేడియంల‌లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటాయ‌ని, మొద‌టి ఇన్నింగ్స్ త‌రువాత చాలా మంది తాగునీరు లేదా ఫుడ్‌, టాయిలెట్ కోసం బ‌య‌ట‌కు వ‌స్తార‌ని, ఆ స‌మ‌యంలోనే చోరీలు ఎక్కువ‌గా జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. ఇక పోలీసులు ప్ర‌స్తుతం స్టేడియం లోప‌ల‌, బ‌య‌ట సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. దొంగ‌ల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నామని, ఈ ఘ‌ట‌న‌ల వెనుక ఏదైనా ముఠా ఉందా.. అన్న కోణంలోనూ పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement