త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zomato | హైదరాబాద్‌లో జొమాటో ఉద్యోగులకు షాక్.. 250 మందిపై వేటు..?

Zomato | ఆహార డెలివరీ దిగ్గజం జొమాటోలో మరోసారి ఉద్యోగుల తొలగింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజా వర్క్‌ఫోర్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సుమారు 250 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించినట్లు సమాచారం. కంపెనీ కస్టమర్ డిలైట్ ఆపరేటింగ్ మోడల్, సంస్థాగత అవసరాలపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక వెల్లడించింది.

S

Business | Published On Aug 31, 2026, 5.05 pm IST

Zomato | హైదరాబాద్‌లో జొమాటో ఉద్యోగులకు షాక్.. 250 మందిపై వేటు..?
Advertisement

Zomato | ఆహార డెలివరీ దిగ్గజం జొమాటోలో మరోసారి ఉద్యోగుల తొలగింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజా వర్క్‌ఫోర్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సుమారు 250 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించినట్లు సమాచారం. కంపెనీ కస్టమర్ డిలైట్ ఆపరేటింగ్ మోడల్, సంస్థాగత అవసరాలపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక వెల్లడించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌లోని జొమాటో కస్టమర్ డిలైట్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. మిగిలిన ఇన్‌హౌస్ కార్యకలాపాలను గురుగ్రామ్‌లోని ఒకే ప్రాంతానికి కేంద్రీకరించనుంది. ఈ నిర్ణయం హైదరాబాద్‌లో పనిచేస్తున్న సుమారు 240 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్నట్లు నివేదిక తెలిపింది.

గురుగ్రామ్‌లో ఒకే చోట నిర్వ‌హ‌ణ‌..

ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ తొలగింపులు చేయడం లేదని జొమాటో స్పష్టం చేసింది. కస్టమర్ సపోర్ట్ మోడల్‌లో వచ్చిన మార్పుల కారణంగానే కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించి, టీమ్ పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఆరు నెలల్లో జొమాటో కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్ పనుల్లో ఎక్కువ భాగాన్ని ప్రత్యేక సేవలు అందించే బాహ్య భాగస్వామ్య సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇక కంపెనీలో కొనసాగనున్న ఇన్‌హౌస్ కార్యకలాపాలను గురుగ్రామ్‌లో ఒక సమగ్ర బృందంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందం కంపెనీ ఉత్పత్తి, టెక్నాలజీ, అనలిటిక్స్, బిజినెస్ విభాగాలతో మరింత సమన్వయంతో పనిచేసేలా ఈ మార్పులు చేస్తున్నట్లు జొమాటో తెలిపింది. ఉద్యోగుల తొలగింపుతో ఏర్పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ పలు ప్రయోజనాలను కూడా ప్రకటించింది.

తొలంగిచిన ఉద్యోగుల‌కు ప్యాకేజీలు..

తొలగింపులకు గురైన ఉద్యోగులకు ఆగస్టు నెల జీతంతో పాటు నాలుగు నెలల సెవెరెన్స్ ప్యాకేజీ అందించనున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ప్రకారం చెల్లించాల్సిన నోటీసు పే, ఒకసారి చెల్లించే ఎక్స్‌గ్రేషియా మొత్తం ఉంటాయి. అలాగే 2027 మార్చి 31 వరకు మెడికల్ ఇన్సూరెన్స్, కౌన్సెలింగ్ సదుపాయాలను కొనసాగించనున్నారు. ఉద్యోగులు కంపెనీ అందించిన ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్లను వ్యక్తిగత వినియోగం కోసం తమ వద్దే ఉంచుకునే అవకాశం కూడా కల్పించారు. కొత్త ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయాన్ని కూడా జొమాటో అందించనుంది.

కేంద్రీకృత ఇన్‌హౌస్ బృందంతో నిర్వ‌హ‌ణ‌..

జొమాటో తన కార్యకలాపాల నిర్వహణ విధానాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్న సమయంలోనే ఈ తొలగింపులు చోటుచేసుకున్నాయి. కస్టమర్ సపోర్ట్ కోసం బాహ్య భాగస్వామ్య సంస్థలపై ఆధారపడటాన్ని పెంచుతూ, మిగిలిన కార్యకలాపాలను చిన్నదైన, కేంద్రీకృత ఇన్‌హౌస్ బృందంతో నిర్వహించే దిశగా కంపెనీ ముందుకు సాగుతోంది. కాగా జొమాటో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్‌ఎస్ఎస్‌ఏఐ పలు రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో, తన ప్లాట్‌ఫామ్‌లోని రెస్టారెంట్లు అనలాగ్ డెయిరీతో తయారు చేసిన వంటకాలను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే వాటిని తొలగించేలా జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆ సంస్థ‌ ప్రకటించింది.

Advertisement
Advertisement