త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్.. జొమాటో, స్విగ్గీల‌కు భారీ షాక్..

Flipkart | భారత్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో మరో కీలక పోటీ ప్రారంభమవుతోంది. వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు వెంటనే స్పందించారు. ఈ ప్రకటన ప్రభావంతో ఎటర్నల్ (జొమాటో మాతృసంస్థ), స్విగ్గీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

S

Business | Published On Jul 24, 2026, 5.19 pm IST

Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్.. జొమాటో, స్విగ్గీల‌కు భారీ షాక్..
Advertisement

Flipkart | భారత్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో మరో కీలక పోటీ ప్రారంభమవుతోంది. వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు వెంటనే స్పందించారు. ఈ ప్రకటన ప్రభావంతో ఎటర్నల్ (జొమాటో మాతృసంస్థ), స్విగ్గీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉన్న ఈ రంగంలో మరో భారీ ఆర్థిక బలం ఉన్న సంస్థ అడుగుపెడుతుండటంతో భవిష్యత్తులో లాభదాయకత, మార్జిన్లపై ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన మార్కెట్‌ల‌లో వ్యక్తమైంది. ప్రస్తుతం ఎటర్నల్, స్విగ్గీ రెండూ లాభదాయకత పెంపు, వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీతో కస్టమర్లను ఆకర్షించేందుకు మరింత డిస్కౌంట్లు, మార్కెటింగ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, దీంతో ఇప్పటికే ఉన్న కంపెనీల లాభాలపై ఒత్తిడి పడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.

ప‌రిమిత స్థాయిలో ముందుగా సేవ‌లు..

ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ మరికొన్ని వారాల్లో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభిస్తామ‌ని ప్రకటించారు. ఇతర వ్యాపారాల మాదిరిగానే తొలుత సేవలను పరిమిత స్థాయిలో ప్రారంభించి, వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి, ఉత్పత్తిని మెరుగుపరిచిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ఈ దశలవారీ వ్యూహం ద్వారా తొలుత సేవల నాణ్యతను పరీక్షించి, ఆ తర్వాత విస్తరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఫ్లిప్‌కార్ట్ ప్రకటన తర్వాత మార్కెట్‌లో వెంటనే ప్రతికూల ప్రభావం కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో ఎటర్నల్ షేర్‌ 2.47 శాతం పడిపోయి రూ.280 వద్ద ట్రేడైంది. స్విగ్గీ షేర్‌ 3.77 శాతం క్షీణించి రూ.251.70 వద్దకు చేరింది. ఫ్లిప్‌కార్ట్ భారీ కస్టమర్ బేస్, బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్, వాల్‌మార్ట్ ఆర్థిక మద్దతు కారణంగా భవిష్యత్తులో పోటీ మరింత పెరుగుతుందనే అంచనాల‌తో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న స్విగ్గీ..

అలాగే స్విగ్గీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో మొత్తం విదేశీ పెట్టుబడుల పరిమితిని పూర్తిగా డైల్యూటెడ్ ప్రాతిపదికన 49.5 శాతంగా నిర్ణయించింది. ఈ పరిమితి విదేశీ ఇన్వెస్టర్లు, విదేశీ నియంత్రిత భారతీయ సంస్థలు, ఎఫ్‌పీఐలు, ఎన్‌ఆర్‌ఐలకు వర్తించనుండగా, నాన్-రిపాట్రియేషన్ మార్గంలో వచ్చిన పెట్టుబడులకు మాత్రం వర్తించదు. యూబీఎస్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం వల్ల అదనపు విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కొంత పరిమితమైనప్పటికీ, కంపెనీకి వ్యూహాత్మక, నిర్వహణ పరమైన స్వేచ్ఛ పెరుగుతుందని పేర్కొంది. అయితే కొన్ని గ్లోబల్ ఇండెక్స్‌లలో అర్హతపై ప్రభావం పడే అవకాశం ఉందని, దాని వల్ల పాసివ్ ఫండ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్ప‌టికే కోట్లాది మంది యాక్టివ్ యూజ‌ర్లు..

ఫ్లిప్‌కార్ట్‌కు ఫుడ్ డెలివరీ రంగంలో పలు బలమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికే కోట్లాది యాక్టివ్ ఈ-కామర్స్ వినియోగదారులు ఉండటం వల్ల కొత్తగా కస్టమర్లను వెతకాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. రోజుకు సుమారు 8.5 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా విస్తరించిన ఏకార్ట్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్, గిడ్డంగులు, రూట్ ఆప్టిమైజేషన్, లాస్ట్ మైల్ డెలివరీ వ్యవస్థలు ఫుడ్ డెలివరీ వ్యాపారానికి ఉపయోగపడే అవకాశముంది.

Advertisement
Advertisement