త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women | ఇన్వెస్ట‌ర్లుగా మారుతున్న మ‌హిళ‌లు.. స్టాక్ మార్కెట్ల‌లో గ‌ణ‌నీయంగా పెరిగిన పెట్టుబ‌డులు..

Women | భారతీయ మహిళల ఆర్థిక ఆలోచనల్లో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు బంగారం, పోస్టాఫీస్ పొదుపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకే పరిమితమైన పెట్టుబడి ప్రయాణం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు, సిప్‌లు, ఈక్విటీ పెట్టుబడుల దిశగా వేగంగా విస్తరిస్తోంది. మహిళలు కేవలం పొదుపుదారులుగానే కాకుండా సంపద సృష్టించే ఇన్వెస్టర్లుగా మారుతున్నారు.

S

Business | Published On Jun 16, 2026, 1.35 pm IST

Women | ఇన్వెస్ట‌ర్లుగా మారుతున్న మ‌హిళ‌లు.. స్టాక్ మార్కెట్ల‌లో గ‌ణ‌నీయంగా పెరిగిన పెట్టుబ‌డులు..
Advertisement

Women | భారతీయ మహిళల ఆర్థిక ఆలోచనల్లో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు బంగారం, పోస్టాఫీస్ పొదుపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకే పరిమితమైన పెట్టుబడి ప్రయాణం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు, సిప్‌లు, ఈక్విటీ పెట్టుబడుల దిశగా వేగంగా విస్తరిస్తోంది. మహిళలు కేవలం పొదుపుదారులుగానే కాకుండా సంపద సృష్టించే ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. అమ్మమ్మ తరం బంగారం దాచితే, అమ్మ తరం ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆశ్రయించింది. ఇప్పుడు కూతురు తరం మాత్రం షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్)ల ద్వారా సంపద నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. భవిష్యత్తు భద్రత లక్ష్యమే అయినప్పటికీ, దాన్ని సాధించే మార్గం పూర్తిగా మారిపోయింది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గణాంకాలు మహిళల ఆర్థిక భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తున్నాయి.

మ‌హిల వాటా 25 శాతం..

దేశీయ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల్లో మహిళల వాటా 25 శాతం దాటింది. వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో మహిళల వాటా 33 శాతానికి పైగా ఉంది. మహిళల నిర్వహణలో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రూ.11.3 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లోల్లో మహిళల వాటా 35 శాతం ఉంది. 35 ఏళ్లలోపు వయసులోనే పెట్టుబడులు ప్రారంభించిన మహిళలు 80 శాతం ఉన్నారు. ఈ గణాంకాలు మహిళలు కేవలం డబ్బు దాచడమే కాకుండా, డబ్బుతో డబ్బు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మహిళలు బంగారాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు. కానీ బంగారం ఒక్కటే భవిష్యత్తు కాదని గుర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో లిక్విడిటీ, కుటుంబ భద్రత కోసం బంగారాన్ని కొనసాగిస్తూనే, దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం సిప్‌లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకుంటున్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆరోగ్యరంగం, కార్పొరేట్ సేవలు, స్టార్టప్‌లు, ఫ్రీలాన్సింగ్ రంగాల్లో మహిళల ఉపాధి అవకాశాలు పెరగడంతో వారి ఆదాయాలు కూడా పెరిగాయి. దీంతో కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర మరింత బలపడుతోంది.

దీర్ఘ‌కాలిక దృష్టితో పెట్టుబ‌డులు..

స్మార్ట్‌ఫోన్, ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు.. కొన్ని నిమిషాల్లో డీమ్యాట్ ఖాతా లేదా సిప్ ప్రారంభించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ డిజిటల్ సౌలభ్యమే లక్షలాది మహిళలను ఆర్థిక మార్కెట్లకు చేరువ చేసింది. పిల్లల చదువులు, వివాహాల కోసం మాత్రమే కాకుండా రిటైర్మెంట్, విదేశీ పర్యటనలు, సొంత వ్యాపారాలు, అత్యవసర నిధుల కోసం కూడా మహిళలు పెట్టుబడులు పెడుతున్నారు. పరిశ్రమ విశ్లేషణల ప్రకారం మహిళలు సాధారణంగా దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు కొనసాగిస్తారు. మార్కెట్ హెచ్చుతగ్గులకు అతిగా స్పందించకుండా, క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించడం వారి ప్రత్యేకతగా కనిపిస్తోంది. సిప్‌లను నిరంతరంగా కొనసాగించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి, సమతుల్య రిస్క్ ప్రొఫైల్, భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం, లక్ష్యాధారిత ఆర్థిక ప్రణాళిక లక్షణాల వల్ల మహిళల పోర్ట్‌ఫోలియోలు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తృతీయ శ్రేణి న‌గ‌రాల్లోనూ..

ఈ మార్పు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ మహిళలు పెద్ద ఎత్తున సిప్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఫైనాన్షియల్ కంటెంట్, యూట్యూబ్ ఛానళ్లు, ఫిన్‌టెక్ యాప్‌లు ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. నేటి మహిళల దృష్టిలో ఆర్థిక స్వాతంత్య్రం అంటే కేవలం జీతం సంపాదించడం కాదు. ఆ ఆదాయాన్ని ఆస్తులుగా, సంపదగా మార్చుకోవడంగా మార్పు చెందుతోంది. వారి దృష్టిలో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే తన పేరుమీద ఆస్తులు ఉండటం, అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం, రిటైర్మెంట్ కోసం ప్రత్యేక కార్పస్ నిర్మించడం, అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలగడం వంటివి పాటిస్తున్నారు.

బంగారాన్ని వదిలేయడం లేదు.. కానీ..

భారత మహిళలు బంగారాన్ని వదిలేయడం లేదు. అయితే బంగారం ఒక్కటే భవిష్యత్తు కాదని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. భద్రత కోసం బంగారం, స్థిరత్వం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు అనే సమతుల్య పెట్టుబడి విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇంటి బడ్జెట్‌ను నిర్వహించే మహిళ ఇప్పుడు దేశ సంపద నిర్మాణంలోనూ కీలక భాగస్వామిగా మారుతోంది. కుటుంబ పొదుపులను సంపదగా, సంపదను ఆర్థిక స్వాతంత్య్రంగా మార్చుతున్న ఈ నిశ్శబ్ద విప్లవం రాబోయే దశాబ్దంలో భారత ఆర్థిక వృద్ధికి కొత్త ఇంధనంగా నిలవనుంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement