త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఇరాన్‌తో ట్రంప్ డీల్‌.. దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో సూచీలు..

Stock Markets | అమెరికా-ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ముగించాల‌ని శాంతి ఒప్పందం చేసుకునేందుకు అంగీక‌రించ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీతో కొన‌సాగాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. అలాగే చ‌మురు ధ‌ర‌లు ప‌డిపోవ‌డం కూడా మార్కెట్ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది.

S

Business | Published On Jun 15, 2026, 4.05 pm IST

Stock Markets | ఇరాన్‌తో ట్రంప్ డీల్‌.. దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో సూచీలు..
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ముగించాల‌ని శాంతి ఒప్పందం చేసుకునేందుకు అంగీక‌రించ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీతో కొన‌సాగాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. అలాగే చ‌మురు ధ‌ర‌లు ప‌డిపోవ‌డం కూడా మార్కెట్ల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది. దీంతో సోమ‌వారం సెష‌న్‌లో బీఎస్ఈ సెన్సెక్స్‌, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 వ‌రుస‌గా రెండో సెష‌న్‌లోనూ లాభాల‌ను న‌మోదు చేశాయి. సెన్సెక్స్ 736 పాయింట్లు ఎగబాకి 76,264 వద్ద ముగియగా, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 23,854 స్థాయికి చేరుకుంది. దీంతో నిఫ్టీ మళ్లీ 23,850 మార్క్‌ను అధిగమించింది. అయితే రెండు సూచీలు కూడా ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల కంటే కొద్దిగా దిగువనే ముగిశాయి. ఆరంభంలో వ‌చ్చిన లాభాల‌ను సూచీలు నిల‌బెట్టుకోలేక‌పోయాయి. పెట్టుబ‌డిదారుల్లో ఇంకా కాస్త ఆందోళ‌న ఉంద‌ని ఇంట్రా డే క‌నిష్టాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఓపెనింగ్ రేంజ్ త‌రువాత మార్కెట్లు తిరిగి ఇంకా పైకి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దీంతో ఇంట్రా డే క‌నిష్టాల వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి.

భారీగా త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళనలు తగ్గాయి. దీంతో పెట్టుబడిదారుల్లో రిస్క్ తీసుకునే ధైర్యం పెరిగి ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతానికి పైగా పడిపోయింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది అనుకూల సంకేతంగా మారింది. ఈ పరిణామంతో డౌన్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీల షేర్లు లాభపడగా, అప్‌స్ట్రీమ్ చమురు ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి కనిపించింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 3.88 శాతం మేర ప‌త‌న‌మై బ్యారెల్‌కు 82 డాల‌ర్ల వ‌ద్ద‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 4.50 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 78 డాల‌ర్ల‌కు చేరింది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ కూడా కాస్త పెరిగింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి 39 పైసల మేర పెరిగి 94.71 వ‌ద్ద నిలిచింది.

అన్ని విభాగాల్లోనూ బ‌ల‌మైన కొనుగోళ్లు..

ఎల్ అండ్ టీ, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, మారుతి సుజుకి వంటి హెవీవెయిట్ షేర్లు మార్కెట్ ర్యాలీకి ప్రధాన బలం అందించాయి. నిఫ్టీ50లో 14 షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. లార్జ్‌క్యాప్ షేర్లకే పరిమితం కాకుండా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోనూ బలమైన కొనుగోళ్లు నమోదయ్యాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 782 పాయింట్లు పెరిగి 61,550 స్థాయికి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో పెరిగిన షేర్లు, పడిపోయిన షేర్లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం మార్కెట్ విస్తృత స్థాయిని తెలియ‌జేసింది. రియాల్టీ, ఆటో రంగాలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాయి. అలాగే ఐటీ ఇండెక్స్ వరుసగా ఎనిమిది సెషన్ల నష్టాల తర్వాత లాభాల్లోకి వచ్చింది. కో ఫోర్జ్ దాదాపు 3 శాతం ఎగబాకి టెక్నాలజీ రంగ రికవరీకి దోహదపడింది.

టాప్ గెయిన‌ర్లు, లూజ‌ర్లు..

మాక్ క్వెయిర్ సంస్థ ఫీనిక్స్ మిల్స్‌కు అవుట్ పెర్‌ఫామ్ రేటింగ్ క‌వ‌రేజ్‌ను ఇవ్వ‌డంతో ఫీనిక్స్ మిల్స్ షేర్లు 6 శాతం ఎగ‌బాకాయి. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ షేర్లు 3 శాతం, ఎస్ఈపీసీ, ఎస్ఏఐఎల్ షేర్లు 7 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంకు షేర్లు 2 శాతం లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్‌లో ట్రెంట్ లిమిటెడ్‌, శ్రీ‌రాం ఫైనాన్స్‌, ఐష‌ర్ మోటార్స్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌, ఇంట‌ర్ గ్లోబ్ ఏవియేష‌న్, అల్ట్రా టెక్ సిమెంట్ టాప్ గెయిన‌ర్లుగా నిలిచాయి. అలాగే బ‌జాజ్ ఆటో, ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో ఇండ‌స్ట్రీస్‌, హిందుస్థాన్ యూనిలివ‌ర్‌, అపోలో హాస్పిట‌ల్స్ షేర్లు టాప్ లూజ‌ర్లుగా న‌మోదు అయ్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement