త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..

NSE | దేశీయ మూలధన మార్కెట్ చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ (నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌) దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) పొందిన ఎన్‌ఎస్‌ఈ, జూన్ 15 లేదా 16 తేదీల్లో తన ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

S

Business | Published On Jun 15, 2026, 5.17 pm IST

NSE | ఎన్ఎస్ఈ ఐసీవోకు గ్రీన్ సిగ్నల్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెర.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
Advertisement

NSE | దేశీయ మూలధన మార్కెట్ చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ (నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌) దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) పొందిన ఎన్‌ఎస్‌ఈ, జూన్ 15 లేదా 16 తేదీల్లో తన ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఎన్‌ఎస్‌ఈ బోర్డు పబ్లిక్ ఇష్యూకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఐపీఓ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రస్తుతం అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ విలువను రూ.5 లక్షల కోట్లకు పైగా అంచనా వేస్తున్నారు. దాదాపు 1.8 లక్షల మంది వాటాదారులను కలిగి ఉన్న ఈ సంస్థ లిస్టింగ్‌పై దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలోనే..

ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలోనే జరగనుంది. అంటే ఎన్‌ఎస్‌ఈ కొత్త షేర్లను జారీ చేయకుండా, ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ వాటాలను విక్రయించనున్నారు. వాటాదారుల జాబితాలో ఎల్ఐసీ 10.72 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. అలాగే ఎస్‌బీఐ, దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ కలిసి సుమారు 7.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులలో అరాండా ఇన్వెస్ట్‌మెంట్స్‌, కెన‌డా పెన్ష‌న్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ) వంటి ప్రముఖ సంస్థలు కూడా ఎన్‌ఎస్‌ఈలో కీలక వాటాదారులుగా ఉన్నాయి. అయితే ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 2016లోనే దాదాపు రూ.10 వేల కోట్ల ఓఎఫ్ఎస్ ద్వారా లిస్టింగ్‌కు ప్రయత్నించినప్పటికీ, సంచలనం రేపిన కో-లొకేషన్ వివాదం కారణంగా సెబీ ఆ ప్రక్రియను నిలిపివేసింది. కొంతమంది బ్రోకర్లకు ట్రేడింగ్ వ్యవస్థలో ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

రూ.1880 కోట్ల‌తో ఎన్ఎస్ఈ సెటిల్‌మెంట్‌..

ఈ వివాదాలకు ముగింపు పలికేందుకు ఎన్‌ఎస్‌ఈ పలు సవరణ చర్యలు చేపట్టింది. కో-లొకేషన్, డార్క్ ఫైబర్ కేసులకు సంబంధించి సెబీ నిబంధనల ప్రకారం రూ.1,880 కోట్ల భారీ సెటిల్‌మెంట్ చెల్లించేందుకు సమర్పించిన దరఖాస్తుకు సెబీ ఉన్నత స్థాయి సలహా కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఐపీఓ మార్గంలో ఉన్న అతిపెద్ద చట్టపరమైన అడ్డంకి తొలగిపోయింది. ఈ భారీ లిస్టింగ్ కోసం ఎన్‌ఎస్‌ఈ దాదాపు 20 మంది ప్రముఖ మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారులు, ఇతర మార్కెట్ మధ్యవర్తులను నియమించింది. మరోవైపు, ఈ లిస్టింగ్ వార్తల ప్రభావంతో ఎన్‌ఎస్‌ఈలో పరోక్ష భాగస్వామ్యం ఉన్న ఐఎఫ్‌సీఐ లిమిటెడ్ షేర్లు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి.

దశాబ్ద కాలంగా కొనసాగిన నియంత్రణ, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి లిస్టింగ్ దిశగా అడుగులు వేస్తున్న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలవనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లిస్టింగ్ భారత మూలధన మార్కెట్లకు కొత్త మైలురాయిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ‌ని అంటున్నారు.

Advertisement
Advertisement