త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Retirement Planning | రిటైర్మెంట్ ఆదాయానికి ఏది బెస్ట్? డివిడెండ్ షేర్లా.. ఎస్‌డబ్ల్యూపీలా?

Retirement Planning | రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందాలని భావించే పెట్టుబడిదారులకు డివిడెండ్ చెల్లించే షేర్లు ఎన్నో ఏళ్లుగా ప్రముఖ ఎంపికగా ఉన్నాయి. అయితే కేవలం అధిక డివిడెండ్ యీల్డ్‌ను చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

S

Business | Published On Jul 4, 2026, 12.14 pm IST

Retirement Planning | రిటైర్మెంట్ ఆదాయానికి ఏది బెస్ట్? డివిడెండ్ షేర్లా.. ఎస్‌డబ్ల్యూపీలా?
Advertisement

Retirement Planning | రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందాలని భావించే పెట్టుబడిదారులకు డివిడెండ్ చెల్లించే షేర్లు ఎన్నో ఏళ్లుగా ప్రముఖ ఎంపికగా ఉన్నాయి. అయితే కేవలం అధిక డివిడెండ్ యీల్డ్‌ను చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి చేసే ముందు పన్నుల ప్రభావం, డివిడెండ్ చెల్లింపుల స్థిరత్వం, అలాగే మూలధన భద్రత వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలని చెబుతున్నారు. మనీఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మోహిత్ గంగ్ తెలిపిన ప్రకారం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల జరిగిన మార్కెట్ కరెక్షన్ తర్వాత డివిడెండ్ చెల్లించే షేర్లు ఆదాయ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికీ మంచి స్థానం కలిగి ఉన్నాయ‌ని తెలిపారు. భారీ నగదు నిల్వలు కలిగిన ఐటీ కంపెనీల షేర్లు మార్కెట్లో గణనీయంగా పడిపోవడంతో వాటి డివిడెండ్ యీల్డ్ ప్రస్తుతం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోందని అన్నారు. అదేవిధంగా పీఎస్‌యూ కంపెనీలు, ఎంపిక చేసిన ఎఫ్‌ఎంసీజీ సంస్థలు, కమోడిటీ రంగానికి చెందిన కొన్ని కంపెనీలు కూడా క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లించే సంస్థలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప‌రిమితులేమిటి..?

అయితే డివిడెండ్ ఆధారిత పెట్టుబడులకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని మోహిత్ గంగ్ హెచ్చరించారు. పెట్టుబడిదారులకు లభించే డివిడెండ్ మొత్తం వారి ఆదాయపు పన్ను స్లాబ్‌కు అనుగుణంగా పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఉదాహరణకు 6 శాతం డివిడెండ్ యీల్డ్ ఇచ్చే షేర్‌ను ఎంచుకున్నా, పన్నులు చెల్లించిన తర్వాత చేతికి వచ్చే వాస్తవ యీల్డ్ సుమారు 4 శాతానికి మాత్రమే పరిమితం అవుతుంద‌ని వివరించారు. అంతేకాకుండా డివిడెండ్ చెల్లింపులు కంపెనీ పనితీరుపై ఆధారపడటంతో అవి క్రమబద్ధంగా ఉండవని, అందువల్ల రిటైర్మెంట్ ఆదాయానికి ఒక్కటే ఆధారంగా వీటిని ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని సూచించారు. మ్యూచువల్ ఫండ్లలో ఉండే ఐడీసీడబ్ల్యూ (ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రావల్) ఎంపికపై కూడా ఆయన విమర్శనాత్మకంగా స్పందించారు. ప్రస్తుతం ఐడీసీడబ్ల్యూ మంచి ఎంపిక కాదని పేర్కొంటూ, ఈ విధానంలో చెల్లించే ప్రతి పంపిణీతో ఫండ్ నెట్ అసెట్ వ్యాల్యూ తగ్గిపోతుందని, పెట్టుబడిదారుడు పొందిన మొత్తం కూడా పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపారు.

ఎస్‌డబ్ల్యూపీ ఉత్త‌మ‌మా..?

దీనికి బదులుగా సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ని ఎంచుకోవాలని ఆయన సిఫారసు చేశారు. ఐడీసీడబ్ల్యూతో పోలిస్తే ఎస్‌డబ్ల్యూపీ ఎప్పుడూ మెరుగైన ఎంపిక అని పేర్కొన్నారు. ఎస్‌డబ్ల్యూపీలో ప్రతి ఉపసంహరణలో క్యాపిటల్ గెయిన్స్ భాగంపైనే పన్ను వర్తిస్తుందని, పెట్టుబడిగా పెట్టిన అసలు మూలధనం మాత్రం పన్ను లేకుండా తిరిగి వస్తుందని చెప్పారు. దీంతో మొత్తం ఉపసంహరణపై పన్ను పడకుండా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది మరింత పన్ను ప్రయోజనకరమైన విధానంగా మారుతుందని వివరించారు. స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి రీట్స్ (REITs), ఇన్‌విట్స్ (InvITs) కూడా మంచి ప్రత్యామ్నాయాలని మోహిత్ గంగ్ తెలిపారు. ఇవి అద్భుతమైన పెట్టుబడి సాధనాలని పేర్కొంటూ, ఆదాయం క్రమం తప్పకుండా అందించే సమర్థవంతమైన వ్యవస్థగా వీటిని అభివర్ణించారు. నిబంధనల ప్రకారం రీట్స్, ఇన్‌విట్స్ తమ నగదు ప్రవాహంలో 90 శాతం పెట్టుబడిదారులకు పంపిణీ చేయాల్సి ఉండటంతో, క్రమబద్ధమైన ఆదాయంతోపాటు మూలధనం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు.

పెట్టుబ‌డికి భ‌ద్ర‌త ఉండాలి..

అయితే ఎక్కువ రాబడుల కంటే పెట్టుబడి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ పొదుపు పథకాలు, అధిక నాణ్యత కలిగిన బాండ్లు ఇప్పటికీ మంచి ఎంపికలుగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి రిటైర్డ్ వ్యక్తికి ఒకే పెట్టుబడి సాధనం సరిపోదని, పన్నులు చెల్లించిన తర్వాత చేతికి వచ్చే వాస్తవ రాబడి, ఆదాయం స్థిరత్వం, అలాగే పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement