త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో 8-4-3 రూల్‌.. ఏంటిది.. దీంతో భారీ కార్ప‌స్ ఎలా సాధ్య‌మ‌వుతుంది..?

Mutual Funds | కేవ‌లం అధిక ఆదాయం ఉన్న‌వారు మాత్ర‌మే డ‌బ్బును పొదుపు చేయ‌గ‌లుగుతార‌ని, వారే కోటీశ్వ‌రులుగా మారే అవ‌కాశాలు ఉంటాయ‌ని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్ర‌స్తుత మ్యుచువ‌ల్ ఫండ్ ప్ర‌పంచంలో కేవ‌లం అధిక ఆదాయం ఉన్న‌వారు మాత్ర‌మే కాదు, ఆదాయం ఎలా ఉన్నా స‌రే స‌రిగ్గా పొదుపు చేస్తే వారు జీవిత కాలంలో కోటీశ్వ‌రులు అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

S

Business | Published On Jul 1, 2026, 5.05 pm IST

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో 8-4-3 రూల్‌.. ఏంటిది.. దీంతో భారీ కార్ప‌స్ ఎలా సాధ్య‌మ‌వుతుంది..?
Advertisement

Mutual Funds | కేవ‌లం అధిక ఆదాయం ఉన్న‌వారు మాత్ర‌మే డ‌బ్బును పొదుపు చేయ‌గ‌లుగుతార‌ని, వారే కోటీశ్వ‌రులుగా మారే అవ‌కాశాలు ఉంటాయ‌ని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్ర‌స్తుత మ్యుచువ‌ల్ ఫండ్ ప్ర‌పంచంలో కేవ‌లం అధిక ఆదాయం ఉన్న‌వారు మాత్ర‌మే కాదు, ఆదాయం ఎలా ఉన్నా స‌రే స‌రిగ్గా పొదుపు చేస్తే వారు జీవిత కాలంలో కోటీశ్వ‌రులు అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ్యుచువ‌ల్ ఫండ్స్‌కు ఉండే కాంపౌడింగ్ శ‌క్తి వ‌ల్ల దీర్ఘ‌కాలంలో ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో నెల నెలా సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) రూపంలో పెట్టుబ‌డుల‌ను పెడితే దీర్ఘ‌కాలంలో గ‌ణ‌నీయ‌మైన సంప‌ద‌ను సృష్టించ‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు తెలిపిన ప్ర‌కారం 8-4-3 అనే కాంపౌడింగ రూల్‌ను పాటిస్తూ స్థిర‌మైన పెట్టుబ‌డులు పెడితే చ‌క్క‌ని లాభాలు ఉంటాయ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కార్ప‌స్ వేగంగా రెట్టింపు అవుతుంద‌ని అంటున్నారు.

8-4-3 రూల్ అంటే..

8-4-3 రూల్ అంటే ఈక్విటీ మ్యుచువల్ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే 15 ఏళ్ల కాలంలో సంపద ఎలా పెరుగుతుందో వివరించే సులభమైన కాన్సెప్ట్. ఇది వార్షికంగా సుమారు 12 శాతం రాబడి వస్తుందనే అంచనాపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లకు ఈ స్థాయి రాబడి సాధ్యమేనని భావించినప్పటికీ, వాస్తవ రాబడులు మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతాయి. ఎలాంటి రాబడికీ హామీ ఉండదు. నెలకు రూ.21,250 చొప్పున, వార్షికంగా 12 శాతం రాబడి వస్తుందనే అంచనాతో పెట్టుబడి పెడితే, 8 సంవత్సరాల తర్వాత కార్పస్ సుమారు రూ.34 లక్షలకు చేరుకుంటుంది. ఈ కాలంలో మొత్తం పెట్టుబడి రూ.20.4 లక్షలు మాత్రమే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కాంపౌండింగ్ ద్వారా వచ్చిన లాభంగా ప‌రిగ‌ణించాలి. ఆ తర్వాత మరో నాలుగు సంవత్సరాలు, అంటే మొత్తం 12 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి కార్పస్ సుమారు రూ.67.8 లక్షల నుంచి రూ.68.5 లక్షల మధ్యకు పెరుగుతుంది. మొదటి ఎనిమిది సంవత్సరాల్లో నిర్మించిన సంపదకు సమానమైన వృద్ధి కేవలం నాలుగు సంవత్సరాల్లోనే దాదాపు సాధ్యమవుతుంది.

మొత్తం రాబ‌డి రూ.1.06 కోట్ల‌కు పైనే..

మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగిస్తే, అంటే మొత్తం 15 సంవత్సరాల తర్వాత పెట్టుబడి విలువ సుమారు రూ.1.06 కోట్లకు చేరుకుంటుంది. ఈ 15 ఏళ్లలో పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.38.25 లక్షలు మాత్రమే. మిగిలిన సుమారు రూ.68 లక్షలు కాంపౌండింగ్ వల్ల వచ్చిన లాభమే. ఈ లెక్కలు నెలవారీ కాంపౌండింగ్‌తో వార్షికంగా 12 శాతం స్థిరమైన రాబడి వస్తుందనే అంచనాపై రూపొందించిన ఉదాహరణ మాత్రమే. వాస్తవ పెట్టుబడి రాబడులు మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి మారుతాయి. 8-4-3 విధానంలో ప్రధాన బలం మార్కెట్‌ను అంచనా వేసి సరైన సమయాన్ని వెతకడం కాకుండా, నిరంతరాయంగా పెట్టుబడి కొనసాగించడాన్ని ప్రోత్సహించడం. ఎస్‌ఐపీ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించుకోవడంతోపాటు రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డులు..

దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని మించే రాబడులను అందించే సామర్థ్యాన్ని క‌లిగి ఉంటాయి. దీంతో పెట్టుబడిదారుల కొనుగోలు శక్తి కూడా మెరుగ్గా నిలిచి ఉంటుంది. నెలకు రూ.21,250 పెట్టుబడి అంటే చాలా మంది వేతన ఉద్యోగులకు సాధ్యమైన మొత్తమే. ఆదాయం పెరిగే కొద్దీ ఎస్‌ఐపీ మొత్తాన్ని కూడా పెంచుకుంటే మరింత పెద్ద కార్పస్‌ను నిర్మించుకోవచ్చు. అలాగే ప్రారంభంలో తక్కువ మొత్తంతో మొదలుపెట్టి, పెట్టుబడి కాలాన్ని పెంచడం ద్వారా కూడా భారీ సంపదను సృష్టించే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement