త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR Challenges Revanth Reddy | బాహుబలిలో భల్లాల దేవుడి గతే రేవంత్‌కి పడుతుంది..!

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రం దివాళా తీసిందని చెప్పడంపై మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు.

J

Telangana | Published On Jul 1, 2026, 4.49 pm IST

KTR Challenges Revanth Reddy | బాహుబలిలో భల్లాల దేవుడి గతే రేవంత్‌కి పడుతుంది..!
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఓపెన్ చాలెంజ్
  • వరంగల్ లేదా అశోక్ నగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని సవాల్
  • ఢిల్లీలో ఇజ్జత్ లేదంటూనే 30 నెలల్లో 72 సార్లు ఎందుకు వెళ్లారని సూటిగా ప్రశ్న
  • కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకే రూ.1,13,000 కోట్లు బాకీ పడిందని, దాన్ని తీర్చాకే ఉత్సవాలు చేయాలని డిమాండ్
  • సొంత రాష్ట్రాన్నే క్యాన్సర్ రోగితో పోల్చడం, దివాళా తీసిందనడం రేవంత్ భావదారిద్య్రానికి నిదర్శనమని విమర్శ

KTR Challenges Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన, రైతుల సమస్యలు, నిరుద్యోగుల హామీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి అల్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

చర్చకు వచ్చే దమ్ముందా రేవంత్?

నిరుద్యోగుల పైనా, రైతుల పైనా ఏ అంశంపైనైనా చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. "మీ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ హామీ ఇచ్చిన వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? లేక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెట్టుకుందామా? టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ కూడా నీ ఇష్టం.. నువ్వు వస్తావో, మీ రాహుల్ గాంధీ వస్తాడో రండి" అని ఓపెన్ చాలెంజ్ విసిరారు. గణాంకాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను బయటపెట్టకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు.

ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదంటావ్.. మరి 72 సార్లు ఎందుకు వెళ్లావ్?

సొంత రాష్ట్రాన్ని దివాలా తీసిందని, క్యాన్సర్ (Cancer), ఎయిడ్స్ (AIDS) రోగితో పోల్చడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. "ఇంతటి భావదారిద్య్రం ఉన్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలోనే ఎక్కడా చూడలేదు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు (గౌరవం లేదు) అని రేవంత్ రెడ్డి అంటారు.. మరి 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు?" అని నిలదీశారు.

రైతులకు లక్ష కోట్లు బాకీ.. దండుపాళ్యం బ్యాచ్!

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రూ. 1,13,000 కోట్లు బాకీ ఉందని కేటీఆర్ లెక్కలతో సహా వివరించారు.

  • రైతుబంధు కింద రూ. 30,000 కోట్లు
  • కౌలు రైతులకు రూ. 22,500 కోట్లు
  • రుణమాఫీ (Loan Waiver) కింద రూ. 29,500 కోట్లు
  • రైతు కూలీలకు రూ. 15,000 కోట్లు
  • పంటల బోనస్ కింద రూ. 16,000 కోట్లు

"ఇవన్నీ ఎగ్గొట్టి, రైతులను నిండా ముంచి ఇప్పుడు ఆశీర్వాద సభలు పెడుతున్నారు. అట్టర్ ప్లాప్ సినిమాకి అర్ధశత దినోత్సవం చేయడం అంటే ఇదే" అని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ ఉండగానే రూ. 200 కోట్లతో ఇంకో క్యాంపు ఆఫీస్ (Camp Office), కేవలం కాంపౌండ్ వాల్ కోసమే రూ. 19 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు.

కేసీఆర్ హయాంలో కోటి ఎకరాల మాగాణి

తెలంగాణ ఏర్పడిన కొత్తలో 26 లక్షల హెక్టార్ల సాగు ఉంటే, కేసీఆర్ (KCR) పాలనలో అది 59.89 లక్షల హెక్టార్లకు పెరిగిందని గుర్తు చేశారు. "కేసీఆర్ గద్దె దిగేనాటికి వరి ఉత్పత్తి డబుల్ అయింది. ఇది మార్క్‌ఫెడ్ వెబ్‌సైట్‌లోనే ఉంది. ఎంత ధనిక రాష్ట్రమైనా మీ లాంటి ఒక దండుపాళ్యం ముఠా చేస్తున్న 30 శాతం కమీషన్ల లూటీకి తట్టుకుంటుందా?" అని ప్రశ్నించారు. "బాహుబలి (Bahubali) సినిమాలో భల్లాల దేవుడికి ఏ గతి పట్టిందో.. రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్తులో అదే గతి పడుతుంది" అని కేటీఆర్ హెచ్చరించారు.

Advertisement
Advertisement