త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Voice Only Plans | వాయిస్ ఓన్లీ ప్లాన్లు అమ‌ల‌య్యేనా.. ఇవ్వ‌లేమ‌ని టెలికాం సంస్థ‌ల వాద‌న‌..

Voice Only Plans | భారత్‌లో టెలికాం వినియోగదారులకు తక్కువ ధరలో వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే రీచార్జ్ ప్లాన్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రతిపాదనకు జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా (వీఐ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

S

Business | Published On Jun 22, 2026, 11.42 am IST

Voice Only Plans | వాయిస్ ఓన్లీ ప్లాన్లు అమ‌ల‌య్యేనా.. ఇవ్వ‌లేమ‌ని టెలికాం సంస్థ‌ల వాద‌న‌..
Advertisement

Voice Only Plans | భారత్‌లో టెలికాం వినియోగదారులకు తక్కువ ధరలో వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే రీచార్జ్ ప్లాన్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రతిపాదనకు జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా (వీఐ) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం డేటాతో కూడిన బండిల్డ్ ప్లాన్లతో పోలిస్తే తక్కువ ధరలో, వివిధ వ్యాలిడిటీ కాలపరిమితులతో వాయిస్-అండ్-ఎస్ఎంఎస్ ప్లాన్లు అందించాలని ట్రాయ్ కోరుతోంది. అయితే ఈ ప్రతిపాదన సాంకేతికంగా అమలు చేయడం కష్టమని, ప్రస్తుత టారిఫ్ విధానాలకు విరుద్ధమని టెలికాం కంపెనీలు వాదిస్తున్నాయి. మరోవైపు, అనేక మంది వినియోగదారులు తాము ఉపయోగించని సేవల కోసం కూడా డబ్బులు చెల్లిస్తున్నామ‌ని వినియోగదారుల సంఘాలు పేర్కొంటున్నాయి.

వాయిస్ ప్లాన్ల‌ను ఇవ్వాలి: ట్రాయ్‌

ఇటీవ‌ల‌ నిర్వహించిన ట్రాయ్ ఓపెన్ హౌస్ చర్చలో టెలికాం సంస్థలు తమ అభ్యంతరాలను వెల్లడించాయి. ఈ సమావేశంలో డ్రాఫ్ట్ టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ థర్టీంత్ అమెండ్మెంట్ రెగ్యులేషన్-2026పై చర్చ జరిగింది. వాయిస్, ఎస్ఎంఎస్ మాత్రమే కలిగిన రీచార్జ్ ప్లాన్ల లభ్యతను పెంచడమే ఉద్దేశంగా ఈ చ‌ర్చ నిర్వ‌హించారు. ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం కాలింగ్, మెసేజింగ్, డేటా ప్రయోజనాలతో ఉన్న అన్ని రకాల వ్యాలిడిటీ పీరియడ్లలో వాయిస్-అండ్-ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే ప్లాన్లను కూడా టెలికాం సంస్థలు అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ల ధరలు సమానమైన బండిల్డ్ ప్లాన్ల కంటే తక్కువగా ఉండాలని, వినియోగదారులకు సులభంగా కనిపించే విధంగా అన్ని కస్టమర్ టచ్ పాయింట్లలోనూ ప్రదర్శించాలని ట్రాయ్ సూచించింది. అయితే టెలికాం కంపెనీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, టారిఫ్ రూపకల్పనలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవద్దని కోరాయి. ప్లాన్ల నిర్మాణం, ధరల నిర్ణయం పూర్తిగా మార్కెట్ ఆధారంగా ఉండాలని, అదనపు నియంత్రణలు వ్యాపార నమూనాలు, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయ‌ని సంస్థలు హెచ్చరించాయి.

వాయిస్ ఓన్లీ ఇవ్వ‌డం కుద‌ర‌దు: టెలికాం సంస్థ‌లు

రిలయన్స్ జియో ప్రత్యేకంగా వాయిస్ సేవలను డేటా సేవల నుంచి వేరు చేయడం ప్ర‌స్తుత మొబైల్ నెట్‌వర్క్‌లలో ఆచరణ సాధ్యం కాదని పేర్కొంది. ఆధునిక 4జీ, 5జీ నెట్‌వర్క్‌లు ఒకే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి పనిచేస్తాయని, వాయిస్ కమ్యూనికేషన్ కూడా అదే నెట్‌వర్క్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా అందించడం జ‌రుగుతుందని జియో వాదించింది. అదేవిధంగా తక్కువ ధరలో ఉండే వాయిస్-అండ్-ఎస్ఎంఎస్ ప్లాన్లను స్పామ్ ప్రచారాలు లేదా మోసపూరిత కార్యకలాపాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని జియో ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఎంట్రీ-లెవల్ వినియోగదారుల్లో 88 శాతం మంది మొబైల్ డేటాను ఉపయోగిస్తున్నారని, స్టాండ్‌అలోన్ వాయిస్ ప్లాన్లపై ఆసక్తి చాలా పరిమితంగానే ఉందని సంస్థ తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా స్పందించింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లు, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్లు, ఆథెంటికేషన్ సేవల కారణంగా కొంతమేర డేటాను తప్పనిసరిగా వినియోగిస్తారని పేర్కొంది. ప్లాన్‌లో డేటా అలవెన్స్ లేకపోతే వినియోగదారులపై అదనపు ఛార్జీలు పడే ప్రమాదం ఉందని సంస్థ అభిప్రాయపడింది.

వాడ‌ని డేటాకు రూ.20వేల కోట్ల ఖ‌ర్చు..

భారతి ఎయిర్‌టెల్ మాత్రం దేశంలో అనేక డిజిటల్ సేవల అందుబాటుకు ఇంటర్నెట్ కీలకంగా మారిందని పేర్కొంది. వాయిస్-ఒన్లీ ప్లాన్ల వినియోగం పెరగడం వల్ల భారత డిజిటల్ ఎకోసిస్టమ్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుంద‌ని అభిప్రాయపడింది. మరోవైపు, గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకారం దేశంలో ప్రస్తుతం 30 నుంచి 35 కోట్ల వరకు ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఉన్నార‌ని తేలింది. వీరిలో సుమారు 10 నుంచి 15 కోట్ల మంది మొబైల్ డేటా సేవలను అసలు ఉపయోగించరని సంస్థ అంచనా వేసింది. అయినప్పటికీ, వారు ఉపయోగించని డేటా ప్రయోజనాల కోసం కూడా డబ్బులు చెల్లిస్తున్నారని పేర్కొంది. ఈ వర్గానికి చెందిన వినియోగదారులు ప్రతి సంవత్సరం రూ.15వేల నుంచి రూ.20వేల కోట్ల వరకు ఉపయోగించని డేటా ప్రయోజనాలపై ఖర్చు చేస్తున్నారని వినియోగదారుల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అలాగే గిరిజన, మారుమూల, కొండ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఇంకా స్థిరంగా అందుబాటులో లేని పరిస్థితుల్లో కూడా వినియోగదారులు డేటా కలిగిన ప్లాన్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు గుర్తు చేశారు.

ప‌రిశీలిస్తున్న ట్రాయ్‌..

అలాగే ఎంట్రీ-లెవల్ రీచార్జ్ ప్లాన్లను ఉపయోగించే వినియోగదారులు ప్రీమియం ప్లాన్ల వినియోగదారులతో పోలిస్తే ప్రతి జీబీ డేటాకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని వినియోగదారుల సంఘాలు వాదిస్తున్నాయి. వారి లెక్కల ప్రకారం ఈ వర్గం వినియోగదారులకు ప్రతి జీబీ డేటా ఖర్చు సుమారు రూ.94 నుంచి రూ.99 వరకు పడుతోంది. టెలికాం సంస్థలు, వినియోగదారుల సంఘాలు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాలను ట్రాయ్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. అనంతరం ఈ సవరణను అమలు చేయాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Advertisement
Advertisement