త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్‌లెస్ క‌నెక్ష‌న్లు..

TRAI | భారత టెలికాం రంగం గ‌త జూన్ నెలలో మరోసారి వృద్ధి బాట పట్టింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (టీఆర్‌ఏఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలోని మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ బేస్ మే చివరినాటికి ఉన్న 1,343.10 మిలియన్ల నుంచి జూన్ చివరినాటికి 1,348.08 మిలియన్లకు పెరిగింది.

S

Business | Published On Jul 29, 2026, 6.08 pm IST

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్‌లెస్ క‌నెక్ష‌న్లు..
Advertisement

TRAI | భారత టెలికాం రంగం గ‌త జూన్ నెలలో మరోసారి వృద్ధి బాట పట్టింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (టీఆర్‌ఏఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలోని మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ బేస్ మే చివరినాటికి ఉన్న 1,343.10 మిలియన్ల నుంచి జూన్ చివరినాటికి 1,348.08 మిలియన్లకు పెరిగింది. దీంతో నెలవారీ వృద్ధి రేటు 0.37 శాతంగా నమోదైంది. ఈ వృద్ధికి ప్రధాన కారణం వైర్‌లెస్ సేవల విస్తరణే అని విశ్లేష‌కులు చెబుతున్నారు. జూన్ నెలలో భారత్‌లో వైర్‌లెస్ కనెక్షన్లు 130 కోట్ల మార్క్‌ను దాటాయి. అదే సమయంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా 5జి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) సేవలు, మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సెల్యులర్ కనెక్షన్లు గణనీయంగా పెరిగాయి. జూన్ చివరి నాటికి దేశంలో మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,300.25 మిలియన్లకు చేరుకుంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 749.39 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 550.86 మిలియన్ల కనెక్షన్లు ఉన్నాయి.

మొత్తం స‌బ్‌స్క్రైబ‌ర్లు 1348.08 మిలియ‌న్లు..

దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లు 1,348.08 మిలియన్లు ఉండగా, వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు 1,300.25 మిలియన్లు, వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్లు 47.82 మిలియన్లు, బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 1,087.50 మిలియన్లుగా ఉన్నారు. దేశ టెలిడెన్సిటీ మే నెలలో 94.02 శాతం ఉండగా, జూన్‌లో 94.31 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో టెలిడెన్సిటీ 153.43 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 60.89 శాతంగా నమోదైంది. మొత్తం టెలిఫోన్ కనెక్షన్లలో పట్టణ ప్రాంతాల వాటా 58.76 శాతంగా ఉంది. అక్కడ 792.06 మిలియన్ల కనెక్షన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 556.01 మిలియన్ల కనెక్షన్లు ఉండగా, వాటి వాటా 41.24 శాతంగా ఉంది. ఎం2ఎం సెల్యులర్ కనెక్షన్లతో కలిపి దేశంలోని మొత్తం వైర్‌లెస్ మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,282.38 మిలియన్లకు చేరుకుంది. ఇందులో ప్రైవేట్ టెలికాం కంపెనీల వాటా 92.73 శాతం కాగా, ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కలిసి 7.27 శాతం మార్కెట్‌ను కలిగి ఉన్నాయి.

రిల‌య‌న్స్ జియో టాప్‌లో..

జూన్ చివరినాటికి వైర్‌లెస్ మొబైల్ మార్కెట్ షేర్‌లో రిలయన్స్ జియో 39.27 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. భారతి ఎయిర్‌టెల్ 37.96 శాతంతో రెండో స్థానంలో, వొడాఫోన్ ఐడియా 15.50 శాతంతో మూడో స్థానంలో, బీఎస్‌ఎన్‌ఎల్ 7.25 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. జూన్ నెలలో వైర్‌లెస్ మొబైల్ సబ్‌స్క్రైబర్లు 5.38 మిలియన్లు పెరిగారు. ఇందులో అత్యధికంగా భారతి ఎయిర్‌టెల్ 2.99 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకుంది. రిలయన్స్ జియో 2.14 మిలియన్లను, వొడాఫోన్ ఐడియా 1,63,757 మందిని, బీఎస్‌ఎన్‌ఎల్ 94,006 మంది వినియోగదారులను చేర్చుకున్నాయి. ఇక వైర్‌లైన్ సేవల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. మే నెలలో 48.64 మిలియన్లుగా ఉన్న వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్ జూన్ చివరికి 47.82 మిలియన్లకు పడిపోయింది. నెలవారీగా ఇది 1.67 శాతం క్షీణతగా ట్రాయ్ వెల్లడించింది.

స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకున్న వొడాఫోన్ ఐడియా..

వొడాఫోన్ ఐడియా వరుసగా ఐదో నెల కూడా నికర సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. జూన్ నెలలో 1,63,757 మంది కొత్త వినియోగదారులను చేర్చుకుని మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌ను 198.82 మిలియన్లకు తీసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్ (ఈస్ట్), గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఒడిశా, అసోం, బీహార్ క‌లిపి మొత్తం తొమ్మిది టెలికాం సర్కిళ్లలో నెట్‌వర్క్ విస్తరణ, సేవల మెరుగుదల కారణంగా ఈ వృద్ధి నమోదైంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 5జి సేవలు దేశంలోని 200కుపైగా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. దేశంలోని బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మే నెలలో 1,080.15 మిలియన్ల నుంచి జూన్‌లో 1,087.50 మిలియన్లకు పెరిగింది. నెలవారీ వృద్ధి రేటు 0.68 శాతంగా నమోదైంది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 1,021.43 మిలియన్ల కనెక్షన్లు ఉండగా, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ 47.71 మిలియన్లు, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ 18.36 మిలియన్లుగా నమోదయ్యాయి.

బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల్లోనూ జియో హ‌వా..

బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో రిలయన్స్ జియో 532.21 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతి ఎయిర్‌టెల్ 379.97 మిలియన్లతో రెండో స్థానంలో, వొడాఫోన్ ఐడియా 130.13 మిలియన్లతో మూడో స్థానంలో, బీఎస్‌ఎన్‌ఎల్ 27.44 మిలియన్లతో నాలుగో స్థానంలో, ఆట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ 2.45 మిలియన్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు కంపెనీలు కలిపి దేశ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో 98.59 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జియో వాటా 48.94 శాతం, ఎయిర్‌టెల్ 34.94 శాతం, వొడాఫోన్ ఐడియా 11.97 శాతంగా నమోదైంది. 5జి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మే నెలలో 12.73 మిలియన్లు ఉండగా, జూన్‌లో 12.94 మిలియన్లకు పెరిగింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 6.44 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 6.49 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. భారతి ఎయిర్‌టెల్ వద్ద 3.82 మిలియన్ల 5జి ఎఫ్‌డబ్ల్యూఏ వినియోగదారులు ఉండగా, రిలయన్స్ జియో వద్ద 9.11 మిలియన్ల మంది ఉన్నారు.

ఎం2ఎం క‌నెక్ష‌న్ల‌లో ఎయిర్‌టెల్ టాప్‌..

యూబీఆర్ ఆధారిత ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సబ్‌స్క్రైబర్లు 4.93 మిలియన్లకు చేరుకోగా, ఈ విభాగంలో గణాంకాలు నివేదించిన ఏకైక సంస్థ రిలయన్స్ జియోగా నిలిచింది. ఎం2ఎం సెల్యులర్ కనెక్షన్లు కూడా వృద్ధి సాధించాయి. మే నెలలో 131.11 మిలియన్లుగా ఉన్న ఈ కనెక్షన్లు జూన్ చివరికి 134.73 మిలియన్లకు పెరిగాయి. ఇందులో భారతి ఎయిర్‌టెల్ 82.77 మిలియన్లతో అగ్రస్థానంలో ఉండగా, రిలయన్స్ జియో 25.76 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 21.62 మిలియన్లు, బీఎస్‌ఎన్‌ఎల్ 4.57 మిలియన్ల కనెక్షన్లను కలిగి ఉన్నాయి. మొత్తం ఎం2ఎం మార్కెట్‌లో భారతి ఎయిర్‌టెల్ వాటా 61.44 శాతంగా ఉంది. ట్రాయ్ విడుదల చేసిన విజిటర్ లొకేషన్ రిజిస్టర్ (వీఎల్‌ఆర్) గణాంకాల ప్రకారం జూన్ లో 1,201.06 మిలియన్ల వైర్‌లెస్ మొబైల్ వినియోగదారులు యాక్టివ్‌గా ఉన్నారు. ఇది మొత్తం వైర్‌లెస్ మొబైల్ సబ్‌స్క్రైబర్లలో 93.66 శాతానికి సమానం.

ఎయిర్‌టెల్‌, జియో పోటా పోటీగా..

యాక్టివ్ సబ్‌స్క్రైబర్ నిష్పత్తిలో భారతి ఎయిర్‌టెల్ 99.27 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, రిలయన్స్ జియో 99.07 శాతం, వొడాఫోన్ ఐడియా 83.98 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్ 55.58 శాతంతో ఉన్నాయి. యాక్టివ్ వినియోగదారుల సంఖ్యలో ఎయిర్‌టెల్‌కు 486.80 మిలియన్ల సబ్‌స్క్రైబర్లలో 483.23 మిలియన్లు యాక్టివ్‌గా ఉండగా, జియోకు 503.58 మిలియన్లలో 498.89 మిలియన్ల మంది యాక్టివ్ వినియోగదారులుగా నమోదయ్యారు. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సేవలకు కూడా మంచి స్పందన లభించింది. జూన్ నెలలో 14.78 మిలియన్ల మంది తమ మొబైల్ నంబర్లను పోర్ట్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. టెలిడెన్సిటీ పరంగా ఢిల్లీ 368.12 శాతంతో దేశంలో అగ్రస్థానంలో ఉండగా, బీహార్ 63.95 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. జూన్ లో భారత టెలికాం రంగం వైర్‌లెస్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, 5జి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్, ఎం2ఎం కనెక్టివిటీ వంటి కొత్త విభాగాల వృద్ధితో ముందుకు సాగింది. మరోవైపు వైర్‌లైన్ కనెక్షన్లు తగ్గినా, వైర్‌లెస్ ఆధారిత కనెక్టివిటీ సేవలు టెలికాం రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ట్రాయ్ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
Advertisement