త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPO | ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..

IPO | అమెరికా-ఇరాన్‌లు శాంతి చ‌ర్చ‌ల దిశ‌గా పురోగ‌తి సాధిస్తుండ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ లాభాల బాట ప‌ట్టాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సోమ‌వారం లాభాల్లో కొన‌సాగుతున్నాయి.

S

Business | Published On Jun 22, 2026, 10.33 am IST

IPO | ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..
Advertisement

IPO | అమెరికా-ఇరాన్‌లు శాంతి చ‌ర్చ‌ల దిశ‌గా పురోగ‌తి సాధిస్తుండ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ లాభాల బాట ప‌ట్టాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సోమ‌వారం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అలాగే దేశీయ మూల‌ధ‌న మార్కెట్ ల‌లో ఐపీవోల సంద‌డి మ‌ళ్లీ మొద‌లైంది. ఈ వారం మెయిన్‌బోర్డు విభాగంలో మూడు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధుల స‌మీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌య్యాయి. క్రూయిజ్ సేవ‌ల‌ను అందించే వాట‌ర్‌వేస్ లీజ‌ర్ టూరిజం, ఆభ‌ర‌ణాల త‌యారీ సంస్థ అద్వైత్ జ్యువెల్స్‌, ఐటీ సంస్థ సీఎస్ఎం టెక్నాల‌జీస్‌లు ఈ వారంలో ఐపీవోల‌తో మార్కెట్‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఇక ప్యాకేజింగ్ రంగానికి చెందిన నాక్ ప్యాకేజింగ్ సైతం ప్రైస్ బ్యాండ్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.

ఈ వారంలో రానున్న ఐపీవోలు ఇవే..

వాటర్‌వేస్ లీజర్ టూరిజం సంస్థ ఐపీఓ ద్వారా రూ.585 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. షేర్ ధరల శ్రేణిని రూ.769-808గా నిర్ణయించింది. జూన్ 23 నుంచి 25 వరకు ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే జరగనుంది. అలాగే జైపూర్‌కు చెందిన అద్వైత్ జువెల్స్ సంస్థ రూ.165.16 కోట్ల ఐపీఓకు రానుంది. జూన్ 23న ప్రారంభమై 25న ముగియనున్న ఈ ఇష్యూకు షేర్ ధరను రూ.130-138 మధ్య నిర్ణయించారు. కంపెనీ 1.20 కోట్ల ఫ్రెష్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించిన నిధులను అప్పుల చెల్లింపులు, నిర్వహణ అవసరాలు, వ్యాపార విస్తరణకు వినియోగించనుంది. అలాగే ఐటీ సొల్యూషన్స్ సంస్థ సీఎస్‌ఎం టెక్నాలజీస్ రూ.146 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. షేర్ ధరల శ్రేణిని రూ.107-113గా నిర్ణయించింది. జూన్ 24న ప్రారంభమయ్యే ఈ ఇష్యూ జూన్ 27న ముగియనుంది. ఇది కూడా పూర్తిగా ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా జ‌ర‌గ‌నుంది.

రెండో అర్ధ‌భాగంలో జోష్‌..

ఈ ఏడాది రెండో అర్ధభాగంలో మరిన్ని భారీ ఐపీఓలు మార్కెట్‌ను ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది. క్విక్ కామర్స్ రంగంలో ముందున్న జెప్టో సుమారు రూ.10 వేల కోట్ల ఐపీఓకు సిద్ధమవుతుండగా, ఎస్‌బీఐ మ్యుచువ‌ల్ ఫండ్ రూ.13 వేల కోట్ల పబ్లిక్ ఇష్యూను పరిశీలిస్తోంది. అలాగే ఎన్ఎస్ఈ, జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థలు కూడా మార్కెట్ నియంత్రణ సంస్థకు ముసాయిదా పత్రాలు సమర్పించాయి. దీంతో 2026 తొలి అర్ధభాగంలో మందగించిన ఐపీఓ మార్కెట్ రెండో అర్ధభాగంలో గణనీయంగా ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement