త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tata Sons | టాటా సన్స్ ఏజీఎంకు డిసెంబర్ వరకు గడువు.. సెప్టెంబర్ 17న కీలక నిర్ణయం..?

Tata Sons | టాటా సన్స్ 108వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు డిసెంబర్ వరకు గడువు లభించింది. ఆగస్టు 18న తగినంత మంది సభ్యులు హాజరుకాకపోవడంతో ఏజీఎం వాయిదా పడిన నేపథ్యంలో ఈ గడువు కోరినట్లు సమాచారం. టాటా సన్స్ చరిత్రలో ఏజీఎం ఇలా వాయిదా పడటం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

S

Business | Published On Aug 31, 2026, 1.21 pm IST

Tata Sons | టాటా సన్స్ ఏజీఎంకు డిసెంబర్ వరకు గడువు.. సెప్టెంబర్ 17న కీలక నిర్ణయం..?
Advertisement

Tata Sons | టాటా సన్స్ 108వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు డిసెంబర్ వరకు గడువు లభించింది. ఆగస్టు 18న తగినంత మంది సభ్యులు హాజరుకాకపోవడంతో ఏజీఎం వాయిదా పడిన నేపథ్యంలో ఈ గడువు కోరినట్లు సమాచారం. టాటా సన్స్ చరిత్రలో ఏజీఎం ఇలా వాయిదా పడటం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. టాటా ట్రస్ట్స్ సెప్టెంబర్ 11న సమావేశం కానుండగా, టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ 17న సమావేశం కానుంది. సెప్టెంబర్ 17న జరిగే బోర్డు సమావేశంలో ఏజీఎంను తిరిగి నిర్వహించేందుకు కొత్త తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సెలెక్షన్ కమిటీ ఏర్పాటుపైనా బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఏజీఎంకు అవ‌రోధాలు..

ఆగస్టు 18న ఏజీఎంకు కోరం లేకపోవడానికి సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టీటీ)పై ఉన్న నియంత్రణలు ప్రధాన కారణంగా మారాయి. మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఆదేశాల మేరకు మే 15 నుంచి ఎస్‌ఆర్‌టీటీ సమావేశాలు నిర్వహించకుండా నిరోధించారు. టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 86 ప్రకారం ఏజీఎంకు కోరం ఉండాలంటే కనీసం ఐదుగురు సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఇందులో సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ కలిసి నామినేట్ చేసిన ఒక అధీకృత ప్రతినిధి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎస్‌ఆర్‌టీటీ సమావేశాలు నిర్వహించడం లేదా బోర్డు నిర్ణయాలు తీసుకోవడంపై ఆంక్షలు ఉండటంతో, రెండు ట్రస్టులు కలిసి అవసరమైన ప్రతినిధిని నామినేట్ చేయలేకపోయాయి. దీంతో ఏజీఎంకు అవసరమైన కోరం ఏర్పడలేదు. ఎస్‌ఆర్‌టీటీకి సంబంధించిన ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ సెప్టెంబర్ 8న విచారణ చేపట్టనున్నారు.

సెప్టెంబ‌ర్ 17 కీల‌కం..

కాగా టాటా సన్స్‌కు సంబంధించిన ఈ ఏజీఎం కీలక సమయంలో జరగాల్సి ఉంది. ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగిసిన తర్వాత తిరిగి నియామకం కోరబోనని ఆగస్టు 12న బోర్డుకు తెలియజేశారు. అలాగే వారసుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని బోర్డును కోరారు. ఈ వారసత్వ ప్రక్రియలో సెలెక్షన్ కమిటీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ కమిటీ ఏర్పాటు కూడా టాటా ట్రస్టులతో ముడిపడి ఉండటంతో ఎస్‌ఆర్‌టీటీపై కొనసాగుతున్న నియంత్రణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్‌ఓసీ) ఇచ్చిన గడువు పొడిగింపుతో టాటా సన్స్ ఏజీఎంను డిసెంబర్ వరకు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబర్ 17న జరగనున్న టాటా సన్స్ బోర్డు సమావేశం కీలకంగా మారింది. ఆ సమావేశంలో కొత్త ఏజీఎం తేదీతోపాటు సెలెక్షన్ కమిటీపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement