త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India | ఎయిర్ ఇండియాలో కుదుపు.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా!

Air India | విమానాల్లో త‌ర‌చూ సాంకేతిక స‌మ‌స్య‌లు, పెరుగుతున్న నిర్వ‌హ‌ణ వ్యయాలు, భారీగా న‌ష్టాలు చ‌విచూస్తున్న వేళ దేశీయ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియాకు (Air India) భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

G

Business | Published On Apr 7, 2026, 6.09 am IST

Air India | ఎయిర్ ఇండియాలో కుదుపు.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా!
Advertisement

Air India | త్రినేత్ర‌.న్యూస్‌: విమానాల్లో త‌ర‌చూ సాంకేతిక స‌మ‌స్య‌లు, పెరుగుతున్న నిర్వ‌హ‌ణ వ్యయాలు, భారీగా న‌ష్టాలు చ‌విచూస్తున్న వేళ దేశీయ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియాకు (Air India) భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. గ‌త వారం జ‌రిగిన బోర్డు మీటింగ్‌లో సంస్థ యాజ‌మాన్యం ఆయ‌న రాజీనామాను ఆమోదించిన‌ట్లు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయిట‌ర్స్ క‌థ‌నం పేర్కొంది. అయితే మరొకరిని నియమించే వరకు ఆయ‌న పదవిలో కొనసాగుతారని తెలిపింది. నాయ‌క‌త్వ మార్పు ప్ర‌క్రియ‌కు కొంత‌కాలం ప‌డుతుంద‌ని పేర్కొంది. అవసరమైతే ఆయన పదవీకాలాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించే అవకాశం ఉంది. కాగా, ఇప్ప‌టికే సంస్థ యాజ‌మాన్యం కొత్త సీఈవో కోసం వేతులాట ప్రారంభించిన‌ట్లు తెలిసింది.

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు చెందిన విల్స‌న్‌ 2022 జూలైలో ఎయిర్ ఇండియాలో చేరారు. అదేఏడాది సెప్టెంబ‌ర్‌లో సీఈవో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న ప‌ద‌వీకాలం 2027 జూన్ వ‌ర‌కు ఉన్న‌ది. ఎయిర్ లైన్స్ పునర్నిర్మాణం, ఆర్థిక మెరుగుదలకు ఐదేళ్ల పరివర్తన ప్రణాళికను ప్రకటించారు. ఈయన హయాంలో కొన్ని కీలక మార్పులు సజావుగా పూర్తయ్యాయి. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం పెద్దగా అంతరాయాల్లేకుండా ముందుకు సాగింది. విమానయాన సంస్థ తన విమానాలు, సామర్థ్యాన్ని విస్తరించింది. అయితే ఎయిర్‌లైన్స్ కార్యాచ‌ర‌ణ వేగం, క్షేత్ర‌స్థాయి మార్పుల పురోగ‌తిపై ఎయిర్ ఇండియా చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ పూర్తి సంతృత్తిగా లేర‌ని, అందుకే నాయ‌క‌త్వం మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని గ‌తంలోనే వార్త‌లు వెలువ‌డ్డాయి. విల్స‌న్ హ‌యాంలోనే అహ్మ‌దాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 260 మంది మరణించారు. ఈ ఘ‌ట‌న అయితే గత ఏడాది జూన్ 13న జ‌రిగిన విష‌యం తెలిసిందే.

కాంప్‌బెల్ ఎవరు?

54 ఏండ్ల‌ కాంప్‌బెల్ విల్సన్‌కు వైమానిక రంగంలో సుమారు 30 ఏండ్ల‌ అనుభవం ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌ కోసం ఆయన జపాన్, కెనడా, హాంకాంగ్‌లలో 15 ఏండ్లు పని చేశారు. 1996లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ)లో న్యూజిలాండ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించారు. టాటా అధీనంలోని విస్తారాకు ఈ ఎస్ఐఏ ఒక పార్ట్‌నర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఆయన ఎస్ఐఏ కోసం కెనడా, జపాన్, హాంకాంగ్‌లో విధులు నిర్వ‌హించారు. 2011లో సింగపూర్‌కు వచ్చి స్కూట్ విమానయాన సంస్థ సీఈవోగా చేరారు. 2016 వరకు అక్క‌డే కొన‌సాగారు. అనంతరం మళ్లీ ఎస్ఐఏలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)గా చేశారు. 2020 ఏప్రిల్‌లో తిరిగి స్కూట్ సీఈవోగా చేరాడు. ఆత‌ర్వాత ఎయిర్ ఇండియాలో చేరారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ..

కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో (Air India Express) కూడా నాయ‌క‌త్వ మార్పు త‌ప్ప‌ద‌ని తెలుస్తున్న‌ది. దాని సీఈవో అలోక్ సింగ్ పదవీకాలం కూడా 2027లో ముగియనుంది. టాటా సన్స్ తమ అన్ని విమానయాన వ్యాపారాలలో నాయకత్వ అవసరాలను అంచనా వేస్తున్న‌ద‌ని జాతీయ మీడాయాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement