త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | బ్లాక్ మండే.. రూ.13.31 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి..

Stock Markets | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన‌ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం ప‌డింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే ద‌లాల్ స్ట్రీట్‌లో అన్ని రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 50 మార్కెట్ సెష‌న్ ప్రారంభంలోనే 572 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో మొద‌లైంది.

S

Business | Published On Mar 9, 2026, 3.54 pm IST

Stock Markets | బ్లాక్ మండే.. రూ.13.31 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన‌ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం ప‌డింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే ద‌లాల్ స్ట్రీట్‌లో అన్ని రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 50 మార్కెట్ సెష‌న్ ప్రారంభంలోనే 572 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో మొద‌లైంది. త‌రువాత 23,700 ఇంట్రాడే క‌నిష్ట స్థాయికి చేరింది. అనంత‌రం కాస్త రిక‌వ‌ర్ అయి 24,028.05 వ‌ద్ద ముగిసింది. గ‌త శుక్ర‌వారం ముగింపుతో పోలిస్తే నిఫ్టీ 50 ఏకంగా 1.82 శాతం ప‌త‌నం అయింది. దీని ప్రభావంగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.13.31 లక్షల కోట్ల మ‌దుప‌ర్ల సంప‌ద ఆవిరైపోయింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలో 1842 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో మొద‌లవ‌గా కాసేప‌టికి 76,437 ఇంట్రా డే క‌నిష్ట స్థాయికి చేరుకుంది. అనంత‌రం కాస్త రిక‌వ‌ర్ అయి 77,509.95 వ‌ద్ద ముగిసింది. మొత్తంగా సెన్సెక్స్ క్రితం సెష‌న్‌తో పోలిస్తే 1.71 శాతం మేర న‌ష్ట‌పోయింది.

బ్యాంకింగ్ షేర్ల‌కు భారీగా న‌ష్టం..

ఈ పతనంతో నిఫ్టీ తన చరిత్రాత్మక గరిష్ట స్థాయి 26,340తో పోలిస్తే సుమారు 10 శాతం దిగువకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి భారత మార్కెట్లపై తీవ్ర‌మైన ఒత్తిడిని పెంచుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ బలహీనత ఇతర ప్రధాన సూచీల్లో కూడా స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 1763 పాయింట్లు క్షీణించింది. ముఖ్యంగా పెద్ద బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా ఈ పతనం చోటుచేసుకుంది. బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు సూచీలను కిందకు లాగడంలో కీలక పాత్ర పోషించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక్కటే నిఫ్టీ సూచీ నుంచి 100 పాయింట్లకుపైగా తగ్గింపుకు కారణమైంది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపి మరో 120 పాయింట్లకుపైగా నష్టాన్ని కలిగించాయి. మొత్తంగా చూస్తే ప్రధాన బ్యాంకింగ్ షేర్లు నిఫ్టీని 250 పాయింట్లకు పైగా దిగజార్చాయి.

టాప్ లూజ‌ర్లు, గెయిన‌ర్లు..

రంగాల వారీగా పరిశీలిస్తే అన్ని సూచీలు రెడ్‌లోనే ఉన్నాయి. ప్రతి రంగం కనీసం 1 శాతం తగ్గుదలతో ట్రేడింగ్ చేసింది. ఇందులో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ అత్యధికంగా పడిపోయింది. ఈ సూచీ 4 శాతానికి పైగా క్షీణించింది. వ్యక్తిగత షేర్లలో టాటా మోటార్స్ ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ లిమిటెడ్ భారీగా న‌ష్ట‌పోయింది. ఏకంగా 5.27 శాతం క్షీణించింది. అలాగే అల్ట్రా టెక్ సిమెంట్ (5.25 శాతం), మారుతి (4.67), ఐష‌ర్ మోటార్స్ (4.53), మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (4.44) షేర్లు కూడా భారీగా ప‌త‌నం అయ్యాయి. ఇక విప్రో 1.64 శాతం వృద్ధిని న‌మోదు చేయ‌గా, రిల‌య‌న్స్ (0.98), అపోలో హాస్పిట‌ల్స్ (0.86), ఇన్ఫోసిస్ (0.58), హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ (0.42) షేర్లు లాభ‌ప‌డ్డాయి.

113 డాల‌ర్లు తాకిన క్రూడ్ ఆయిల్ ధ‌ర‌..

ఇక ఎంసీఎక్స్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర బ్యారెల్‌కు ఓ ద‌శ‌లో 113.45 డాల‌ర్ల గ‌రిష్ట స్థాయిని తాకింది. ప్ర‌స్తుతం 101 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే క్రూడ్ ఆయిల్ ధ‌ర సోమ‌వారం నాటి మార్కెట్ సెష‌న్‌లో ఏకంగా 12 శాతం మేర పెరిగింది. అయితే క్రూడ్ ఆయిల్ నిల్వ‌లు, స‌ర‌ఫ‌రాపై జీ7 దేశాలు స‌మావేశం నిర్వ‌హించ‌నున్నాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో గ‌రిష్ట స్థాయి నుంచి ధ‌ర ఒక్క‌సారిగా దిగువ‌కు ప‌డిపోయింది. దీన్ని మార్కెట్‌కు పాజిటివ్ న్యూస్‌గా భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ యుద్ధం ముగిసింద‌న్న వార్త వ‌చ్చే వ‌ర‌కు చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌వ‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Advertisement
Advertisement