త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. ఉద‌యం ప్రారంభం నుంచే పెట్టుబ‌డిదారులు కొనుగోళ్ల ప‌ట్ల ఆస‌క్తి చూపించారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 0.40 శాతానికి పైగా పెరిగి ఇంట్రా డే గ‌రిష్టాల‌ను న‌మోదు చేశాయి.

S

Business | Published On Jul 6, 2026, 10.19 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం లాభాల్లో కొన‌సాగుతున్నాయి. ఉద‌యం ప్రారంభం నుంచే పెట్టుబ‌డిదారులు కొనుగోళ్ల ప‌ట్ల ఆస‌క్తి చూపించారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ఒక్కోటి 0.40 శాతానికి పైగా పెరిగి ఇంట్రా డే గ‌రిష్టాల‌ను న‌మోదు చేశాయి. సెన్సెక్స్ 367 పాయింట్ల మేర పెరిగి 78,129 వ‌ద్ద ట్రేడ‌వ‌గా, నిఫ్టీ50 సూచీ 107 పాయింట్లు పెరిగి 24,376 వ‌ద్ద ట్రేడైంది. అంతర్జాతీయంగా ఎలాంటి నెగెటివ్ సంకేతాలు లేక‌పోవ‌డం వ‌ల్ల మార్కెట్లు పాజిటివ్ ధోర‌ణిలో ప్రారంభం అయ్యాయి. దీంతో ఈక్విటీ సూచీలు త‌మ ర్యాలీని కొన‌సాగిస్తున్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా మార్కెట్ల లాభాలకు కార‌ణ‌మైంది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.28 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 71 డాల‌ర్ల‌కు చేర‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.23 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 68 డాల‌ర్ల‌కు చేరుకుంది.

మార్కెట్ల‌కు ఊత‌మిచ్చిన ఎఫ్ఐఐల పెట్టుబ‌డులు..

బ్లూచిప్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) తాజా పెట్టుబడులు కూడా దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. సెన్సెక్స్‌లో భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ రుతుపవనాలు పుంజుకోవడం, గత శుక్రవారం ఎఫ్‌ఐఐలు కొనుగోలుదారులుగా మారడం సమీప కాలంలో మార్కెట్‌కు సానుకూల అంశాలని తెలిపారు. జూలై 9 నుంచి తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ వారం నుంచి మార్కెట్లు కంపెనీల క్యూ1 ఫలితాలపై స్పందించడం ప్రారంభిస్తాయ‌ని చెప్పారు.

బ‌ల‌హీనంగానే రూపాయి..

ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీలు లాభాల్లో ట్రేడవగా, దక్షిణ కొరియా కోస్పీ, జపాన్ నిక్కీ 225 సూచీలు నష్టాల్లో కొనసాగాయి. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్ల‌కుసెలవు ఇచ్చారు. కాగా ఫారెక్స్ మార్కెట్‌లో మాత్రం భార‌త రూపాయి మ‌ళ్లీ బ‌ల‌హీన‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 13 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి 95.33 వ‌ద్ద నిలిచింది.

Advertisement
Advertisement