త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్ర‌భుత్వ‌ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?

Toll Tax | జాతీయ రహదారులపై ఇప్పటివరకు అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ప్రయాణించే సౌకర్యాన్ని పొందుతున్నారు. అయితే ఈ ప్రత్యేక మినహాయింపులకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

S

Business | Published On Jun 9, 2026, 5.28 pm IST

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్ర‌భుత్వ‌ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
Advertisement

Toll Tax | జాతీయ రహదారులపై ఇప్పటివరకు అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ప్రయాణించే సౌకర్యాన్ని పొందుతున్నారు. అయితే ఈ ప్రత్యేక మినహాయింపులకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రభుత్వ అధికారులు కూడా ఇతర వాహనదారుల మాదిరిగానే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం టోల్ మినహాయింపు పొందుతున్న వాహనాల జాబితాను పూర్తిగా రద్దు చేయడం లేదా భారీగా తగ్గించడం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా పరిశీలన కొనసాగిస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం వీఐపీ కల్చర్‌ను తగ్గించడంపైనే ప్రభుత్వ ప్రధాన దృష్టి నెల‌కొంద‌ని తెలుస్తోంది. సాధారణ ప్రజలు టోల్ చెల్లిస్తుండగా ప్రభుత్వ అధికారులు ఉచితంగా ప్రయాణించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందని ప్రభుత్వం భావిస్తోంది.

యాన్యువ‌ల్ పాస్‌కు సిఫార‌సు..

ప్రభుత్వ ఉద్యోగులు టోల్ మినహాయింపులు కోరడం బదులుగా ఫాస్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ కొనుగోలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అన్ని శాఖలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మొబైల్ ఫోన్ బిల్లుల మాదిరిగానే, ఉద్యోగులు ఫాస్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం చెల్లించిన మొత్తాన్ని తమ శాఖల నుంచి రీయింబర్స్‌మెంట్ రూపంలో పొందే అవకాశం కల్పించనున్నారు. అదే సమయంలో ఈ కొత్త విధానంపై రక్షణ దళాలతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఫాస్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారా ఒక వాహనం ఏడాదిలో 200 సార్లు టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఈ పాస్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. దీని ధరను రూ.3,075గా నిర్ణయించారు. అవసరమైతే ఏడాదిలో పలుమార్లు కూడా పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 25 రాజ్యాంగపరమైన ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తులు, వారితో ప్రయాణించే వాహనాలకు టోల్ మినహాయింపును ఇస్తున్నారు.

వీరికి య‌థాత‌థంగా మిన‌హాయింపులు..

యూనిఫాంలో ప్రయాణించే సైన్యం, పారామిలిటరీ వాహనాలు, మేజిస్ట్రేట్, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్ వంటి అత్యవసర సేవల వాహనాలు, జాతీయ రహదారి ప్రాజెక్టులను తనిఖీ చేసే అధికారుల వాహనాలు ప్రత్యేక ఎగ్జెంప్టెడ్ ఫాస్‌ట్యాగ్ ద్వారా టోల్ మినహాయింపుల‌ను పొందుతున్నాయి. ఈ మార్పులు మొదట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల వాహనాలకు అమలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటివరకు ఉచితంగా టోల్ ప్లాజాలను దాటుతున్న అధికారులు కూడా ఇకపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి వ‌స్తుంది. భవిష్యత్తులో టోల్ మినహాయింపు జాబితాను మరింత కుదించే అవకాశం కూడా కనిపిస్తోంది.

Advertisement
Advertisement