త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Farooq Abdullah | కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడిగినప్పుడే ఉగ్రదాడులు ఎందుకు?

Farooq Abdullah | జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌రించాల‌ని త‌మ పార్టీ డిమాండ్ చేసిన ప్ర‌తిసారీ ఉగ్రదాడులు ఎందుకు జ‌రుగుతున్నాయ‌ని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. కుల్గాం జిల్లా ఉగ్రదాడి ఘటనపై శనివారం ఆయ‌న స్పందించారు.

P

National | Published On Aug 1, 2026, 4.58 pm IST

Farooq Abdullah | కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడిగినప్పుడే ఉగ్రదాడులు ఎందుకు?
Advertisement
  • మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా 
  • కుల్గాం వ‌ల‌స కార్మికుల హ‌త్య‌పై విచార‌ణ‌కు డిమాండ్‌

Farooq Abdullah | జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌రించాల‌ని త‌మ పార్టీ డిమాండ్ చేసిన ప్ర‌తిసారీ ఉగ్రదాడులు ఎందుకు జ‌రుగుతున్నాయ‌ని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికులు ఉగ్రదాడిలో మృతి చెందిన ఘటనపై శనివారం ఆయ‌న స్పందించారు. ఈ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ జూలై 20న ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కుల్గాం జిల్లాలో ఉగ్ర‌దాడి జ‌రిగింది. అయితే, రాష్ట్ర హోదా అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి ఘటనలు జరగడం యాదృచ్ఛికమా..? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. బారాముల్లా జిల్లాలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్య‌మంత్రి.. "ఈ ఘటన ఎంతో బాధాకరం. వారిని ఎవరు హత్య చేశారో, ఎలా హత్య చేశారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు నిందితులను గుర్తించాలి. రాష్ట్ర హోదా ఇవ్వాల‌ని తాము మేము డిమాండ్ చేసినప్పుడల్లా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు" అని అన్నారు.

ఇటుక బ‌ట్టీ కార్మికుల‌పై కాల్పులు

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా కెలామ్ ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ రాత్రే, బోపిందర్ అనే ఇద్దరు వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే దీపక్ రాత్రే మృతి చెందగా, చికిత్స పొందుతూ బోపిందర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ 20 ఏళ్ల వయస్సులోనే ఉండటం గమనార్హం. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న జమ్మూకశ్మీర్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ అషిక్ హుస్సేన్‌ను జూలై 22న అనంతనాగ్ జిల్లా లాల్‌చౌక్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది కాల్చిచంపిన విషయం తెలిసిందే. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఉగ్రదాడులు భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

భద్రతా వైఫల్యమే కార‌ణ‌మ‌న్న మెహబూబా ముఫ్తీ

కుల్గాం ఘటనను పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఇద్దరు వలస కార్మికుల హత్య వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. "ఉపాధి కోసం ఎంతో దూరం నుంచి కశ్మీర్‌కు వచ్చే కార్మికులు ఇలాంటి దారుణానికి బలికావడం అత్యంత విషాదకరం. వారి సొంత రాష్ట్రాల్లో ఉపాధి లేక ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. అలాంటి నిరాయుధ కార్మికులను కాల్చిచంపడం అమానుషం. ఈ ఘటనను ఎంత ఖండించినా తక్కువే"న‌ని తెలిపారు. "సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసులు భారీగా మోహరించి ఉన్నప్పటికీ ఉగ్రవాదులు ఎలా వచ్చి ఇద్దరు నిరాయుధ కార్మికులను హత్య చేసి తప్పించుకున్నారో ప్రభుత్వం సమీక్షించాలి. ఎక్కడ భద్రతా లోపం జరిగిందో గుర్తించాలి. బాధిత కుటుంబాలకు వారి సొంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి అదనంగా స్థానిక ప్రభుత్వం సైతం ఆర్థిక సాయం అందించాలి. ఘటనపై సమగ్రంగా, ఉన్నతస్థాయిలో విచారణ జరగాలి" అని మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు.

2019లో ప్ర‌త్యేక హోదా ర‌ద్దు..

ఇదిలా ఉండ‌గా.. 2019 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసి జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించింది. అనంతరం అదే ఏడాది అక్టోబరులో అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. 2024 అక్టోబరులో జరిగిన ఎన్నికల అనంతరం ఒమర్ అబ్దుల్లా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న‌ది. అదే సమయంలో కుల్గాం ఉగ్రదాడి చేసుకున్న‌ది. తాజాగా ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement