త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Income Tax Return | ఐటీఆర్ గ‌డువు ముగిసింది.. అయినా ఫైల్ చేయ‌లేదా.. ఇప్పుడెలా..?

Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2026-27 గడువును జూలై 31గా నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఆ తేదీ లోపు ఐటీఆర్‌ను ఫైల్ చేసిన వారికి ఇ-వెరిఫై చేసేందుకు మ‌రో 30 రోజుల గ‌డువు ఉంటుంది. అయితే గ‌డువు ఇప్ప‌టికే ముగిసిన నేప‌థ్యంలో ఇంకా రిట‌ర్న్‌లు దాఖ‌లు చేయ‌నివారు ఇప్పుడేం చేయాలని ఆందోళ‌న చెందుతుంటారు.

S

Business | Published On Aug 1, 2026, 4.35 pm IST

Income Tax Return | ఐటీఆర్ గ‌డువు ముగిసింది.. అయినా ఫైల్ చేయ‌లేదా.. ఇప్పుడెలా..?
Advertisement

Income Tax Return | ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2026-27 గడువును జూలై 31గా నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఆ తేదీ లోపు ఐటీఆర్‌ను ఫైల్ చేసిన వారికి ఇ-వెరిఫై చేసేందుకు మ‌రో 30 రోజుల గ‌డువు ఉంటుంది. అయితే గ‌డువు ఇప్ప‌టికే ముగిసిన నేప‌థ్యంలో ఇంకా రిట‌ర్న్‌లు దాఖ‌లు చేయ‌నివారు ఇప్పుడేం చేయాలని ఆందోళ‌న చెందుతుంటారు. అయితే గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ ఆల‌స్య రుసుముతో ఐటీఆర్‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. కానీ ఆల‌స్య రుసుముతో కూడా ఐటీఆర్‌ను దాఖ‌లు చేసేందుకు గ‌డువు ముగిస్తే ఆపై వ‌డ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీ జూలై 31 కాగా ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ నివేదికలు వంటి ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారికి ఈ గడువు వర్తించదు.

రూ.5వేల వ‌ర‌కు లేట్ ఫీజు..

2025 నూతన ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లు మాత్రం మార్పిడి విధానంలో భాగంగా 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారమే కొన‌సాగుతాయి. జూలై 31 గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోయినా, బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కొన్ని ప్రతికూల పరిణామాలు ఉంటాయి. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే గరిష్టంగా రూ.5వేల వరకు లేట్ ఫీజు విధించే అవ‌కాశాలు ఉంటాయి. మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించని పన్ను చెల్లింపుదారులకు గరిష్ట లేట్ ఫీజును రూ.1వేయికి పరిమితం చేశారు. ఏవై 2026-27కు సంబంధించిన బిలేటెడ్ రిటర్న్‌ను ప్రభుత్వం గడువు పొడిగించకపోతే డిసెంబర్ 31, 2026 వరకు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

వ‌డ్డీ కూడా చెల్లించాల్సి వ‌స్తుంది..

అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, ఇతర ట్యాక్స్ క్రెడిట్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా పన్ను బకాయి ఉంటే, సెక్షన్ 234ఎ ప్రకారం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రిటర్న్ దాఖలు గడువు ముగిసిన తేదీ నుంచి రిటర్న్ దాఖలు చేసే తేదీ వరకు నెలకు లేదా నెలలో భాగానికి 1 శాతం చొప్పున వడ్డీ లెక్కిస్తారు. ప్రస్తుతం జూలై 31 గడువు పొడిగింపుపై ప్రభుత్వం లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీడీడీటీ) నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గడువును పొడిగించాలంటే సీబీడీటీ అధికారిక ఉత్తర్వు లేదా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. దేశంలోని పూర్తి స్థాయి న్యాయ సంస్థ ఎకనామిక్ లాస్ ప్రాక్టీస్ భాగస్వామి రాహుల్ చార్ఖా మాట్లాడుతూ సెక్షన్ 139(1) కింద ఉన్న గడువులు చట్టబద్ధమైనవని, కేవలం ఆదాయపు పన్ను పోర్టల్‌లో సూచన లేదా సమాచారంతో వాటిని మార్చలేమని తెలిపారు.

గ‌డువు పొడిగింపుపై లేని స్ప‌ష్ట‌త‌..

గడువు పొడిగింపు చట్టబద్ధ అధికారాల ఆధారంగా మాత్రమే ఉండాలని, దానికి సంబంధించిన సీబీడీటీ ఉత్తర్వు లేదా సర్క్యులర్‌లో ఏ నిబంధనను సడలిస్తున్నారో, ఏ పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుందో, ఏ అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించినదో, కొత్త గడువు తేదీ ఏమిటో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందని వివరించారు. సెక్షన్ 119 ప్రకారం ఆదాయపు పన్ను చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన ఉత్తర్వులు, మార్గదర్శకాలు జారీ చేసే అధికారాన్ని సీబీడీటీకి చట్టం కల్పించిందని, గతంలో నిజమైన ఇబ్బందులు లేదా పరిపాలనా కారణాల వల్ల పలు సందర్భాల్లో గడువులను పొడిగించిందని రాహుల్ చార్ఖా తెలిపారు. గతంలో ఆడిట్‌కు సంబంధించిన రిటర్న్ గడువులు, కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన అంతరాయాలు, ఇతర పన్ను చెల్లింపుదారుల ఇబ్బందుల నేపథ్యంలో కూడా సీబీడీటీ సెక్షన్ 119 అధికారాలను వినియోగించి గడువులను పొడిగించింద‌ని, అయితే ఈసారి కూడా గడువు పొడిగిస్తారని భావించకుండా, రిటర్న్ దాఖలు చేసి అదనపు ఆర్థిక భారం నుంచి తప్పించుకోవాలని సూచించారు.

లేటుగా దాఖ‌లు చేస్తే..

గడువులోగా ఐటీఆర్ దాఖలు చేసిన వారికి రిటర్న్‌లో పొరపాట్లు లేదా వివరాలు మిస్ అయితే సవరించిన రిటర్న్ దాఖలు చేసే విషయంలో ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అయితే ఆలస్యంగా దాఖలు చేసిన అసలు రిటర్న్ విషయంలో చట్టం ప్రకారం సవరణ అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఏవై 2026-27కు సంబంధించిన ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఆదాయ వివరాలు, మినహాయింపులు, బ్యాంకు వడ్డీ, మూలధన లాభాలు, ఇతర వెల్లడించాల్సిన వివరాలను పూర్తిగా పరిశీలించి సరైన సమాచారంతో రిటర్న్ సమర్పించాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement