త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | ఒక్క Yes తో యూపీఐ మోసాలకు చెక్.. కొత్త భద్రతా వ్యవస్థపై ఆర్‌బీఐ పరిశీలన..

UPI | దేశంలో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఇకపై ప్రతి యూపీఐ చెల్లింపు ఒక్క ట్యాప్‌తో పూర్తికాదు. అనుమానాస్పదంగా గుర్తించిన కొన్ని లావాదేవీలకు మాత్రమే అదనంగా Yes లేదా No అనే నిర్ధారణ సందేశాన్ని చూపించే విధానాన్ని ప్రవేశపెట్టాలని బ్యాంకులు ప్ర‌తిపాదించాయి.

S

Business | Published On Aug 3, 2026, 2.25 pm IST

UPI | ఒక్క Yes తో యూపీఐ మోసాలకు చెక్.. కొత్త భద్రతా వ్యవస్థపై ఆర్‌బీఐ పరిశీలన..
Advertisement

UPI | దేశంలో యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఇకపై ప్రతి యూపీఐ చెల్లింపు ఒక్క ట్యాప్‌తో పూర్తికాదు. అనుమానాస్పదంగా గుర్తించిన కొన్ని లావాదేవీలకు మాత్రమే అదనంగా Yes లేదా No అనే నిర్ధారణ సందేశాన్ని చూపించే విధానాన్ని ప్రవేశపెట్టాలని బ్యాంకులు ప్ర‌తిపాదించాయి. ఈ మేర‌కు ఈ ప్రతిపాదనను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి సమర్పించ‌గా, జిటల్ చెల్లింపుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆర్‌బీఐ ప్రస్తుతం ఆ మార్గదర్శకాలను పరిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్పు ప్రకారం ప్రతి అధిక విలువైన లావాదేవీకి అదనపు ధ్రువీకరణ ఉండదు. బ్యాంకుల మోసాల గుర్తింపు వ్యవస్థ ఏదైనా యూపీఐ చెల్లింపును అనుమానాస్పదంగా గుర్తిస్తే మాత్రమే వినియోగదారుడి స్క్రీన్‌పై ఈ లావాదేవీని కొనసాగించాలనుకుంటున్నారా? అనే తరహాలో Yes లేదా No అనే పాప్-అప్ కనిపిస్తుంది. వినియోగదారు Yes పై ట్యాప్ చేసిన తర్వాత మాత్రమే ఆ చెల్లింపు పూర్తవుతుంది.

అన్ని చెల్లింపుల‌కు కాదు..

అయితే ఈ అదనపు నిర్ధారణ అన్ని యూపీఐ చెల్లింపులకు కాకుండా, బ్యాంకుల రిస్క్ అసెస్‌మెంట్ ప్రకారం అనుమానాస్పదంగా కనిపించే లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇలాంటి ప్రతిపాదనకు ప్రధాన కారణం యూపీఐ మోసాలు గణనీయంగా పెరగడమే. ప్రస్తుతం ఎక్కువ శాతం మోసాలు సాంకేతిక హ్యాకింగ్ వల్ల కాకుండా సోషల్ ఇంజినీరింగ్ ద్వారా జరుగుతున్నాయి. మోసగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజింగ్ యాప్‌లు లేదా నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా బాధితులను వెంటనే డబ్బు పంపించేలా మోసం చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులు క్షణాల్లో పూర్తవడం, ఒకసారి పంపిన తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడం చాలా కష్టమవడం వల్ల బాధితులు మోసాన్ని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీల సమయంలో ఒక చిన్న నిర్ధారణ దశను జోడించడం వల్ల వినియోగదారులు ఒక్కసారి ఆలోచించే అవకాశం లభిస్తుందని, దీంతో మోసాల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి.

అధునాతన రిస్క్ ఇంజిన్ల వాడ‌కం..

అయితే ప్రతి అధిక విలువైన చెల్లింపుపై ఆలస్యం లేదా తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్ విధించడాన్ని బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. అలాంటి నిర్ణయం యూపీఐ ప్రధాన బలమైన వేగం, సౌలభ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రోజూ లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులు తక్షణ చెల్లింపులపై ఆధారపడుతున్నందున ప్రతి లావాదేవీని ఆలస్యం చేయడం వినియోగదారుల అనుభవంతోపాటు వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఏ లావాదేవీని హై రిస్క్‌గా గుర్తించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే బ్యాంకులు వినియోగదారుల ప్రవర్తనను రియల్‌టైమ్‌లో విశ్లేషించే అధునాతన రిస్క్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి. అసాధారణంగా అధిక మొత్తంలో చెల్లింపు జరగడం, మొదటిసారి కొత్త వ్యక్తికి డబ్బు పంపించడం, కొత్త డివైస్ నుంచి లావాదేవీ చేయడం, అపరిచిత ప్రాంతం నుంచి చెల్లింపు జరగడం లేదా వినియోగదారుడి సాధారణ ఖర్చుల అలవాట్లకు భిన్నంగా లావాదేవీ కనిపించడం వంటి పరిస్థితుల్లో ఆ చెల్లింపును అనుమానాస్పదంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

ప‌రిశీలిస్తున్న ఆర్‌బీఐ..

అలాంటి సందర్భాల్లో మాత్రమే వినియోగదారు నుంచి స్పష్టమైన Yes నిర్ధారణ తీసుకున్న తర్వాత చెల్లింపును పూర్తి చేసే విధానం అమలులోకి రానుంది. ప్రస్తుతం బ్యాంకులు అందించిన‌ ఈ సిఫారసులను ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. ఆమోదం లభిస్తే డిజిటల్ చెల్లింపుల్లో రిస్క్ ఆధారిత ధ్రువీకరణ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీఐ వేగం, సౌలభ్యానికి భంగం కలగకుండా అవసరమైన చోట మాత్రమే అదనపు భద్రతను కల్పించవచ్చు. వినియోగదారుల దృష్టిలో ఇది కేవలం ఒక అదనపు ట్యాప్‌ మాత్రమే అయినప్పటికీ, పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందడంలో కీలకంగా మారే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement