త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | రెపో రేటు య‌థాత‌థం.. ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యాలు..

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం కీలక నిర్ణయాలను ప్రకటించారు. భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ద్రవ్యోల్బణ ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు.

S

Business | Published On Apr 8, 2026, 11.25 am IST

RBI | రెపో రేటు య‌థాత‌థం.. ఆర్‌బీఐ కీల‌క నిర్ణ‌యాలు..
Advertisement

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం కీలక నిర్ణయాలను ప్రకటించారు. భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ద్రవ్యోల్బణ ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు. రెపో రేటు, ద్రవ్య విధాన వైఖరిపై ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచాలని నిర్ణయించింద‌ని, అలాగే విధాన వైఖరిని న్యూట్రల్ గా కొనసాగించింద‌ని అన్నారు.

5.25 శాతం కొన‌సాగింపు..

రెండో వరుస సమావేశంలో కూడా రెపో రేటు, విధాన వైఖరిని మార్చకుండా కొనసాగించారు. ఫిబ్రవరి సమావేశంలో కూడా ఆర్‌బీఐ ఇదే విధంగా రేట్లను యథాతథంగా ఉంచి, గత ఏడాది డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత న్యూట్రల్ వైఖరిని కొనసాగించింది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉండగా బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్‌బీఐ వద్ద జమ చేయగల స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5 శాతంగా కొనసాగుతోంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి రుణాలు పొందే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు 5.50 శాతంగా ఉంది. ద్రవ్య లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (LAF) కింద పాలసీ రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచాలని MPC ఏకగ్రీవంగా నిర్ణయించింది. దాంతో SDF రేటు 5 శాతంగా, MSF, బ్యాంక్ రేటు 5.50 శాతంగా కొనసాగుతాయి. అలాగే న్యూట్రల్ విధాన వైఖరిని కొనసాగించాలని కూడా నిర్ణయించింది.

ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగే అవ‌కాశం..

ద్రవ్యోల్బణ అంచనాల విషయానికి వస్తే, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2-6 శాతం లక్ష్య పరిధిలోనే ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. అదే సమయంలో వినియోగదారుల ధర సూచీ (CPI) ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని 4.6 శాతంగా అంచనా వేసింది. 2026-27 మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండవచ్చని, రెండో త్రైమాసికంలో ఇది 4.4 శాతానికి పెరిగే అవకాశముందని, మూడో త్రైమాసికంలో 5.2 శాతానికి చేరి, నాలుగో త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. కోర్ ద్ర‌వ్యోల్బ‌ణం 4.4 శాతంగా అంచ‌నా వేశారు. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు ఇటీవల పెరగడం ఒక ప్రధాన ప్రమాదంగా మారింద‌ని, అయితే రబీ పంట ఉత్పత్తి బలంగా ఉండడం, జలాశయాల్లో సరిపడిన నీటి నిల్వలు ఉండటం, ధాన్య నిల్వలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆహార ధరలు సమీప భవిష్యత్తులో నియంత్రణలో ఉండవచ్చ‌ని, అయితే ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఒక ప్రమాదంగా ఉంటుంద‌ని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు.

త‌గ్గ‌నున్న జీడీపీ..

జీడీపీ వృద్ధి అంచనాల విషయానికి వస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 7.6 శాతం వృద్ధి అంచనాను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ, 2026-27లో ఇది 6.9 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. 2026-27 తొలి త్రైమాసికంలో 6.8 శాతం, రెండో త్రైమాసికంలో 6.7 శాతం, మూడో త్రైమాసికంలో 7 శాతం, నాలుగో త్రైమాసికంలో 7.2 శాతం వృద్ధి నమోదవుతుందని అంచ‌నా వేసింది. అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత తీవ్రమవడం, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో అస్థిరత పెరగడం, వాతావరణ సంబంధిత పరిణామాలు దేశీయ వృద్ధిపై ప్రభావం చూపవచ్చని గవర్నర్ మల్హోత్రా హెచ్చరించారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ మూడు కీలక చర్యలను ప్రతిపాదించింది. బ్యాంక్ బోర్డుల సమయాన్ని సమర్థంగా వినియోగించేందుకు ప్రస్తుత మార్గదర్శకాలను పునర్నిర్వ‌చించి సరళీకరించనున్నారు. అలాగే 9వేల‌కు పైగా నియంత్రణ మార్గదర్శకాలను 238 మాస్టర్ డైరెక్షన్లలో సమీకరించినట్లు గవర్నర్ తెలిపారు. ఇదే విధంగా పర్యవేక్షణకు సంబంధించిన మార్గదర్శకాల సమీకరణ కూడా పూర్తయిందని వెల్లడించారు.

MSMEల‌కు మ‌రింత ఊతం..

MSMEల‌కు సౌలభ్యం కల్పించేందుకు TReDS ప్లాట్‌ఫామ్‌లలో నమోదు సమయంలో అవసరమైన డ్యూ డిలిజెన్స్ ప్రక్రియను తొలగించాలనే ప్రతిపాదనను ఆర్‌బీఐ తీసుకొచ్చింది. అలాగే మనీ మార్కెట్ అభివృద్ధి కోసం కొన్ని నాన్-బ్యాంకింగ్ సంస్థలకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం ఈ మార్కెట్లో బ్యాంకులు, స్టాండలోన్ ప్రైమరీ డీలర్లు మాత్రమే పాల్గొంటున్నారు. ఇకపై ప్రైమరీ డీలర్లకు టర్మ్ మనీ మార్కెట్‌లో రుణ పరిమితులను కూడా పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement