త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్ర‌ధాని మోదీ కామెంట్ల ఎఫెక్ట్‌.. జువెల‌రీ స్టాక్స్ భారీగా ప‌త‌నం..

PM Modi | బంగారం కొనుగోళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా విజ్ఞప్తి దేశంలోని ప్రముఖ జువెలరీ కంపెనీల షేర్లపై ప్రభావం చూపింది. మంగళవారం ప్రధాన జువెలరీ స్టాక్స్‌ ఎక్కువ శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని ప్ర‌జ‌ల‌కు మోదీ సూచించారు.

S

Business | Published On Sep 1, 2026, 12.43 pm IST

PM Modi | ప్ర‌ధాని మోదీ కామెంట్ల ఎఫెక్ట్‌.. జువెల‌రీ స్టాక్స్ భారీగా ప‌త‌నం..
Advertisement

PM Modi | బంగారం కొనుగోళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా విజ్ఞప్తి దేశంలోని ప్రముఖ జువెలరీ కంపెనీల షేర్లపై ప్రభావం చూపింది. మంగళవారం ప్రధాన జువెలరీ స్టాక్స్‌ ఎక్కువ శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని ప్ర‌జ‌ల‌కు మోదీ సూచించారు. ఉదయం సెష‌న్‌లో టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ షేరు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.5,050 వద్ద ట్రేడైంది. ఇది గత ముగింపుతో పోలిస్తే రూ.52.50 (1.03 శాతం) నష్టపోయింది. కల్యాణ్ జువెలర్స్ ఇండియా షేరు రూ.13.55 (2.25 శాతం) తగ్గి రూ.587.45 వద్ద కొనసాగింది. తంగమయిల్ జువెలరీ షేరు రూ.78.50 (1.45 శాతం) పడిపోయి రూ.5,333.50 వద్ద ట్రేడైంది. బ్లూస్టోన్ జువెలరీ అండ్ లైఫ్‌స్టైల్ షేరు రూ.10 (1.22 శాతం) నష్టపోయి రూ.807.40 వద్ద ఉంది. అయితే ప్రధాన జువెలరీ కంపెనీల్లో సెన్కో గోల్డ్ మాత్రమే లాభాల్లో కనిపించింది. ఈ షేరు రూ.4.75 ( 1.36 శాతం) పెరిగి రూ.353.35 వద్ద ట్రేడైంది.

అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప కొనొద్దు: మోదీ

ప్ర‌ధాని మోదీ ఈ విజ్ఞప్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టులో వెల్లడించారు. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ మంత్రాలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం వినోదం కోసం విదేశాలకు ప్రయాణించడం, విదేశాల్లో వివాహాలు నిర్వహించడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. దీనికి బదులుగా వెడ్డింగ్స్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయవ‌ద్ద‌ని మోదీ పేర్కొన్నారు. స్వదేశీ, స్వావలంబనకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ముందుకు సాగవచ్చని ఆయన అన్నారు. భారత్ స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తిచేసుకునే సమయానికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.

మే నెల‌లోనూ ప‌లు మార్లు విజ్ఞ‌ప్తులు..

భారతీయ కుటుంబాల్లో బంగారానికి ఎంతో కీలకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఆభరణాలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ప్రధానమంత్రి విజ్ఞప్తి జువెలరీ రంగంపై చర్చకు దారితీసింది. బంగారం కొనుగోళ్లను తగ్గించాలని మోదీ కోరడం ఇదే తొలిసారి కాదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది మే 10న కూడా దేశ ప్రజలకు ఆయన పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని అప్పట్లో పిలుపునిచ్చారు. అప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని మోదీ సూచించారు. ప్రజా రవాణాను వినియోగించడం, కార్‌పూలింగ్ చేయడం వంటి చర్యలను ప్రోత్సహించారు. అలాగే ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను పునరాలోచించడం, అధికంగా బంగారం కొనుగోలు చేయక‌పోవ‌డం వంటి సూచనలు చేశారు.

వోక‌ల్ ఫ‌ర్ లోక‌ల్‌ను బ‌లోపేతం చేయాలి..

వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను తిరిగి ప్రోత్సహించడం, వంట నూనెల వినియోగాన్ని తగ్గించడం, దిగుమతి చేసుకునే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి అంశాలను కూడా మోదీ అప్పట్లో ప్రస్తావించారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, స్వావలంబనతో పాటు సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు కీలకమని పేర్కొన్నారు. తాజా విజ్ఞప్తిలోనూ మోదీ స్వదేశీ, స్వావలంబనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి శక్తి దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంద‌ని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement