త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OMC Shares | పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచినా ఓఎంసీల షేర్లు భారీగా ప‌త‌నం

OMC Shares | ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర‌మైన న‌ష్టాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయా కంపెనీల‌కు స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించేలా కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం నుంచి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచింది. లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్కొక్క‌టి రూ.3 చొప్పున పెంపును అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

S

Business | Published On May 15, 2026, 10.58 am IST

OMC Shares | పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచినా ఓఎంసీల షేర్లు భారీగా ప‌త‌నం
Advertisement

OMC Shares | ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు గ‌త కొద్ది రోజులుగా తీవ్ర‌మైన న‌ష్టాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయా కంపెనీల‌కు స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించేలా కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం నుంచి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచింది. లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్కొక్క‌టి రూ.3 చొప్పున పెంపును అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచిన‌ప్ప‌టికీ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీల‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 ధర పెంపు ప్రకటించినా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) షేర్లు 2 శాతం క‌న్నా ఎక్కువగా క్షీణించి నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మూడింటిలో హెచ్‌పీసీఎల్ షేర్లు అత్యధికంగా పడిపోయాయి. గురువారం ముగింపు ధరతో పోలిస్తే ఇవి 2 శాతానికి పైగా క్షీణించాయి. బీపీసీఎల్ షేర్లు 1.7 శాతం తగ్గగా, ఐఓసీఎల్ సుమారు 1.3 శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది.

రోజుకు రూ.1వేయి కోట్ల న‌ష్టం..

ఇరాన్‌తో అమెరికా యుద్ధం మొద‌లైన‌ప్ప‌టి నుంచి వాస్త‌వానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర న‌ష్టాల్లో ఉన్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌లేదు. ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ప్ర‌ధాని మోదీ స‌భ అనంత‌రం బంగారం, వెండి ధ‌ర‌ల‌పై ఎక్సైజ్ సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచ‌గా, ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్ వాత ప‌డింది. యుద్ధం కార‌ణంగా ఓఎంసీల‌కు వ‌చ్చిన భారీ న‌ష్టాల‌ను పూడ్చుకునేందుకు కేంద్రం ఈ పెంపును ప్ర‌క‌టించినా అది కంటి తుడుపు చ‌ర్యేన‌ని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రూ.1వేయి కోట్ల‌కు పైగా న‌ష్టాల్లో న‌డుస్తున్న కంపెనీల‌కు ఈ ఊర‌ట ప్ర‌యోజ‌నం ఇవ్వ‌ద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఓఎంసీలు రూ.1 ల‌క్ష కోట్ల‌కు పైగా న‌ష్టాల్లో ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఊర‌ట చాలా స్వ‌ల్పం..

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌కారం ఓఎంసీలు ఎఫ్‌వై27 తొలి త్రైమాసికంలో కలిపి రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.1.2 లక్షల కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాయి. అంటే రోజుకు రూ.1వేయి కోట్లకు పైగా నష్టం వస్తోందని అర్థం. అయితే లీటరుకు రూ.3 ధర పెంపు వల్ల ఈ కంపెనీలు రోజుకు కేవలం సుమారు రూ.125 కోట్ల నష్టాన్ని మాత్రమే తగ్గించుకోగలవని అంచనా. ఇది రోజువారీగా అంచనా వేస్తున్న రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల నష్టాలతో పోలిస్తే చాలా తక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. అందుక‌నే ఆయా కంపెనీల షేర్లు ఒత్తిడిలో ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement