త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల స్ప‌ష్ట‌త‌.. నీరు ఉందా, లేదా..?

E20 Petrol | ఇటీవల ఈ20 పెట్రోల్‌లో అధిక స్థాయిలో క్లోరైడ్ ఉండటం, తేమ (మాయిశ్చర్) కలుషితం అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖండించాయి.

S

Business | Published On Aug 8, 2026, 2.29 pm IST

E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల స్ప‌ష్ట‌త‌.. నీరు ఉందా, లేదా..?
Advertisement

E20 Petrol | ఇటీవల ఈ20 పెట్రోల్‌లో అధిక స్థాయిలో క్లోరైడ్ ఉండటం, తేమ (మాయిశ్చర్) కలుషితం అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖండించాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన విస్తృత స్థాయి శాస్త్రీయ పరీక్షల్లో ఇంధన కలుషితానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశాయి. ఈ20 ఇంధన సరఫరా వ్యవస్థ మొత్తం మీద శాస్త్రీయ పద్ధతిలో యాదృచ్ఛిక నమూనాలను సేకరించి నిర్వహించిన పరీక్షల్లో ఇంధన నాణ్యత నిర్దేశిత ప్రమాణాల పరిధిలోనే ఉన్నట్లు తేలిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మూడు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

ఫ్రీక్వెన్సీ మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ‌..

ఇటీవల ఎథనాల్ బ్లెండెడ్ మోటార్ స్పిరిట్ (ఈబీఎంఎస్), సాధారణంగా ఈ20 పెట్రోల్‌గా విక్రయించే ఇంధనంలో కలుషితం జరిగి ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చాయి. పెట్రోల్‌లో కలిపే ఎథనాల్‌కు కేంద్ర ప్రభుత్వం కఠినమైన క్లోరైడ్ ప్రమాణాలను నిర్దేశించిందని, రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినల్స్, రిటైల్ అవుట్‌లెట్ల వరకు మొత్తం సరఫరా గొలుసులో అధిక ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ వ్యవస్థ అమల్లో ఉందని వెల్లడించాయి. ఇంధన నాణ్యత పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తూ ప్రతి రిటైల్ అవుట్‌లెట్‌లో రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు సార్లు వాటర్ ఇన్‌గ్రెస్, డెన్సిటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపాయి. దేశవ్యాప్తంగా మొబైల్ ఫ్యుఫ్యూయల్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబొరేటరీలను కూడా వినియోగిస్తున్నామని, పరీక్షల ఫలితాలను గుర్తింపు పొందిన ఇంధన ప్రయోగశాలల ద్వారా స్వతంత్రంగా ధ్రువీకరిస్తున్నామని పేర్కొన్నాయి.

త‌క్కువ‌గానే క్లోరైడ్ స్థాయిలు..

దేశంలోని రిఫైనరీల నుంచి యాదృచ్ఛికంగా సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి ఒక పీపీఎం లేదా అంతకంటే తక్కువగా నమోదైందని ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వెల్లడించాయి. దీంతో దేశంలోని రిఫైనరీల నుంచి విడుదలయ్యే పెట్రోల్ నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని స్పష్టమవుతోందని పేర్కొన్నాయి. గత పది రోజులుగా మూడు చమురు మార్కెటింగ్ సంస్థలు, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా 80 డిస్టిలరీల నుంచి ఎథనాల్ నమూనాలను పరిశీలించింది. అన్ని నమూనాల్లోనూ క్లోరైడ్ స్థాయి మూడు పీపీఎంకు దిగువన నమోదైందని, ఇది నిర్దేశిత పరిమితికంటే చాలా తక్కువ‌ని తెలిపాయి. దీంతో ఎథనాల్ ఉత్పత్తి దశలో కూడా నాణ్యత నియంత్రణ సమర్థంగా అమలవుతోందని వెల్లడించాయి.

3 పీపీఎం క‌న్నా త‌క్కువ‌గానే..

డిపోలు, ట్యాంక్ ట్రక్ టెర్మినల్స్‌లో పరీక్షించిన ఎథనాల్, ఈ20 పెట్రోల్ నమూనాల్లో కూడా క్లోరైడ్ స్థాయి మూడు పీపీఎంకు లోపే ఉందని సంస్థలు తెలిపాయి. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ సంస్థల టెర్మినల్స్ నుంచి సేకరించిన 80కు పైగా నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నాయి. నిల్వ, పంపిణీ దశల్లో కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని వెల్లడించాయి. రిటైల్ అవుట్‌లెట్లలో ప్రత్యేక పర్యవేక్షణ కార్యక్రమం కింద వెయ్యికి పైగా నమూనాలను సేకరించామని, ఇప్పటివరకు విశ్లేషించిన 160 నమూనాల్లో క్లోరైడ్ స్థాయి సున్నా నుంచి మూడు పీపీఎం మధ్యే నమోదైందని తెలిపాయి. ఈ20 పెట్రోల్‌లో వందల పీపీఎంల క్లోరైడ్ ఉందన్న ఆరోపణలను ఈ ఫలితాలు పూర్తిగా ఖండిస్తున్నాయని పేర్కొన్నాయి.

నాలుగింటిలోనే స‌మ‌స్య‌లు..

మొత్తం పర్యవేక్షణలో కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే క్లోరైడ్ స్థాయి ఎక్కువగా నమోదైనట్లు గుర్తించామని వెల్లడించాయి. ఆ ప్రాంతాల్లో వెంటనే ఇంధన సరఫరాను నిలిపివేసి, సమస్యకు మూల కారణాన్ని గుర్తించి, అవసరమైన సరిదిద్దే చర్యలు తీసుకున్న తర్వాతే తిరిగి కార్యకలాపాలను ప్రారంభించామని వివరించాయి. తేమ కలుషితంపై వచ్చిన ఆరోపణలకూ సంస్థలు స్పందించాయి. దేశవ్యాప్తంగా సుమారు 90 వేల రిటైల్ అవుట్‌లెట్లలో భూగర్భ నిల్వ ట్యాంకుల తనిఖీ, పర్యవేక్షణను తప్పనిసరి చేశామని తెలిపాయి. ఈ ట్యాంకులను రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు సార్లు పరిశీలిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా నీరు చొరబడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement