త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nithin Kamath | బ్రోక‌రేజీ సంస్థ‌ల‌కు జీరోధా నితిన్ కామ‌త్ హెచ్చ‌రిక.. ఎంటీఎఫ్‌ల‌పై అంత ఎక్స్‌పోజ‌ర్ వ‌ద్దు..

Nithin Kamath | భారత స్టాక్ మార్కెట్ల‌లో వేగంగా పెరుగుతున్న మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (MTF) ఎక్స్‌పోజర్ భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌ముఖ బ్రోక‌రేజ్ సంస్థ జీరోధా య‌జ‌మాని నితిన్ కామ‌త్ హెచ్చరించారు. మార్కెట్లు ఒక్కసారిగా భారీ పతనాన్ని ఎదుర్కొంటే మొత్తం బ్రోకరేజ్ వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

S

Business | Published On May 20, 2026, 6.05 pm IST

Nithin Kamath | బ్రోక‌రేజీ సంస్థ‌ల‌కు జీరోధా నితిన్ కామ‌త్ హెచ్చ‌రిక.. ఎంటీఎఫ్‌ల‌పై అంత ఎక్స్‌పోజ‌ర్ వ‌ద్దు..
Advertisement

Nithin Kamath | భారత స్టాక్ మార్కెట్ల‌లో వేగంగా పెరుగుతున్న మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (MTF) ఎక్స్‌పోజర్ భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌ముఖ బ్రోక‌రేజ్ సంస్థ జీరోధా య‌జ‌మాని నితిన్ కామ‌త్ హెచ్చరించారు. మార్కెట్లు ఒక్కసారిగా భారీ పతనాన్ని ఎదుర్కొంటే మొత్తం బ్రోకరేజ్ వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చేసిన విపులమైన పోస్టులో, గత కొన్ని నెలలుగా భారత మార్కెట్లు పెద్దగా ర్యాలీని కొన‌సాగించ‌క‌పోయినా ఎంటీఎఫ్ బుక్స్ మాత్రం దూకుడుగా పెరుగుతున్నాయని కామత్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా వంటి మార్కెట్ల పరిస్థితితో భారత్‌ను పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు. అక్కడ మార్కెట్లు ఏడాదిలోనే 150 శాతం వరకు పెరగడంతో ఇన్వెస్టర్లు భారీగా అప్పులు తీసుకుని ర్యాలీలో పాల్గొన్నారని, కానీ భారత్ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపారు.

మార్కెట్లు ఒక్క‌సారిగా కుప్పకూలితే స‌మ‌స్యే..

మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ద్వారా ఇన్వెస్టర్లు బ్రోకర్ల నుంచి అప్పుగా డబ్బు తీసుకుని షేర్లు కొనుగోలు చేస్తారు. తమ వద్ద ఉన్న షేర్లు లేదా మార్జిన్లను కొలెటరల్‌గా పెట్టి ఎక్కువ మొత్తంలో ట్రేడింగ్ చేస్తారు. గత రెండేళ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడంతోపాటు ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో అధిక లాభాల కోసం లీవరేజ్ వినియోగం భారీగా పెరిగింది. మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన సమయంలో అసలు సమస్య మొదలవుతుందని నితిన్ కామత్ హెచ్చరించారు. కొలెటరల్‌గా పెట్టిన షేర్లను బ్రోకర్లు తక్షణం విక్రయించలేకపోతే బకాయిలను రికవరీ చేయడం కష్టమవుతుందని చెప్పారు. షేర్ ధరలు ఇన్వెస్టర్లు ఇచ్చిన మార్జిన్ కంటే ఎక్కువగా పడిపోతే నష్టం నేరుగా బ్రోకర్‌పై పడుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు 20 శాతం మార్జిన్ ఇచ్చిన స్టాక్ అంతకంటే ఎక్కువగా పడిపోతే బ్రోకర్లకు బ్యాడ్ డెబిట్ సమస్య వస్తుందని తెలిపారు. తర్వాత ఆ నష్టాన్ని కస్టమర్ల నుంచి తిరిగి వసూలు చేయడం చాలా కష్టమని చెప్పారు.

మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్‌ల‌లో లిక్విడిటీ త‌క్కువ‌..

ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, ఇన్వెస్టర్లు ఒకే స్టాక్‌ను కొలెటరల్‌గా పెట్టి అదే స్టాక్‌లో మరింత భారీ లీవరేజ్ పొజిషన్లు తీసుకోవడమేన‌ని కామత్ వివరించారు. ఒక కస్టమర్ స్టాక్ ఎ ను ప్లెడ్జ్ చేసి 80 శాతం మార్జిన్ పొందుతాడు. ఆ మార్జిన్‌తో మళ్లీ అదే స్టాక్‌లో 400 శాతం వరకు పెద్ద పొజిషన్లు తీసుకుంటాడ‌ని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని కామత్ హెచ్చరించారు. ఎందుకంటే ఈ షేర్లలో లిక్విడిటీ తక్కువగా ఉండటంతోపాటు మార్కెట్ పతనం సమయంలో లోయర్ సర్క్యూట్లు పడితే బయటకు రావడానికి అవకాశం ఉండదని చెప్పారు. ప్రస్తుతం మొత్తం ఇండస్ట్రీ ఎంటీఎఫ్ ఎక్స్‌పోజర్‌లో దాదాపు 50 శాతం నాన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ షేర్లలోనే ఉందని ఆయన వెల్లడించారు. వీటిని పెద్ద ఎఫ్‌అండ్‌ఓ స్టాక్స్‌తో పోలిస్తే తక్కువ లిక్విడిటీ కలిగినవిగా భావిస్తారు.

ఇత‌ర బ్రోక‌ర్ల ఎక్స్‌పోజ‌ర్ 500 శాతం..

జీరోధా ఇప్పటికీ కొలెటరల్ మార్జిన్ ఉపయోగించి ఎంటీఎఫ్ కొనుగోళ్లను అనుమతించడం లేదని కామత్ తెలిపారు. అయితే బ్రోకరేజ్ రంగంలో పెరుగుతున్న పోటీ కారణంగా భవిష్యత్తులో తమ సంస్థ కూడా ఆ నిర్ణయాన్ని పునరాలోచించాల్సి రావచ్చని చెప్పారు. గత 16 నెలల్లో జీరోధా ఎంటీఎఫ్ బుక్ కూడా గణనీయంగా పెరిగిందని, అయితే అది సంస్థ నెట్ వర్త్‌లో సుమారు 25 శాతం వరకే పరిమితమైందని తెలిపారు. కానీ కొన్ని బ్రోకర్ల వద్ద ఈ ఎక్స్‌పోజర్ ఇప్పటికే నెట్ వర్త్‌కు 500 శాతం వరకు చేరిందని, ఇదే ప్రస్తుతం రెగ్యులేటర్లు అనుమతిస్తున్న గరిష్ట పరిమితి అని వెల్లడించారు. గతేడాది బలమైన ర్యాలీ తర్వాత భారత క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ వాల్యూమ్స్ కొంత మందగించినప్పటికీ, డెరివేటివ్స్ , ఎంటీఎఫ్ వంటి లీవరేజ్ ఉత్పత్తుల్లో మాత్రం కార్యకలాపాలు ఇంకా అధికంగానే కొనసాగుతున్న సమయంలో కామత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement