త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు చ‌మురు ధ‌ర‌ల షాక్‌.. సూచీలు భారీగా ప‌త‌నం..

Stock Markets | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల మార్క్‌ను దాటాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా ఐదో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

S

Business | Published On Jul 24, 2026, 9.56 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌కు చ‌మురు ధ‌ర‌ల షాక్‌.. సూచీలు భారీగా ప‌త‌నం..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల మార్క్‌ను దాటాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా ఐదో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు ఇన్ఫోసిస్, ఇండిగో కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం, అమెరికా వాల్ స్ట్రీట్‌లో గ‌త రాత్రి నమోదైన నష్టాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 585.21 పాయింట్లు (0.77 శాతం) పడిపోయి 75,806.18 వద్ద ట్రేడవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 173.65 పాయింట్లు (0.73 శాతం) క్షీణించి 23,695.95 వద్ద కొనసాగింది. ఎర్ర స‌ముద్రంలో రెండు సౌదీ చమురు ట్యాంకర్లపై దాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులపై భారీ సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగి ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగ‌బాకాయి.

100 డాల‌ర్ల మార్క్‌కు చేరిన చ‌మురు ధ‌ర‌లు..

బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100.64 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 91.99 డాలర్ల వద్ద ట్రేడైంది. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, భారత దిగుమతి వ్యయం, కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారైన భారత్‌కు చమురు ధరల పెరుగుదల పెద్ద సవాల్‌గా మారనుంది. దీని వల్ల వాణిజ్య లోటు పెరగడం, రూపాయిపై ఒత్తిడి అధికమవడం, పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు పెరగడం వంటి ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీ.కే. విజయకుమార్ మాట్లాడుతూ ముడి చమురు ధరల పెరుగుదల ప్రస్తుతం భారత మార్కెట్లకు అతిపెద్ద మాక్రో రిస్క్‌గా మారిందన్నారు. మార్కెట్లలో అనిశ్చితి, అధిక ఒడిదుడుకులు కొనసాగుతున్నాయని, హౌతీల దాడుల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు 100 డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు. ఇలాంటి ధరలు భారత చెల్లింపుల సమతుల్యతపై మళ్లీ ఆందోళనలు పెంచుతాయని పేర్కొన్నారు. రూపాయి కూడా స్వల్పంగా బలహీనపడి డాలర్‌తో పోలిస్తే 96.57 వద్దకు చేరిందన్నారు.

మ‌ళ్లీ అమ్మ‌కాల వైపు ఎఫ్‌పీఐలు..

రూపాయి బలహీనపడడంతో ఈ నెలలో కొనుగోళ్లకు మొగ్గుచూపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాల వైపు మళ్లారని ఆయన తెలిపారు. అమెరికా 10 సంవత్సరాల బాండ్ యీల్డ్ 4.7 శాతానికి పెరగడం కూడా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ప్రతికూల సంకేతమని, ఇది సమీప కాలంలో ప్రధాన రిస్క్‌గా మారుతుందని వివరించారు. చమురు ధరలతోపాటు ఇన్ఫోసిస్, ఇండిగో కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ల‌ను నిరాశపరిచాయి. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్ షేర్ 1.43 శాతం క్షీణించగా, అంచనాలకు తగ్గ ఫలితాలు ప్రకటించిన ఇండిగో షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో సూచీ 0.96 శాతం, రియాల్టీ 1.33 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.09 శాతం, మెటల్ 0.88 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.85 శాతం చొప్పున క్షీణించాయి. అయితే నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం 0.23 శాతం స్వల్ప లాభంలో కొనసాగింది. విస్తృత మార్కెట్‌ల‌లో కూడా బలహీనత కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.83 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.78 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 సూచీ 0.71 శాతం నష్టపోయాయి. మార్కెట్‌ల‌లో ఒడిదుడుకులు మరింత పెరిగినట్లు సూచించే ఇండియా విక్స్ 5.75 శాతం ఎగబాకింది.

Advertisement
Advertisement