త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. నాలుగు రోజుల్లో రూ.4 లక్షల కోట్ల నష్టం..

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.

S

Business | Published On Jul 23, 2026, 4.10 pm IST

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. నాలుగు రోజుల్లో రూ.4 లక్షల కోట్ల నష్టం..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు (0.47 శాతం) పడిపోయి 76,391.39 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 127 పాయింట్లు (0.53 శాతం) క్షీణించి 23,869.60 వద్ద స్థిరపడింది. ప్రధాన సూచీలతో పోలిస్తే విస్తృత మార్కెట్లు మరింత బలహీనంగా కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు ఒక్కోటి దాదాపు 1 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో ఉన్న రూ.480 లక్షల కోట్ల నుంచి రూ.477 లక్షల కోట్ల క‌న్నా దిగువకు పడిపోయింది.

భారీగా ఎగ‌బాకిన చ‌మురు ధ‌ర‌లు..

గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,760 పాయింట్లు (2.3 శాతం) క్షీణించింది. అలాగే నిఫ్టీ దాదాపు 465 పాయింట్లు (2 శాతం) నష్టపోయింది. ఈ నాలుగు రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.4 లక్షల కోట్లు తగ్గింది. గత శుక్రవారం బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.481 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా ముడి చమురు ధరల వరుస పెరుగుదల నిలిచింది. చమురు ధరలు పెరగడం వల్ల భారత ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం, వడ్డీ రేట్ల కఠినతరం, కార్పొరేట్ కంపెనీల లాభాల అంచనాల్లో కోత వంటి అంశాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల‌లో చ‌మురు ధ‌ర‌లు ఒక్క సెష‌న్‌లోనే భారీగా ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 3.17 శాతం మేర ఎగబాకి బ్యారెల్‌కు 93 డాల‌ర్ల‌కు చేర‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 4.65 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 91 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు తగ్గింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 0.02 శాతం న‌ష్ట‌పోయిన రూపాయి 96.57 వద్ద స్థిర‌ప‌డింది.

ఉద్రిక్త‌త‌లతో ఆందోళ‌న‌..

ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మందెబ్ జలసంధిలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు మరింత పెరిగాయి. సౌదీపై నౌకాదళ దిగ్బంధనంలో భాగంగానే ఈ దాడులు జరిగాయని హౌతీలు వెల్లడించారు. ఈ దాడుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని దాటి ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందనే భయాలు మార్కెట్లను కుదిపేశాయి. దీంతో చమురు ధరలు మరింత ఎగిశాయి. ముడి చమురు ధరల పెరుగుదల భారత్ లో ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచడంతోపాటు రూపాయి విలువపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు రూపాయి డాలర్‌తో పోలిస్తే 2 శాతానికి పైగా విలువ కోల్పోయింది.

Advertisement
Advertisement