త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Banking | మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల పేరిట బ్యాంకుల భారీ వ‌సూళ్లు.. హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌..

Banking | బ్యాంకు ఖాతాల్లో నిర్దేశించిన కనీస సగటు నిల్వ (మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్) నిర్వహించని ఖాతాదారుల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి రూ.7,086 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది.

S

Business | Published On Jul 29, 2026, 12.34 pm IST

Banking | మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల పేరిట బ్యాంకుల భారీ వ‌సూళ్లు.. హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌..
Advertisement

Banking | బ్యాంకు ఖాతాల్లో నిర్దేశించిన కనీస సగటు నిల్వ (మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్) నిర్వహించని ఖాతాదారుల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి రూ.7,086 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌద‌రి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. పీటీఐ కథనం ప్రకారం.. ప్రైవేట్ రంగ బ్యాంకులే రూ.4,948.71 కోట్లు వసూలు చేయగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) అదే కాలంలో రూ.2,137.92 కోట్ల‌ను వసూలు చేశాయి. ఈ రెండు విభాగాల బ్యాంకులు కలిపి మొత్తం రూ.7,086 కోట్లకు పైగా ఖాతాదారుల నుంచి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన ఉల్లంఘనకు సంబంధించి ఛార్జీల‌ను వసూలు చేశాయి.

వివ‌రాల‌ను వెల్ల‌డించిన మంత్రి పంక‌జ్ చౌద‌రి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలను ఉటంకిస్తూ మంత్రి పంకజ్ చౌద‌రి మాట్లాడుతూ.. ప్రైవేట్ బ్యాంకుల్లో అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.1,798.14 కోట్ల‌ను వసూలు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ రూ.1,081.33 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు బ్యాంకులు మాత్రమే 19 ప్రైవేట్ రంగ బ్యాంకులు వసూలు చేసిన మొత్తం ఛార్జీల్లో 58 శాతం, అంటే రూ.2,879.47 కోట్ల వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. అయితే ప్రధాన మంత్రి జనధన్ యోజన కింద తెరిచిన ఖాతాలు సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు విధించలేదని మంత్రి స్పష్టం చేశారు. మరో ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని పంకజ్ చౌద‌రి తెలిపారు. బ్యాలెన్స్ షీట్లు బలపడటంతోపాటు చారిత్రాత్మక స్థాయిలో లాభాలు నమోదు చేశాయని, స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్ ఎన్‌పీఏలు) పలు దశాబ్దాల్లో కనిష్ఠ స్థాయికి చేరాయని చెప్పారు.

అలాగే ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరంతర రుణ వృద్ధిని నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా తలెత్తిన స్వల్పకాలిక నగదు కొరత సమస్యలను ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలకు సహాయంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెల‌లో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 (ఈసీఎల్‌జీఎస్ 5.0)ను అమల్లోకి తీసుకువచ్చినట్లు కూడా మంత్రి రాజ్యసభకు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement