త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..

Laurus Labs | ఫార్మాసూటికల్ కంపెనీ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ షేర్లు మంగళవారం మరోసారి బలమైన ర్యాలీ కొనసాగించాయి. కంపెనీ ఎఫ్‌వై27 తొలి త్రైమాసికం (జూన్ క్వార్టర్)లో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో బీఎస్‌ఈలో షేరు ధర 2.29 శాతం పెరిగి రూ.1,752.70 వద్ద కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

S

Business | Published On Jul 28, 2026, 3.10 pm IST

Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..
Advertisement

Laurus Labs | ఫార్మాసూటికల్ కంపెనీ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ షేర్లు మంగళవారం మరోసారి బలమైన ర్యాలీ కొనసాగించాయి. కంపెనీ ఎఫ్‌వై27 తొలి త్రైమాసికం (జూన్ క్వార్టర్)లో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో బీఎస్‌ఈలో షేరు ధర 2.29 శాతం పెరిగి రూ.1,752.70 వద్ద కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు దాదాపు 10 శాతం లాభపడింది. గత 12 నెలల్లో 94.43 శాతం ఎగబాక‌గా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు (వైటీడీ) 56.09 శాతం మేర పెరిగింది. ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా గణనీయంగా పెరిగాయి. మంగళవారం నమోదైన ట్రేడింగ్ వాల్యూమ్ గత 30 రోజుల సగటుతో పోలిస్తే 2.53 రెట్లు అధికంగా నమోదైంది. షేరు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (ఆర్‌ఎస్‌ఐ) 71.46 వద్ద ఉండడం బలమైన కొనుగోలు ఆసక్తిని సూచిస్తోంది.

అత్య‌ధిక త్రైమాసిక ఆదాయంతో..

కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేయడం ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. మెరుగైన బిజినెస్ మిక్స్, కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీడీఎంఓ) వ్యాపారం నుంచి పెరిగిన ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యాల మెరుగైన వినియోగం కంపెనీ పనితీరుకు బలాన్నిచ్చాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీ సమీకృత ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 29 శాతం పెరిగి రూ.2,026 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.1,570 కోట్లుగా నమోదైంది. వడ్డీ, పన్నులు, తరుగుదల, తరుగుదల వ్యయాలకు ముందు లాభం (ఈబిట్‌డా) 67 శాతం పెరిగి రూ.638 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.382 కోట్లుగా ఉంది. ఈబిట్‌డా మార్జిన్ 24.3 శాతం నుంచి 31.5 శాతానికి గణనీయంగా పెరిగింది. నికర లాభం కూడా రెండింతలకు పైగా పెరిగి రూ.163 కోట్ల నుంచి రూ.368 కోట్లకు చేరుకుంది.

బై రేటింగ్ ఇచ్చిన విశ్లేష‌కులు..

మంగళవారం లారస్ ల్యాబ్స్ షేరు రూ.1,752.70 వద్ద ట్రేడవ‌గా, అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 0.15 శాతం మాత్రమే లాభంలో కొనసాగింది. బ్లూమ్‌బర్గ్ గణాంకాల ప్రకారం కంపెనీని ట్రాక్ చేస్తున్న 19 మంది విశ్లేషకుల్లో 11 మంది బై రేటింగ్ ఇవ్వగా, నలుగురు హోల్డ్, మరో నలుగురు సెల్ రేటింగ్ కొనసాగిస్తున్నారు. విశ్లేషకుల 12 నెలల సగటు లక్ష్య ధర రూ.1,630.33గా ఉండటంతో ప్రస్తుత స్థాయితో పోలిస్తే సుమారు 6.2 శాతం తగ్గుదల అవకాశాన్ని సూచిస్తోంది.

Advertisement
Advertisement