త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌లో భారీ ర్యాలీ.. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీ ర్యాలీతో దూసుకెళ్లాయి. అన్ని విభాగాల్లోనూ బ‌ల‌మైన కొనుగోళ్లు క‌నిపించాయి. ఐదు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు చెక్ పెడుతూ ప్రధాన సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 776 పాయింట్లు (1.02 శాతం) ఎగిసి 76,835.78 వద్ద ముగిసింది.

S

Business | Published On Jul 27, 2026, 4.03 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్‌ల‌లో భారీ ర్యాలీ.. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీ ర్యాలీతో దూసుకెళ్లాయి. అన్ని విభాగాల్లోనూ బ‌ల‌మైన కొనుగోళ్లు క‌నిపించాయి. ఐదు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు చెక్ పెడుతూ ప్రధాన సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ 776 పాయింట్లు (1.02 శాతం) ఎగిసి 76,835.78 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 229 పాయింట్లు (0.96 శాతం) పెరిగి 23,995.95 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కూడా కొనుగోళ్లు జోరుగా సాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.11 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.31 శాతం ఎగిసింది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ట్రేడింగ్ సెషన్‌లోని సుమారు రూ.476 లక్షల కోట్ల నుంచి రూ.481 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లు పెరిగింది.

భారీగా ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. అదే ప్రభావం భారతీయ మార్కెట్‌ల‌పైనా కనిపించింది. మధ్యప్రాచ్య పరిస్థితులు దౌత్యపరంగా పరిష్కారమయ్యే అవకాశాలపై ఆశలు పెరగడం, హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరా అంతరాయం ఉండకపోవచ్చనే అంచనాలు మార్కెట్‌కు ఊరటనిచ్చాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు 9 శాతానికి పైగా పడిపోయి బ్యారెల్‌కు సుమారు 87 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు, వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు తగ్గాయి. అలాగే ఫారెక్స్ మార్కెట్‌లోనూ భార‌త రూపాయి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.9 వ‌ద్ద ఉన్న రూపాయి ఒక్క సెష‌న్‌లోనే 65 పైస‌లు లాభ‌ప‌డింది.

త‌గ్గిన ఆందోళ‌న‌లు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో దాడులు నిలిచిపోవడం వల్ల దిగుమతి వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ఉన్న ఆందోళనలు తగ్గి మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ కనిపించిందన్నారు. క్రూడ్ చమురు ధరలు గణనీయంగా తగ్గడం, దీర్ఘకాలిక బాండ్ యీల్డ్‌లు పడిపోవడం కూడా మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. అలాగే లాంగ్ అన్‌వైండింగ్ సంకేతాలు కూడా పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చాయని వివరించారు.

Advertisement
Advertisement