త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | దేశీయ‌ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 600కు పైగా పాయింట్లు ఎగసిపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మళ్లీ 23,900 మార్క్‌ను దాటింది.

S

Business | Published On Jul 27, 2026, 10.29 am IST

Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | దేశీయ‌ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 600కు పైగా పాయింట్లు ఎగసిపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మళ్లీ 23,900 మార్క్‌ను దాటింది. అన్ని రంగాల్లో కొనుగోళ్లు పెరగడం, ముడి చమురు ధరలు తగ్గడం, పశ్చిమ ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ తీసుకునే ధోరణి మెరుగుపడటం ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 636 పాయింట్లు (0.85 శాతం) పెరిగి 76,696 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 197 పాయింట్లు (0.82 శాతం) లాభపడి 23,964.50 వద్ద కొనసాగింది. ప్రధాన సూచీల కంటే విస్తృత మార్కెట్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ఆసక్తి పెరగడంతో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.05 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.12 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఐటీ షేర్ల‌లో ర్యాలీ..

మార్కెట్‌లో భయ సూచికగా భావించే ఇండియా విక్స్ కూడా 5.66 శాతం తగ్గి 13.24కు చేరింది. దీంతో సమీప కాలంలో మార్కెట్ ఒడిదుడుకులు తగ్గే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు లభిస్తున్నాయి. ఈ ర్యాలీకి ఐటీ రంగం ప్రధాన బలంగా నిలిచింది. నిఫ్టీ ఐటీ సూచీ 2.28 శాతం ఎగిసి అన్ని రంగాల సూచీల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ షేర్‌ 3.37 శాతం పెరగగా, టీసీఎస్ 2.16 శాతం, టెక్ మహీంద్రా 1.97 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.68 శాతం లాభపడ్డాయి. ఐటీతో పాటు మీడియా సూచీ 1.64 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.06 శాతం, రియాల్టీ 1.01 శాతం, ఫార్మా 0.96 శాతం, హెల్త్‌కేర్ 0.93 శాతం, ఆటో 0.72 శాతం, మెటల్ 0.70 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.69 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.67 శాతం, ప్రైవేట్ బ్యాంక్ 0.63 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.54 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాత్రం 0.17 శాతం స్వల్ప లాభంతో వెనుకబడింది.సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 29 షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఒక్కటే 0.13 శాతం నష్టంలో నిలిచింది.

చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌నం..

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 5 శాతానికి పైగా ప‌త‌న‌మై బ్యారెల్‌కు 87 డాల‌ర్ల‌కు దిగి వ‌చ్చింది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 6 శాతానికి పైగా పడిపోయి బ్యారెల్‌కు 85 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మెరుగైన ప్రారంభాన్ని న‌మోదు చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 96.23 వ‌ద్ద ఉన్న రూపాయి సెషన్‌లో 32 పైస‌లు లాభ‌ప‌డింది. అమెరికా వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై కొత్త దాడులు చేయకుండా ఉండటంతో పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై ఆశలు పెరిగాయి. దీంతో గతవారం భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు ఇప్పుడు భారీగా త‌గ్గాయి.

Advertisement
Advertisement