త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ ప‌రిశీలిస్తుంది..

ITR | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్)ను గడువులోగా దాఖలు చేశామంటే అంతా సవ్యంగానే పూర్తైందని భావించే వారికి కీలక హెచ్చరిక వచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విడుదల చేసింది.

S

Business | Published On Jun 9, 2026, 4.52 pm IST

ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ ప‌రిశీలిస్తుంది..
Advertisement

ITR | ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్)ను గడువులోగా దాఖలు చేశామంటే అంతా సవ్యంగానే పూర్తైందని భావించే వారికి కీలక హెచ్చరిక వచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విడుదల చేసింది. ఇందులో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐటీఆర్‌ల‌ను ఆటోమేటిక్‌గా పూర్తి స్థాయి పరిశీలన (కంప్లీట్ స్క్రూటినీ) కోసం ఎంపిక చేస్తార‌ని స్పష్టం చేసింది. సీబీడీటీ విడుదల చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, సీఎస్-01 నుంచి సీఎస్-06 వరకు ఆరు ప్రత్యేక స్కెనారియో కోడ్స్ కింద ఉన్న కేసులు తప్పనిసరిగా పన్ను పరిశీలనకు వెళ్తాయి. 2024 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత సెక్షన్ 133ఎ కింద వ్యాపార ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సర్వే నిర్వహించిన పన్ను చెల్లింపుదారుల కేసులు తప్పనిసరిగా స్క్రూటినీకి ఎంపిక అవుతాయి. అయితే సెక్షన్ 133ఎ(2ఎ) కింద జరిగిన సర్వేల‌కు దీని నుంచి మినహాయింపు ఇస్తారు.

సెక్ష‌న్ 132, 132ఎ ప్ర‌కారం..

సెక్షన్ 132 కింద సెర్చ్ ఆపరేషన్లు లేదా సెక్షన్ 132ఎ కింద రిక్విజిషన్ చర్యలు ఎదుర్కొన్న పన్ను చెల్లింపుదారుల రిటర్న్లు కూడా ఆటోమేటిక్‌గా పరిశీలనకు వెళ్తాయి. 2024 సెప్టెంబర్ 1 తర్వాత ప్రారంభమైన సెర్చ్‌లు లేదా రిక్విజిషన్‌ల విషయంలో, సెక్షన్ 158బిఎ(6) పరిధిలోకి వచ్చే అసెస్‌మెంట్ సంవత్సరానికి రిటర్న్‌ను ఎంపిక చేస్తారు. సెక్షన్ 148 కింద రీ-అసెస్‌మెంట్ నోటీసు జారీ చేసిన కేసులు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఉంటాయి. ఇటువంటి రిటర్నుల‌ను పూర్తి స్థాయి పరిశీలనకు ఎంపిక చేస్తారు. సెక్షన్ 12ఎ, 12ఎబి, 10(23సి) లేదా సెక్షన్ 35 కింద లభించే అనుమతుల‌నులు రద్దు చేసిన లేదా ఉపసంహరించినప్పటికీ, ఐటీఆర్-7లో పన్ను మినహాయింపులు లేదా డిడక్షన్లు క్లెయిమ్ చేసిన ట్రస్టులు, సంస్థల కేసులు కూడా తప్పనిసరిగా స్క్రూటినీకి వెళ్తాయి. గత అసెస్‌మెంట్‌లలో పెద్ద మొత్తంలో అదనపు పన్ను నిర్ధారణలు (అడిషన్స్) జరిగి, అదే అంశం మళ్లీ కొనసాగుతున్నట్లయితే ఆ కేసులు కూడా పరిశీలనకు ఎంపిక అవుతాయి.

ప‌రిమితుల‌ను విధించిన సీబీడీటీ..

అయితే వీటికి సీబీడీటీ కొన్ని ప‌రిమితుల‌ను నిర్ణయించింది. మెట్రో నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణెల్లో రూ.50 లక్షలకు పైగా అడిషన్స్ ఉండాలి. ఇతర ప్రాంతాల్లో అయితే రూ.20 లక్షలకు పైగా అడిషన్స్ ఉండాలి. ఈ అడిషన్స్ తుది రూపం దాల్చి ఉండాలి లేదా అప్పీలేట్ అధికారుల వద్ద ఆదాయపు పన్ను శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. గతంలో ఎలాంటి కంప్లయన్స్ సమస్యలు లేకపోయినా, చట్ట అమలు సంస్థలు లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిర్దిష్ట పన్ను ఎగవేత సమాచారాన్ని అందిస్తే ఆ పన్ను చెల్లింపుదారుల రిటర్నులు కూడా స్క్రూటినీకి ఎంపిక అవుతాయి.

ఈ సూచ‌న‌ల‌ను పాటించాలి..

స్క్రూటినీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ప‌లు సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అన్ని వనరుల నుంచి వచ్చిన ఆదాయాన్ని కచ్చితంగా ప్రకటించాలి. ఐటీఆర్‌లో ఇచ్చిన వివరాలు, ఆర్థిక రికార్డులతో సరిపోలాలి. డిడక్షన్లు, మినహాయింపులకు సంబంధించిన ఆధారాలను సక్రమంగా భద్రపరచాలి. అధిక విలువ కలిగిన లావాదేవీలను సరైన విధంగా వెల్లడించాలి. ఇప్పటి పరిస్థితుల్లో ఐటీఆర్ ఫైలింగ్ అనేది కేవలం గడువు లోపల రిటర్న్ దాఖలు చేయడానికే పరిమితం కాదు. ఆదాయపు పన్ను శాఖ డేటా అనలిటిక్స్, వివిధ వనరుల నుంచి అందే సమాచారాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో, రికార్డుల్లో వ్యత్యాసాలు, పునరావృత కంప్లయన్స్ సమస్యలు లేదా అనుమానాస్పద అంశాలు ఉంటే రిటర్నులు పరిశీలనకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే ఆదాయ వివరాల నమోదు, పన్ను మినహాయింపుల క్లెయిమ్‌లు, ఆర్థిక లావాదేవీల వెల్లడిలో పూర్తి క‌చ్చితత్వం పాటించడం అత్యంత ముఖ్యంగా మారింది.

Advertisement
Advertisement