త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio IPO | జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు.. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు దిశగా..

Jio IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

S

Business | Published On Jun 19, 2026, 5.22 pm IST

Jio IPO | జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు.. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు దిశగా..
Advertisement

Jio IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)కి ఆమోదం ల‌భించిందని, సెబీతోపాటు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు కూడా ఫైలింగ్‌ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక్కో షేరుకు రూ.10 ముఖ విలువతో గరిష్టంగా 27 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ రూపంలో ఐపీఓను తీసుకురానున్నారు. అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత ఈ ఐపీఓ మార్కెట్లోకి రానుంది.

వారసుల‌ను ప్ర‌క‌టించిన ముకేష్ అంబానీ..

ఈ సందర్భంగా ముకేష్ అంబానీ మాట్లాడుతూ జియో ఐపీఓ రిలయన్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన విలువ సృష్టి ఘట్టాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత వాటాదారులకు గణనీయమైన విలువను అందించడమే కాకుండా, కొత్త పెట్టుబడిదారులకు కూడా ఆకర్షణీయమైన అవకాశంగా మారుతుందని చెప్పారు. రిలయన్స్‌కు తన వాటాదారులతో ఉన్న అనుబంధం గర్వం, నమ్మకం, గౌరవం, ఉమ్మడి వృద్ధి పునాదులపై నిర్మితమైనదని ఆయన పేర్కొన్నారు. జియో భవిష్యత్ అభివృద్ధికి తదుపరి తరం నాయకత్వం సిద్ధమైందని చెబుతూ ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ, అనంత్ అంబానీ జియో ఐపీఓ ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారని ముకేష్ అంబానీ తెలిపారు. భవిష్యత్ విలువ సృష్టి అవకాశాలను వీరే ముందుకు నడిపిస్తారని చెప్పారు.

అతి పెద్ద ఐపీవో దిశ‌గా..

పదేళ్ల క్రితం భారత్‌లో డిజిటల్ అసమానతలను తొలగించాలనే లక్ష్యంతో జియో ప్రారంభమైందని ముకేష్ అంబానీ గుర్తుచేశారు. అప్పట్లో ఖరీదైన వాయిస్ సేవలు, అధిక ధరల డేటా, తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్న పరిస్థితులను జియో పూర్తిగా మార్చేసిందన్నారు. ఉచిత వాయిస్ సేవలు, సరసమైన ధరల్లో హైస్పీడ్ డేటా అందించి కోట్లాది భారతీయుల డిజిటల్ జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు. కాగా మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం జియో ఐపీఓ భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశముంద‌ని భావిస్తున్నారు. దీని విలువ సుమారు 4 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 52.4 కోట్లకు పైగా చందాదారులతో జియో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతోంది. జియో 5జీ సేవలకు 26.8 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా 1.3 కోట్ల గృహాలకు కనెక్టివిటీని అందిస్తోంది. దీంతో జియో లిస్టింగ్‌పై దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement