త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SGB | 6 ఏళ్లలో 313 శాతం లాభం.. పెట్టుబ‌డిదారుల‌కు లాభాలు కురిపిస్తున్న గోల్డ్ బాండ్స్‌..

SGB | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2019-20 సిరీస్-7 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీలు)కు ముందస్తు రిడెంప్షన్‌ను ప్రకటించింది. ఈ బాండ్లు 2019 డిసెంబర్ 10న జారీ కాగా, ఐదేళ్లు పూర్తైన నేపథ్యంలో 2026 జూన్ 10న ముందస్తు రిడెంప్షన్‌కు అనుమతి ఇచ్చింది. ఆర్‌బీఐ నిర్ణయించిన రిడెంప్షన్ ధర యూనిట్‌కు రూ.15,275గా ఉంది.

S

Business | Published On Jun 10, 2026, 3.31 pm IST

SGB | 6 ఏళ్లలో 313 శాతం లాభం.. పెట్టుబ‌డిదారుల‌కు లాభాలు కురిపిస్తున్న గోల్డ్ బాండ్స్‌..
Advertisement

SGB | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2019-20 సిరీస్-7 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీలు)కు ముందస్తు రిడెంప్షన్‌ను ప్రకటించింది. ఈ బాండ్లు 2019 డిసెంబర్ 10న జారీ కాగా, ఐదేళ్లు పూర్తైన నేపథ్యంలో 2026 జూన్ 10న ముందస్తు రిడెంప్షన్‌కు అనుమతి ఇచ్చింది. ఆర్‌బీఐ నిర్ణయించిన రిడెంప్షన్ ధర యూనిట్‌కు రూ.15,275గా ఉంది. ఈ బాండ్ జారీ సమయంలో ఒక్క యూనిట్ ధర రూ.3,745గా ఉండగా, ఇప్పుడు పెట్టుబడిదారులకు సుమారు 307.87 శాతం లాభం లభిస్తోంది. ఇందులో పెట్టుబడిదారులు పొందిన వార్షిక 2.5 శాతం వడ్డీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు చేసిన వారికి అప్పట్లో రూ.50 డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో కొంతమంది పెట్టుబడిదారులు ఒక్క యూనిట్‌ను రూ.3,695కే కొనుగోలు చేశారు. ఆ ధరను ఆధారంగా తీసుకుంటే ప్రస్తుతం లాభం 313.39 శాతానికి చేరింది.

3 రోజుల స‌గ‌టుతో ధ‌ర లెక్కింపు..

ఆర్‌బీఐ జూన్ 9, 2026న విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం గోల్డ్ బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయ్యాక వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తు రిడెంప్షన్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందువల్ల ఈ సిరీస్‌కు సంబంధించిన తదుపరి ముందస్తు రిడెంప్షన్ తేదీని 2026 జూన్ 10గా నిర్ణయించారు. రిడెంప్షన్ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించిన బంగారం ముగింపు ధరల ఆధారంగా లెక్కించారు. 2026 జూన్ 5, జూన్ 8, జూన్ 9 తేదీల ముగింపు ధరల సగటును తీసుకుని ఈ ధరను నిర్ణయించారు. ఎస్‌జీబీ పథకం నిబంధనల ప్రకారం బాండ్ల అసలు కాలపరిమితి ఎనిమిదేళ్లు. అయితే ఐదేళ్లు పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తు రిడెంప్షన్‌కు అవకాశం ఉంటుంది. మిగిలిన పెట్టుబడిదారులు బాండ్లను మెచ్యూరిటీ వరకు కూడా కొనసాగించవచ్చు.

ప‌న్ను మిన‌హాయింపులు..

సావరిన్ గోల్డ్ బాండ్లపై లభించే 2.5 శాతం వడ్డీ ఆదాయం ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే వ్యక్తిగత పెట్టుబడిదారులు బాండ్లను రిడీమ్ చేసుకున్నప్పుడు వచ్చే క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. బాండ్లను ఇతరులకు బదిలీ చేసిన సందర్భంలో వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్లపై వార్షికంగా 2.5 శాతం స్థిర వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. బంగారం గ్రాముల రూపంలో విలువ నిర్ణయించే ఈ బాండ్లు పెట్టుబడిదారులకు రెండు ప్రయోజనాలు అందిస్తాయి.

ఎందుకు నిలిపివేశారు..?

ఒకవైపు బంగారం ధర పెరుగుదల వల్ల మూలధన లాభం పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీ కూడా లభిస్తుంది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం, బంగారం నిల్వలను నియంత్రించడం, కుటుంబ పొదుపులను ఆర్థిక ఆస్తుల వైపు మళ్లించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2023 అక్టోబర్‌లో ప్రభుత్వం కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. ఈ పథకం తన ప్రధాన లక్ష్యాలను చాలా వరకు సాధించిందని, అలాగే బాండ్ల నిర్వహణ, వడ్డీ చెల్లింపుల ఖర్చులు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వంటి ఇతర బంగారం పెట్టుబడి మార్గాలు అందుబాటులోకి రావడంతో ఎస్‌జీబీల అవసరం తగ్గింది. అయినప్పటికీ ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు ఉంచుకోవచ్చు లేదా నిబంధనల ప్రకారం ముందస్తు రిడెంప్షన్‌ను ఎంచుకోవచ్చు.

Advertisement
Advertisement