త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Life Insurance | డయాబెటిస్‌ అంటూ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ తిరస్కరణ.. ఢిల్లీ కమిషన్‌ కీలక తీర్పు..

Life Insurance | భర్త తీసుకున్న రూ.20 లక్షల లైఫ్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను డయాబెటిస్‌, కిడ్నీ వ్యాధులు దాచిపెట్టారనే కారణంతో తిరస్కరించిన ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఢిల్లీ స్టేట్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రీడ్రెసల్‌ కమిషన్‌ భారీ షాక్‌ ఇచ్చింది. సరైన ఆధారాలు లేకుండా క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టబద్ధం కాదని స్పష్టం చేస్తూ బాధిత మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

S

Business | Published On May 23, 2026, 3.35 pm IST

Life Insurance | డయాబెటిస్‌ అంటూ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ తిరస్కరణ.. ఢిల్లీ కమిషన్‌ కీలక తీర్పు..
Advertisement

Life Insurance | భర్త తీసుకున్న రూ.20 లక్షల లైఫ్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను డయాబెటిస్‌, కిడ్నీ వ్యాధులు దాచిపెట్టారనే కారణంతో తిరస్కరించిన ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఢిల్లీ స్టేట్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రీడ్రెసల్‌ కమిషన్‌ భారీ షాక్‌ ఇచ్చింది. సరైన ఆధారాలు లేకుండా క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టబద్ధం కాదని స్పష్టం చేస్తూ బాధిత మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కమిషన్‌ అభిప్రాయం ప్రకారం, పాలసీ తీసుకునే సమయంలో మరణించిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వ్యాధులను దాచిపెట్టారని నిరూపించే పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను ఇన్సూరెన్స్‌ కంపెనీ సమర్పించలేకపోయింది. ఈ కేసు ఢిల్లీకి చెందిన మిస్‌ కైన్‌కు సంబంధించినది. ఆమె భర్త బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.20 లక్షల లోన్‌ తీసుకున్నారు. ఆ లోన్‌కు రక్షణగా ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇండియా ఫస్ట్‌ గ్రూప్‌ క్రెడిట్‌ లైఫ్‌ ప్లాన్‌ కింద లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నారు. కేసు రికార్డుల ప్రకారం పాలసీ ప్రారంభ తేదీ జూన్‌ 20, 2012 కాగా సమ్‌ అష్యూర్డ్‌ రూ.20 లక్షలుగా నిర్ణ‌యించారు. చెల్లించిన ప్రీమియం: రూ.56,011 కాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లోన్‌కు పాల‌సీని లింక్ చేశారు.

అస‌లేమైంది..

ఇలాంటి పాలసీలను సాధారణంగా హోమ్‌ లోన్‌ లింక్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు అంటారు. లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబంపై అప్పు భారం పడకుండా రక్షించడమే వీటి ఉద్దేశ్యం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్‌ కంపెనీ బ్యాంక్‌కు బకాయి లోన్‌ మొత్తాన్ని చెల్లిస్తుంది. పాలసీదారుడు ఫిబ్రవరి 2014లో మరణించడంతో ఆయన భార్య క్లెయిమ్‌ దాఖలు చేశారు. అవసరమైన ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసినప్పటికీ ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఇన్సూరెన్స్‌ కంపెనీ వాదన ప్రకారం పాలసీ తీసుకునే సమయంలో మరణించిన వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టారు. ఆయనకు టైప్‌-2 డయాబెటిస్‌ ఉందని, ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని, క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నారని, పాలసీకి ముందు నుంచే డయాలసిస్‌ చికిత్స పొందుతున్నారని ఇన్సూరెన్స్ కంపెనీ వాదించింది. ఈ ఆరోగ్య సమస్యలను ప్రపోజల్‌ ఫామ్‌లో వెల్లడించలేదని, తెలిసి ఉంటే పాలసీ జారీ చేసేవాళ్లం కాదని కంపెనీ వాదించింది. అందుకే క్లెయిమ్‌ను తిరస్కరించామని తెలిపింది.

ఆధారాలు ఉన్నాయా..

ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటన ప్రకారం, క్లెయిమ్‌ వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం స్వతంత్ర విచారణ చేపట్టామని తెలిపింది. పాలసీదారుడు ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టినట్లు విచారణలో తేలిందని పేర్కొంది. అలాగే స్టేట్‌ కమిషన్‌ ఇచ్చిన తాజా ఆదేశాన్ని గమనించామని, అయితే ప్రీ-పాలసీ మెడికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నేషనల్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రీడ్రెసల్‌ కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ)లో అప్పీల్‌ దాఖలు చేశామని వెల్లడించింది. ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్‌ తిరస్కరణకు సరైన ఆధారాలున్నాయా అనే అంశాన్ని కమిషన్‌ పరిశీలించింది. సుప్రీంకోర్టు, నేషనల్‌ కన్స్యూమర్‌ కమిషన్‌ గత తీర్పులను కూడా పరిశీలించింది. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ వంటి సాధారణ లైఫ్‌స్టైల్‌ వ్యాధులను క్లెయిమ్‌ తిరస్కరణకు ఆటోమేటిక్‌గా కారణంగా చూపలేరు. ఉద్దేశపూర్వకంగా వ్యాధులను దాచిపెట్టారని నిరూపించే పక్కా ఆధారాలు లేవు. పాలసీ జారీకి ముందు సరైన మెడికల్‌ పరీక్ష నిర్వహించలేదు. పాలసీదారుడి వయసు దాదాపు 50 ఏళ్లు అయినప్పటికీ కంపెనీ పాలసీ జారీ చేసింది. క్లెయిమ్‌ తిరస్కరణలో 213 రోజుల ఆలస్యం జరిగింది. ఇది ఐఆర్డీఏఐ నిబంధనలకు విరుద్ధం. త‌మ వైఫల్యాన్ని తర్వాత వినియోగదారులపై మోపలేరని కమిషన్‌ వ్యాఖ్య‌లు చేసింది.

క‌మిష‌న్ తీర్పు..

ఈ క్ర‌మంలో కమిషన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. బాధిత మహిళకు రూ.20 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ చెల్లించాలి. నవంబర్‌ 10, 2014 నుంచి ఏప్రిల్‌ 24, 2026 వరకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ చెల్లించాలి. మానసిక వేదన, వేధింపులకు రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలి. లిటిగేషన్‌ ఖర్చుల కింద రూ.50వేల‌ను చెల్లించాలని చెప్పింది. రెండు నెలల్లో చెల్లించకపోతే మొత్తంపై 9 శాతం వార్షిక వడ్డీ వర్తిస్తుందని కూడా కమిషన్‌ హెచ్చరించింది. అడ్వొకేట్‌ మయాంక్‌ అరోరా తెలిపిన ప్రకారం ఇన్సూరెన్స్‌ కంపెనీ చేసిన ఆరోపణలకు సరైన మెడికల్‌ ఆధారాలు లేకపోవడం కీలక అంశమైంది. విచారణ రిపోర్ట్‌ ఎక్కువగా విన్నవాటిపైనే ఆధారపడిందని కమిషన్‌ గుర్తించింది. ఒకవైపు కిడ్నీ వ్యాధి, డయాబెటిస్‌ ఉన్నాయని కంపెనీ చెప్పగా, మరోవైపు తమ విచారణలో సరైన మెడికల్‌ హిస్టరీ లభించలేదని రికార్డులు చూపించాయని ఆయన వివరించారు. అలాగే ఆరోపించిన వ్యాధులు, మరణ కారణం మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కూడా కంపెనీ నిరూపించలేకపోయిందని కమిషన్‌ స్పష్టం చేసింది. సోలారిస్‌ లీగల్‌ పార్టనర్‌ త్రినాథ్‌ తడకమళ్ల తెలిపిన ప్రకారం, ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం 90 రోజుల్లో క్లెయిమ్‌పై నిర్ణయం తీసుకోవాలి. కానీ కంపెనీ 213 రోజులు తీసుకోవడం పెద్ద లోపమని చెప్పారు.

పాల‌సీదారులు తెలుసుకోవాల్సిన‌వి..

ఈ తీర్పు నుంచి పాలసీదారులు ప‌లు విష‌యాల‌ను గుర్తుంచుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. పాలసీ తీసుకునే సమయంలో పూర్తి డాక్యుమెంట్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే నిజాయితీగా వెల్లడించాలి. డయాబెటిస్‌, బీపీ వంటి సాధారణ వ్యాధుల పేరుతో క్లెయిమ్‌ను తిరస్కరిస్తే వెంటనే చట్టపరమైన సహాయం తీసుకోవాలి. క్లెయిమ్‌ తిరస్కరణకు కారణమైన డాక్యుమెంట్ల‌ను కంపెనీ నుంచి అడగాల‌ని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement