త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO | ఈపీఎఫ్‌వో సభ్యుల‌కు చాలా మందికి తెలియ‌ని బెనిఫిట్‌.. పైసా ఖ‌ర్చు లేకుండా రూ.7 ల‌క్ష‌ల బీమా ల‌భిస్తుంది..

EPFO | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు ఓ కీలక విషయం తెలియదు. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షల రూపాయల జీవిత బీమా కవరేజీ పొందే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు.

S

Business | Published On Jun 11, 2026, 3.20 pm IST

EPFO | ఈపీఎఫ్‌వో సభ్యుల‌కు చాలా మందికి తెలియ‌ని బెనిఫిట్‌.. పైసా ఖ‌ర్చు లేకుండా రూ.7 ల‌క్ష‌ల బీమా ల‌భిస్తుంది..
Advertisement

EPFO | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు ఓ కీలక విషయం తెలియదు. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షల రూపాయల జీవిత బీమా కవరేజీ పొందే అవకాశం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ పథకం ద్వారా అర్హులైన ఉద్యోగులకు గరిష్టంగా రూ.7 లక్షల వరకు జీవిత బీమా రక్షణ లభిస్తుంది. ఈ ప్రయోజనం కేవలం ఈపీఎఫ్‌ఓ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ప్రతి నెలా జీతం నుంచి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) కట్ అవుతున్న ఉద్యోగులు ఈ ఉచిత బీమాకు అర్హులు. అయితే ఒక ముఖ్యమైన షరతు ఉంది. స‌భ్యుడి ఈపీఎఫ్ ఖాతాలో నామినీ వివరాల‌ను సరిగ్గా నమోదు చేసి, అప్‌డేట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం పూర్తిగా అందుతుంది.

ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన ప‌నిలేదు..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన సభ్యులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) పథకం ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది ఓ ప్రత్యేక జీవిత బీమా పథకం. ఉద్యోగి ఉద్యోగంలో ఉన్న సమయంలో మరణిస్తే, అతని కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈపీఎఫ్‌ఓ పరిధిలో అమలవుతున్న ఈ పథకం కేవలం ఈపీఎఫ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగి సేవలో ఉండగా మరణిస్తే, బీమా మొత్తాన్ని పూర్తిగా నామినీ లేదా చట్టబద్ధ వారసుల‌కు చెల్లిస్తారు. ఈ పథకంలోని అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే, ఉద్యోగి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. మొత్తం ప్రీమియం భారాన్ని యజమాని లేదా కంపెనీ భరిస్తుంది. అందువల్ల ఈపీఎఫ్ పరిధిలో ఉన్న ప్రతి అర్హత క‌లిగిన‌ ఉద్యోగి ఆటోమేటిక్‌గా ఈ పథకం కింద కవర్ అవుతారు.

ఈపీఎఫ్‌వోలో యాక్టివ్‌గా ఉంటే చాలు..

ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ ఈపీఎఫ్ సభ్యుడిగా ఉన్న ఉద్యోగి ఈ పథకానికి ఆటోమేటిక్‌గా అర్హుడు అవుతాడు. ఈడీఎల్‌ఐ కింద గరిష్టంగా రూ.7 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కనీసం రూ.2.5 లక్షల ప్రయోజనం కూడా అందుతుంది. ఉద్యోగి వేతనం, పీఎఫ్ ఖాతాలోని సగటు నిల్వ ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణ‌యిస్తారు. ఉద్యోగి సేవలో ఉండగా మరణిస్తే ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేసిన నామినీకి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. నామినీ లేకపోతే కుటుంబ సభ్యులు లేదా చట్టబద్ధ వారసులు ఈ ప్రయోజనం పొందవచ్చు. లబ్ధిదారులు మైనర్ లు అయితే, వారి సంరక్షకుల‌కి మొత్తాన్ని చెల్లిస్తారు.

క్లెయిమ్‌, చెల్లింపులు ఇలా..

ఈ బీమాను క్లెయిమ్ చేయాలంటే ప‌లు ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఫామ్ 5ఐఎఫ్ (ఈడీఎల్ఐ క్లెయిమ్ ఫామ్‌), మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ లేదా క్లెయిమెంట్ గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు (పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చేసిన చెక్), యూఏఎన్ లేదా ఈపీఎఫ్ సభ్యుడి వివరాలు, నామినీ లేని సందర్భంలో సక్సెషన్ సర్టిఫికెట్ వంటి ప‌త్రాల‌ను అంద‌జేయాలి. ఉద్యోగి చివరిగా పనిచేసిన సంస్థ ద్వారా పత్రాలను ధ్రువీకరించి ప్రాంతీయ ఈపీఎఫ్‌ఓ కార్యాలయానికి సమర్పించాలి. అనేక సందర్భాల్లో ఆన్‌లైన్ క్లెయిమ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. పత్రాల పరిశీలన పూర్తైన తర్వాత ఆమోదించిన మొత్తం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సాధారణంగా క్లెయిమ్ పరిష్కారం సుమారు 30 రోజుల్లో పూర్తవుతుంది. ఇటీవల ఈపీఎఫ్‌ఓ త‌న సభ్యులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. కేవలం ఈ-నామినేషన్ పూర్తి చేయడం సరిపోదని స్పష్టం చేసింది. ఆధార్ ఆధారిత ఈ-సైన్ కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలి. లేకపోతే భవిష్యత్తులో పీఎఫ్, పెన్షన్, ఈడీఎల్‌ఐ ప్రయోజనాలు పొందడంలో నామినీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.

Advertisement
Advertisement