త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hydrogen Train | దేశంలోనే తొలి హైడ్రోజ‌న్ రైలు.. విశేషాలు ఇవే..

Hydrogen Train | భార‌త రైల్వే చ‌రిత్ర‌లో మ‌రో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దేశంలోనే మొట్ట‌మొద‌టి హ‌రిత హైడ్రోజ‌న్ ఆధారిత రైలు ప్రారంభం కానుంది. జూలై 17న ప్ర‌ధాని మోదీ హర్యానాలోని జింద్ నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. స్వ‌చ్ఛ‌మైన‌, హ‌రిత‌, ఉద్గారాలు లేని ర‌వాణా దిశ‌గా ఇది ఓ పెద్ద ముంద‌డుగా మార‌నుంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

S

Business | Published On Jul 16, 2026, 1.19 pm IST

Hydrogen Train | దేశంలోనే తొలి హైడ్రోజ‌న్ రైలు.. విశేషాలు ఇవే..
Advertisement

Hydrogen Train | భార‌త రైల్వే చ‌రిత్ర‌లో మ‌రో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దేశంలోనే మొట్ట‌మొద‌టి హ‌రిత హైడ్రోజ‌న్ ఆధారిత రైలు ప్రారంభం కానుంది. జూలై 17న ప్ర‌ధాని మోదీ హర్యానాలోని జింద్ నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. స్వ‌చ్ఛ‌మైన‌, హ‌రిత‌, ఉద్గారాలు లేని ర‌వాణా దిశ‌గా ఇది ఓ పెద్ద ముంద‌డుగా మార‌నుంద‌ని నిపుణులు భావిస్తున్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ ఈ వివ‌రాల‌ను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో వెల్ల‌డించారు. హైడ్రోజ‌న్ రైలు చిత్రాల‌ను కూడా ఆయ‌న పోస్ట్ చేశారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి హైడ్రోజ‌న్ ఆధారిత రైలు హ‌ర్యానా నుంచి ప్రారంభం కానుంద‌ని వెల్ల‌డించారు. భార‌తీయ రైల్వేకు చెందిన హైడ్రోజ‌న్ ఫ‌ర్ హెరిటేజ్ ప‌థ‌కంలో భాగంగా ఈ రైలును కేంద్రం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా వార‌స‌త్వ‌, గ్రామీణ మార్గాల్లో న‌డుస్తున్న పాత డీజిల్ ఇంజిన్‌ల‌కు బ‌దులుగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ప్ర‌త్యామ్నాయ ఇంధ‌నంతో న‌డిచే అధునాత‌న ఇంజిన్‌ల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. ఈ క్ర‌మంలో మ‌రో 35 హైడ్రోజ‌న్ రైళ్ల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్ట‌నున్నామ‌ని భార‌తీయ రైల్వే ఇప్ప‌టికే తెలియ‌జేసింది.

2,600 మంది ప్ర‌యాణించేలా 10 కోచ్‌లు..

కొత్త‌గా ప్రారంభం అవుతున్న హైడ్రోజ‌న్ ఆధారిత రైలులో అనేక స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. ఇందులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. హైడ్రోజ‌న్‌లో న‌డిచే DEMU ట్రెయిన్‌గా ఇది ప‌నిచేస్తుంది. ఇందులో మొత్తం 682 సీట్లు ఉంటాయి. 2,600 మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఈ రైలును అధిక వేగంతో న‌డిపిస్తారు. సాధార‌ణ రోజుల్లో దీన్ని గంట‌కు గ‌రిష్టంగా 75 కిలోమీట‌ర్ల వేగంతో న‌డిపిస్తారు. అయితే ఈ రైలు ఇంకా ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టులో భాగంగానే ఉంద‌ని, అందువ‌ల్ల దీన్ని మ‌రింత నియంత్రిత విధానంలోనే న‌డిపిస్తామ‌ని అధికారులు తెలిపారు.

పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణ హితం..

కాగా హైడ్రోజ‌న్ రైళ్లు ప్ర‌యాణించే స‌మ‌యంలోనే ఒక విద్యుత్ కేంద్రంలా ప‌నిచేస్తాయి. వీటిలో ఉండే హైడ్రోజ‌న్ వాయువును, బాహ్య వాతావ‌ర‌ణం నుంచి ల‌భించే ఆక్సిజ‌న్‌ను ఫ్యుయ‌ల్ సెల్‌లో మిశ్ర‌మం అయ్యేలా చేస్తారు. ఈ ర‌సాయ‌న చ‌ర్య వ‌ల్ల విద్యుత్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది రైలులోని ఎల‌క్ట్రిక్ మోటార్ల‌కు శ‌క్తిని ఇస్తుంది. దీంతో రైలు ప్ర‌యాణిస్తుంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో ఎలాంటి పొగ విడుద‌ల కాదు. కేవ‌లం నీటి ఆవిరి, ఉష్ణం మాత్ర‌మే ఉత్ప‌త్తి అవుతాయి. ఇక హైడ్రోజ‌న్ రైళ్ల వ‌ల్ల క‌ర్బ‌న ఉద్గారాలను గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌వ‌చ్చు. ఈ అంశాన్నే ప్ర‌ధాన ల‌క్ష్యంగా చేసుకుని కేంద్రంహైడ్రోజ‌న్ రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ముఖ్యంగా ఓవ‌ర్‌హెడ్ విద్యుత్ లైన్ల‌ను ఏర్పాటు చేయ‌డం క‌ష్టంగా లేదా అత్యంత ఖ‌రీదైన‌విగా ఉండే మార్గాల్లో డీజిల్ ఇంజిన్ల‌తో న‌డిచే రైళ్ల‌కు బ‌దులుగా ఈ హైడ్రోజ‌న్ రైళ్లు ఎంతో దోహ‌ద ప‌డ‌తాయి. దీంతో ప‌ర్యావర‌ణానికి జ‌రిగే న‌ష్టాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌వ‌చ్చు. హైడ్రోజ‌న్ రైళ్ల‌కు భారీ మౌలిక స‌దుపాయాల అవ‌స‌రం ఉండ‌దు. ఎల‌క్ట్రిక్ రైళ్ల మాదిరిగానే ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అలాగే డీజిల్ రైళ్ల త‌ర‌హాలోనే వీటికి కూడా కేవ‌లం కొన్ని నిమిషాల్లోనే ఇంధ‌నాన్ని నింపి న‌డిపించ‌వ‌చ్చు. అయితే హైడ్రోజ‌న్ రైలు ప్రారంభం అయ్యాక దాని పనితీరు, ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి కేంద్రం మ‌రిన్ని రైళ్లు ప్ర‌వేశపెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement