త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌రుస‌గా రెండో సెష‌న్‌లోనూ స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాలు.. తీవ్ర అస్థిరత‌తో సూచీలు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. మంగళవారం నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ కావ‌డంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ తీవ్ర అస్థిర‌త‌తో కొన‌సాగాయి. చివ‌ర‌కు సుమారు 0.3 శాతం చొప్పున పడిపోయాయి.

S

Business | Published On Jun 30, 2026, 4.06 pm IST

Stock Markets | వ‌రుస‌గా రెండో సెష‌న్‌లోనూ స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాలు.. తీవ్ర అస్థిరత‌తో సూచీలు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. మంగళవారం నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ కావ‌డంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ తీవ్ర అస్థిర‌త‌తో కొన‌సాగాయి. చివ‌ర‌కు సుమారు 0.3 శాతం చొప్పున పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్లు కోల్పోయి 76,479 వద్ద ముగియగా, నిఫ్టీ 50 సూచీ 80కి పైగా పాయింట్లు తగ్గి 23,866 వద్ద స్థిర‌ప‌డింది. ఇక మార్కెట్‌లో అస్థిరతను సూచించే ఇండియా విక్స్ స్వల్పంగా తగ్గి 13.48 వద్ద నిలిచింది. మార్కెట్‌లో అత్యధిక లాభాలను మారుతి సుజుకి షేర్ నమోదు చేసింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ రేటింగ్‌ను బై గా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు టార్గెట్ ధరను రూ.13,800 నుంచి రూ.16,500కు పెంచాయి. పలు అనుకూల అంశాలు కంపెనీకి మద్దతుగా ఉన్నాయని పేర్కొనడంతో మారుతి సుజుకి షేర్ 5 శాతానికి పైగా ఎగిసింది. టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ షేర్లు కూడా 2 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి.

ఐటీ షేర్ల‌పై భారీ ఒత్తిడి..

ఇక‌ ఐటీ రంగ షేర్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు 3 శాతం వరకు పడిపోయి సెన్సెక్స్‌లో అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కొనసాగుతుండటంతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది కనీసం మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రధాన సూచీలు బలహీనంగా ముగిసినప్పటికీ విస్తృత మార్కెట్ మాత్రం మంచి ప్రదర్శన చేసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1 శాతానికి పైగా ఎగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ సుమారు 0.4 శాతం పెరిగింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 3 శాతం పడిపోగా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో 1,919 షేర్లు లాభాల్లో ముగియగా, 1,383 షేర్లు నష్టపోయాయి. మరో 109 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

కాగా పశ్చిమ ఆసియాలో చోటు చేసుకుంటున్న యుద్ధ ప‌రిణామాల నేప‌థ్యంలో చ‌మురు ధ‌ర‌ల‌కు మ‌ళ్లీ రెక్క‌లు వ‌చ్చాయి. వ‌రుస‌గా మూడో సెష‌న్‌లో చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.02 శాతం మేర ఎగ‌బాకి బ్యారెల్‌కు 73 డాల‌ర్ల వ‌ద్ద నిలిచింది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.07 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 70 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 94.66 వ‌ద్ద ఉన్న భార‌త రూపాయి ఇవాళ్టి సెష‌న్‌లో 0.14 శాతం న‌ష్ట‌పోయింది. అయితే ప‌శ్చిమ ఆసియాలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తోపాటు భార‌త రూపాయి విలువ త‌గ్గిపోతుండ‌డం, చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతుండ‌డం పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న పెంచుతాయి. దీంతో తీవ్ర అమ్మ‌కాల ఒత్తిడి క‌నిపిస్తోంది. అయితే ఈ నెల‌లో సూచీలు ఏ దిశ‌లో క‌దులుతాయ‌న్న విష‌యం ఉత్కంఠ‌గా మారింది.

Advertisement
Advertisement