త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ పతనం తర్వాత కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లకు ఊపు..

Stock Markets | గత ట్రేడింగ్ సెషన్‌లో నమోదైన భారీ పతనం తర్వాత దేశీయ‌ స్టాక్ మార్కెట్లు సోమవారం పుంజుకున్నాయి. పెట్టుబడిదారుల కొనుగోళ్లతో ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు పెరిగి 75,203 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు ఎగిసి 23,654 వద్ద కొనసాగింది.

S

Business | Published On Jun 1, 2026, 11.07 am IST

Stock Markets | భారీ పతనం తర్వాత కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లకు ఊపు..
Advertisement

Stock Markets | గత ట్రేడింగ్ సెషన్‌లో నమోదైన భారీ పతనం తర్వాత దేశీయ‌ స్టాక్ మార్కెట్లు సోమవారం పుంజుకున్నాయి. పెట్టుబడిదారుల కొనుగోళ్లతో ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 427 పాయింట్లు పెరిగి 75,203 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు ఎగిసి 23,654 వద్ద కొనసాగింది. మార్కెట్‌లో అస్థిరతను సూచించే ఇండియా విక్స్ (India VIX) 3 శాతానికి పైగా తగ్గి 15.64 వద్దకు చేరుకోవడం పెట్టుబడిదారుల్లో కొంత నమ్మకాన్ని పెంచింది. సెన్సెక్స్‌లో ఇండిగో షేర్లు అత్యధిక లాభాల‌ను నమోదు చేశాయి. కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాల అనంతరం షేర్‌ 4.5 శాతానికి పైగా ఎగిసింది. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు సుమారు 1 శాతం మేర నష్టపోయాయి.

ఉద్రిక్త‌త‌లు ఉన్నా..

విస్తృత మార్కెట్ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.5 శాతానికి పైగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.8 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ సూచీ 2 శాతానికి పైగా ఎగిసి ముందంజలో నిలిచింది. అయితే ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలు స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్ నిపుణుడు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్‌కు ప్రస్తుతం పెద్ద ప్రతికూల సంకేతాలు లేవన్నారు. ఇటీవల మధ్యతరహా, చిన్నతరహా కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి రావడంతో వాటి షేర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయని తెలిపారు. గత శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ 1.5 శాతం క్షీణించడం ఎంఎస్‌సీఐ రీబ్యాలెన్సింగ్ కారణంగా వచ్చిన విదేశీ నిధుల ఉపసంహరణ ప్రభావమేనని, దానిని దీర్ఘకాలిక ధోరణిగా చూడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 5న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష, ద్రవ్యోల్బణం, వృద్ధిపై కేంద్ర బ్యాంకు వ్యాఖ్యలు ఈ వారం మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 94.97 వద్ద ప్రారంభమైంది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల దిగుమతి వ్యయాలపై ఆందోళనలు తగ్గి రూపాయికి మద్దతు లభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) మాత్రం విక్రయాల ఒత్తిడిని కొనసాగిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే రూ.21,105.86 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. మే నెలలో ఇది అత్యధిక ఒక్కరోజు నికర విక్రయంగా నమోదైంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధ‌ర గ‌త వారం రోజుల నుంచి త‌గ్గిన‌ప్ప‌టికీ సోమ‌వారం మాత్రం భారీగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.93 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 92.8 డాల‌ర్ల వద్ద ఉండగా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 2.31 శాతం పెరిగి 88 డాల‌ర్ల వ‌ద్ద ఉంది.

Advertisement
Advertisement