త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మ‌ళ్లీ జోష్‌.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..

Stock Markets | గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఏడు సెషన్ల నష్టాలకు తెరదించిన మార్కెట్లకు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, రాత్రికి రాత్రి వాల్ స్ట్రీట్ మార్కెట్లు పుంజుకోవడం ఊతమిచ్చాయి. దీంతో అంతర్జాతీయంగా రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడింది.

S

Business | Published On Aug 20, 2026, 10.12 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మ‌ళ్లీ జోష్‌.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
Advertisement

Stock Markets | గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఏడు సెషన్ల నష్టాలకు తెరదించిన మార్కెట్లకు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, రాత్రికి రాత్రి వాల్ స్ట్రీట్ మార్కెట్లు పుంజుకోవడం ఊతమిచ్చాయి. దీంతో అంతర్జాతీయంగా రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడింది. గ‌త సెష‌న్‌లో 76,909.68 వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం 77,468.45 వద్ద ప్రారంభమై, ఉదయం 9.21 గంటలకు 583.18 పాయింట్లు (0.76 శాతం) లాభంతో 77,492.86 వద్ద ట్రేడయ్యింది. అలాగే మునుపటి సెషన్‌లో 24,078.30 వద్ద ముగిసిన నిఫ్టీ 50 సూచీ 24,225.45 వద్ద ప్రారంభమై 120.10 పాయింట్లు (0.50 శాతం) పెరిగి 24,198.40 వద్ద కొనసాగింది. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌లను ఒక్కో ఆపరేషన్‌కు కనీసం 4 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడంతో బాండ్ మార్కెట్ ఒత్తిడి కొంత తగ్గింది. దీంతో 10 ఏళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్ 4.65 శాతానికి దిగివచ్చింది. అలాగే అమెరికా డాలర్ ఇండెక్స్ 1 శాతానికి పైగా పడిపోయి 99 మార్క్ కంటే దిగువకు చేరింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ను పెంచాయి.

ఐటీ షేర్ల ర్యాలీ..

నిఫ్టీ 50లో లాభపడిన షేర్లలో శ్రీరామ్ ఫైనాన్స్ ముందంజలో ఉంది. ఈ షేరు 1.77 శాతం పెరిగి రూ.1,125.60కి చేరింది. గత ముగింపు రూ.1,106తో పోలిస్తే 2,44,792 షేర్లు చేతులు మారగా, వాటి విలువ రూ.2,749.87 లక్షలుగా ఉంది. ఎటర్నల్ 1.45 శాతం లాభపడి రూ.324.65కు చేరింది. ఇందులో 20,80,904 షేర్లు ట్రేడవగా, వాటి విలువ రూ.6,737.76 లక్షలుగా ఉంది. బజాజ్ ఫైనాన్స్ 1.38 శాతం పెరిగి రూ.1,095.10కు చేరింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.35 శాతం, ఇన్ఫోసిస్ 1.29 శాతం లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌లో 7,42,664 షేర్లు చేతులు మారగా, వాటి విలువ రూ.8,459.69 లక్షలుగా నమోదైంది. మరోవైపు నిఫ్టీలో నష్టపోయిన షేర్లలో హిందాల్కో ముందుంది. ఈ షేరు 0.59 శాతం తగ్గి రూ.1,032.85కు చేరింది. ఓఎన్‌జీసీ 0.52 శాతం తగ్గి రూ.236.77కు, కోల్ ఇండియా 0.44 శాతం తగ్గి రూ.398.25కు చేరాయి. మ్యాక్స్ హెల్త్‌కేర్ 0.42 శాతం తగ్గి రూ.992.80 వద్ద, ఎన్టీపీసీ 0.25 శాతం తగ్గి రూ.335.70 వద్ద ట్రేడయ్యాయి.

స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

రంగాల వారీగా చూస్తే ఈ సెషన్‌లో ఐటీ రంగం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. అలాగే డిఫెన్స్ ఇండెక్స్ అత్యధికంగా 1.60 శాతం నష్టపోయింది. ఎనర్జీ సూచీలు కూడా మునుపటి సెషన్‌తో పోలిస్తే 1.20 శాతం తగ్గాయి. గురువారం ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ దాదాపు 5 శాతం దూసుకెళ్లగా, జపాన్ నిక్కీ 225 సూచీ 1.45 శాతం పెరిగింది. దీంతో ప్రాంతీయ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడిన సంకేతాలు కనిపించాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు గురువారం స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.21 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 89 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.32 శాతం పెరిగి బ్యారెల్‌కు 85 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి కాస్త బ‌ల‌ప‌డింది. వ‌రుస సెష‌న్‌ల‌లో న‌ష్ట‌పోతూ వ‌చ్చిన రూపాయి అమెరికా డాల‌ర్‌కు 95.63 వ‌ద్ద నిల‌వ‌గా, సెషన్‌లో 12 పైస‌లు లాభ‌ప‌డింది.

Advertisement
Advertisement