త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్ధానికి బ్రేక్‌.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock Markets | మ‌ధ్య‌ప్రాచ్యంలో జ‌రుగుతున్న యుద్దాన్ని రెండు వారాల పాటు తాత్కాలిక ఆపేందుకు అమెరికా, ఇరాన్ సంయుక్తంగా అంగీక‌రించ‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఫుల్ జోష్ క‌నిపించింది. ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ‌వుతుండ‌గా, దేశీయ మార్కెట్లు సైతం భారీగా పైకి ఎగ‌బాకాయి.

S

Business | Published On Apr 8, 2026, 9.52 am IST

Stock Markets | యుద్ధానికి బ్రేక్‌.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | మ‌ధ్య‌ప్రాచ్యంలో జ‌రుగుతున్న యుద్దాన్ని రెండు వారాల పాటు తాత్కాలిక ఆపేందుకు అమెరికా, ఇరాన్ సంయుక్తంగా అంగీక‌రించ‌డంతో అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఫుల్ జోష్ క‌నిపించింది. ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ‌వుతుండ‌గా, దేశీయ మార్కెట్లు సైతం భారీగా పైకి ఎగ‌బాకాయి. నిఫ్టీ50 సూచీ 731.50 పాయింట్ల (3.2 శాతం) గ్యాప్ అప్‌తో ప్రారంభ‌మై ప్ర‌స్తుతం 23,880 వ‌ద్ద ట్రేడ్ అవుతుండ‌గా, సెన్సెక్స్ 2674.05 పాయింట్ల (3.58 శాతం) గ్యాప్ అప్‌తో ప్రారంభ‌మై ప్ర‌స్తుతం 77,200 వద్ద కొన‌సాగుతోంది. యుద్ధానికి బ్రేక్ ఇవ్వడంతోపాటు రెండు వారాల పాటు కాల్పుల విర‌మ‌ణ కూడా ప్ర‌క‌టించ‌డంతో చ‌మురు ధ‌ర‌లు సైతం భారీగా ప‌త‌నం అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 10 డాల‌ర్లు త‌గ్గి 92.42 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 11 డాలర్ల మేర ప‌త‌నం అయి 89.87 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే బుధ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా పెరిగింది. 28 పైస‌లు లాభ‌ప‌డ్డ రూపాయి డాల‌ర్‌తో పోలిస్తే 92.55 వ‌ద్ద ట్రేడ‌వుతోంది.

3 శాతానికి పైగా పెరిగిన ఆసియా మార్కెట్లు..

బుధ‌వారం ఉద‌యం ఆసియా మార్కెట్లు కూడా భారీ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యాయి. త‌రువాత కూడా ర్యాలీని కొన‌సాగించాయి, జ‌పాన్ నిక్కీ225 సూచీ ఏకంగా 5.28 శాతం మేర పెరిగి 2,822 పాయింట్ల లాభంలో కొన‌సాగుతుండ‌గా, ద‌క్షిణ కొరియా కోస్పి 5.61 శాతం పెరిగింది. భార‌త విదేశీ ఈక్విటీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ 3 శాతానికి పైగా ఎగ‌బాకి 23,841 మార్కును అందుకుంది. హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 3.04 శాతం పెర‌గ్గా, తైవాన్ వెయిటెడ్ ఇండెక్స్ 3.72 శాతం మేర లాభ‌ప‌డింది. ఇక బులియ‌న్ మార్కెట్ల‌లోనూ ప‌రుగు క‌నిపించింది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 90 డాల‌ర్లు పెరిగి 4,795 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, వెండి ధ‌ర 3.4 డాల‌ర్లు పెరిగి 76 డాల‌ర్ల వ‌ద్ద కొన‌సాగుతోంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,111 పాయింట్లు (2.07 శాతం) పెరిగి 1,53,400 వ‌ద్ద కొన‌సాగుతోంది. సిల్వ‌ర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 11,888 పాయింట్లు (5.14 శాతం) పెరిగి 2,43,236 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది.

14 రోజుల త‌రువాత సంగ‌తేంటి..?

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌ల ఇరాన్‌కు విధించిన డెడ్ లైన్ ముగియ‌డంతో అమెరికా, ఇజ్రాయెల్ ద‌ళాలు యుద్ధాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేశాయి. 48 గంట‌ల ముందు ట్రంప్ కూడా ఇరాన్‌కు చివరిసారిగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. హోర్ముజ్ జ‌ల‌సంధిని తెర‌వ‌క‌పోతే ఇరాన్ కు అదే రోజు ఆఖ‌రిది అవుతుంద‌ని, ఇరాన్ నాగ‌రిక‌త మ‌ట్టుబెట్టుకుపోతుంద‌ని, చ‌రిత్ర‌లో మిగ‌ల‌ద‌ని హెచ్చ‌రించారు. ఇరాన్‌ను ఒక్క రోజులోనే నేల‌మ‌ట్టం చేస్తామ‌ని అన్నారు. అయితే ఇరాన్ ప‌ట్టించుకోలేదు. కానీ గ‌త 24 గంట‌ల్లో ప‌రిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. దూత‌ల ద్వారా రాయ‌బారం న‌డిపిన అమెరికా, ఇరాన్‌లు ఎట్ట‌కేల‌కు 14 రోజుల పాటు యుద్ధాన్ని ఆపేందుకు, కాల్పుల విర‌మ‌ణ పాటించేందుకు అంగీక‌రించాయి. దీంతో మార్కెట్ల‌కు భారీ పాజిటివ్ న్యూస్ వ‌చ్చింది. పెట్టుబడిదారులు మ‌ళ్లీ పెట్టుబ‌డులను కొన‌సాగించేందుకు పెద్ద ఎత్తున ఆస‌క్తి చూపించారు. అయితే 14 రోజుల త‌రువాత ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తారా, లేక కొన‌సాగిస్తారా అన్న విష‌యం రానున్న రోజుల్లో తేల‌నుంది.

Advertisement
Advertisement