త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | యుద్ధం ముగియ‌బోతుంద‌ని సంకేతాలు.. భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్న స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్ల‌లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ ఎత్తున‌ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో వచ్చిన సానుకూల ధోరణిని అనుసరించి సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు దాదాపు 3 శాతం చొప్పున పైకి ఎగ‌బాకాయి. సెన్సెక్స్ 2,000 పాయింట్లు (2.8 శాతం) పెరిగి 73,965 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.

S

Business | Published On Apr 1, 2026, 10.39 am IST

Stock Markets | యుద్ధం ముగియ‌బోతుంద‌ని సంకేతాలు.. భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్న స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ‌ స్టాక్ మార్కెట్ల‌లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ ఎత్తున‌ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో వచ్చిన సానుకూల ధోరణిని అనుసరించి సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు దాదాపు 3 శాతం చొప్పున పైకి ఎగ‌బాకాయి. సెన్సెక్స్ 2,000 పాయింట్లు (2.8 శాతం) పెరిగి 73,965 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 50 కూడా 600 పాయింట్లు (2.7 శాతం) పెరిగి 22,941 వద్ద ట్రేడ్ అవుతోంది. BSEలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 4 శాతం వరకు పెరిగాయి. ఈ పెరుగుదలతో పెట్టుబడిదారులు సుమారు రూ.13 లక్షల కోట్లు సంపాదించారు. BSEలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412 లక్షల కోట్ల నుంచి రూ.425 లక్షల కోట్లకు పెరిగింది.

2, 3 వారాల్లో యుద్ధం ముగింపు..

పశ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందనే సంకేతాలు మార్కెట్‌కు ఊరట కలిగించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌పై సైనిక చర్యలను ముగించే అవకాశం ఉంద‌ని చెప్పారు. యుద్ధం ముగించడానికి ఇరాన్‌తో ఒప్పందం అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగి గ్లోబల్ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆందోళనల‌ను పెంచాయి. జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యూహకర్త వి.కె.విజయకుమార్ మాట్లాడుతూ ఇరాన్ అధికారుల ప్రకటనల ద్వారా యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయ‌ని తెలిపారు. మార్కెట్ ముందుగానే ఈ పరిణామాలను పరిగణన‌లోకి తీసుకుంటోంద‌ని అన్నారు.

ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే..

ప్రపంచ మార్కెట్లలో వచ్చిన పాజిటివ్ సెంటిమెంట్ దేశీయ మార్కెట్ల‌ను ప్రభావితం చేసింది. దక్షిణ కొరియా కోస్పి సూచీ 7 శాతం కన్నా ఎక్కువగా పెరిగి ర్యాలీ కొన‌సాగిస్తోంది. జపాన్ నిక్కీ, తైవాన్ మార్కెట్లు కూడా 4 శాతం చొప్పున‌ పెరిగాయి. అమెరికాలో క్రితం సెష‌న్ ముగింపులో నాస్‌డాక్ 4 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 3 శాతం పెరగడం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 100 కంటే దిగువకు పడిపోయింది. 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్స్‌ 4.293 శాతానికి తగ్గాయి. డాలర్, బాండ్ ఈల్డ్స్‌ తగ్గడం వల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల‌ మార్కెట్లకు విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

మార్చిలో నిఫ్టీ 50 దాదాపు 11.3 శాతం పడిపోయింది. వరుసగా నాలుగు నెలల నష్టాల తర్వాత, అనేక బ్లూచిప్ స్టాక్స్ ఆకర్షణీయమైన ధరలకు చేరాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గే సూచనలతో పెట్టుబడిదారులు ఇప్పుడు విలువ ఆధారిత కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మార్కెట్ పెరుగుదల నుంచి లాభాలు పొందాలని చూస్తున్నారు.

Advertisement
Advertisement