త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో మొద‌లైన అమ్మ‌కాల ఒత్తిడి..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం స్వ‌ల్ప లాభాల్లో ముగిశాయి. ఉద‌యం సెష‌న్‌లో భారీ ర్యాలీ కొన‌సాగినా ఆ త‌రువాత పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ప్రారంభంలో వ‌చ్చిన లాభాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయాయి. ఇంట్రా డే క‌నిష్టానికి కాస్త ఎగువ‌న స్థిర‌ప‌డ్డాయి.

S

Business | Published On Jul 15, 2026, 3.51 pm IST

Stock Markets | స్వ‌ల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబ‌డిదారుల్లో మొద‌లైన అమ్మ‌కాల ఒత్తిడి..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం స్వ‌ల్ప లాభాల్లో ముగిశాయి. ఉద‌యం సెష‌న్‌లో భారీ ర్యాలీ కొన‌సాగినా ఆ త‌రువాత పెట్టుబ‌డిదారులు లాభాల స్వీక‌ర‌ణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ప్రారంభంలో వ‌చ్చిన లాభాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయాయి. ఇంట్రా డే క‌నిష్టానికి కాస్త ఎగువ‌న స్థిర‌ప‌డ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 130.49 పాయింట్లు (0.17 శాతం) లాభ‌ప‌డి 77,185.43 వ‌ద్ద ముగియ‌గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 26.45 (0.11 శాతం) లాభంతో 24,078.50 వ‌ద్ద స్థిర‌ప‌డింది. విస్తృత మార్కెట్ సూచీలు సైతం లాభాల‌ను న‌మోదు చేశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు 0.25 శాతం క‌న్నా ఎక్కువ‌గా లాభ‌ప‌డ్డాయి. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య ముదురుతున్న యుద్ధ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌తోపాటు చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న క‌లిగించింది. దీంతో వారు లాభాల స్వీక‌ర‌ణ వైపు మ‌ళ్లారు.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు, ప‌త‌న‌మైన రూపాయి విలువ‌..

నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 0.28 శాతం వ‌ర‌కు లాభ‌ప‌డగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 0.67 శాతం పెరిగింది. బుధ‌వారం చోటు చేసుకున్న స్వ‌ల్ప లాభాల‌తో బీఎస్ఈలో న‌మోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిట‌ల్ కూడా స్వ‌ల్పంగానే పెరిగింది. గ‌త సెష‌న్‌లో ఇది రూ.479.5 ల‌క్ష‌ల కోట్లు ఉండ‌గా, ఈ సెష‌న్‌లో రూ.1.50 ల‌క్ష‌ల కోట్లు పెరిగి రూ.481 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డం కూడా పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న క‌లిగించింది. అమెరికా సైన్యం తాజాగా ఇరాన్‌పై వ‌రుస‌గా నాలుగో రోజు కూడా దాడులు చేప‌ట్ట‌డం, హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు పెర‌గ‌డంతో చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.23 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 84 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.43 శాతం పెరిగి బ్యారెల్‌కు 80 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 6 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి 96.25 వ‌ద్ద నిలిచింది.

పెట్టుబ‌డిదారుల్లో త‌గ్గుతున్న విశ్వాసం..

అమెరికా ద్ర‌వ్యోల్బ‌ణ గ‌ణాంకాలు అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేశాయి. అమెరికా ఫెడ్ ఈ ఏడాది ఊహించిన దాని క‌న్నా ఎక్కువ‌గానే రేట్ల‌ను పెంచ‌బోతుంద‌ని ఊహాగానాలు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో డాల‌ర్ బ‌ల‌ప‌డింది. స‌హ‌జంగానే బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. అలాగే ఆహార ద్రవ్యోల్బ‌ణం కూడా 2.6 శాతం మేర పెరిగి ఇంకా పై స్థాయికి చేరే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌న్న వార్త‌లు కూడా ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళ‌న‌ల‌ను నింపాయి. ఇక అమెరికా జూన్ సీపీఐ డేటా ప్ర‌కారం ఆసియా మార్కెట్‌ల‌లోని ప్ర‌ధాన సూచీల్లో ఒక‌టైన ద‌క్షిణ కొరియా కోస్పి 8 శాతం పెర‌గ్గా, జ‌పాన్ నిక్కీ 225, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. అయిన‌ప్ప‌టికీ ప‌శ్చిమ ఆసియాలో మ‌ళ్లీ నెల‌కొన్న యుద్ధ ప‌రిస్థితుల కార‌ణంగా పెట్టుబ‌డిదారుల్లో ఆత్మ విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌ని, సెంటిమెంట్ బ‌ల‌హీన ప‌డితే సూచీలు ఇంకా దిగువ‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement