త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..

Stock Markets | అమెరికా తాజాగా ఇరాన్‌పై జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఆందోళన ప్రభావం సోమవారం భారత ఈక్విటీ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ముడిచమురు ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించగా, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ప్రారంభం నుంచే భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి.

S

Business | Published On Jul 13, 2026, 10.15 am IST

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | అమెరికా తాజాగా ఇరాన్‌పై జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఆందోళన ప్రభావం సోమవారం భారత ఈక్విటీ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ముడిచమురు ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించగా, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ప్రారంభం నుంచే భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి. శుక్రవారం 77,569.39 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 76,963.35 వద్ద ప్రారంభమై, ఉదయం ప్రారంభంలో 76,920.34 వద్ద ట్రేడైంది. ఇది 649.05 పాయింట్లు (0.84 శాతం) క్షీణించింది. అలాగే గత సెషన్‌లో 24,206.90 వద్ద ముగిసిన నిఫ్టీ 50, 24,039.40 వద్ద ప్రారంభమై 24,022.40 వద్ద కొనసాగుతూ 184.50 పాయింట్లు (0.76 శాతం) నష్టపోయింది. మార్కెట్ మొత్తం ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఐటీ షేర్లు మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. టీసీఎస్ 1.69 శాతం పెరిగి రూ.2,104 వద్ద ట్రేడవగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.22 శాతం లాభంతో రూ.1,178.30కు చేరుకుంది. టెక్ మహీంద్రా కూడా 0.41 శాతం పెరిగి రూ.1,460.70 వద్ద ట్రేడైంది.

నిల‌క‌డ‌గా కొనసాగుతుందా..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) చిప్ స్టాక్స్‌లోని అధిక కేంద్రీకరణ ప్రమాదాన్ని తగ్గిస్తూ, స్థిరమైన వృద్ధి అవకాశాలు ఉన్న మార్కెట్లవైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారని తెలిపారు. ఈ ధోరణి కొనసాగితే భారత మార్కెట్ నిలకడగానే ఉండే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. హెల్త్‌కేర్ రంగంలో అపోలో హాస్పిటల్స్ 0.83 శాతం లాభంతో రూ.8,914 వద్ద ట్రేడైంది. ఇంధన రంగంలో ఓఎన్‌జీసీ 0.42 శాతం పెరిగి రూ.246 వద్ద కొనసాగింది. అలాగే విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ముడిచమురు ధరల పెరుగుదలతో విమాన ఇంధన వ్యయాలు అధికమవుతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఇండిగో షేరు 2.70 శాతం పడిపోయి రూ.5,168.50కు చేరుకుంది. టాటా స్టీల్ 2.10 శాతం క్షీణించి రూ.187.18 వద్ద ట్రేడైంది. ఆటో రంగంలో మారుతి సుజుకి 1.70 శాతం, శ్రీరామ్ ఫైనాన్స్ 1.59 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.57 శాతం చొప్పున నష్టపోయాయి.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

ఇక బ్రెంట్ క్రూడ్ ధరలు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్‌కు 78 డాలర్ల శ్రేణికి చేరుకున్నాయి. ముడిచమురు ధరలు దీర్ఘకాలం అధిక స్థాయిలో కొనసాగితే భారత దిగుమతి వ్యయం పెరిగి, ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాగా గ‌త సెష‌న్ ముగింపుతో పోలిస్తే బ్రెంట్ క్రూడ్ ధర 3.92 శాతం మేర ఎగ‌బాక‌గా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 3.88 శాతం మేర ఎగ‌సి బ్యారెల్‌కు 74 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో మ‌రోమారు భార‌త రూపాయి విలువ ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.74 వ‌ద్ద ఉన్న రూపాయి సోమ‌వారం సెష‌న్‌లో 37 పైస‌లు త‌గ్గింది.

Advertisement
Advertisement