త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | టీసీఎస్ ఫలితాల జోష్.. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం లాభాల‌తో ప్రారంభం అయ్యాయి. ప‌శ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్త‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు కొనుగోళ్ల ప‌ట్ల ఉత్సాహం చూపిస్తున్నారు. గ్లోబ‌ల్ మార్కెట్ల నుంచి వ‌చ్చిన పాజిటివ్ సంకేతాల‌కు తోడు టీసీఎస్ జూన్ త్రైమాసిక ఫ‌లితాల ప్ర‌భావంతో పెట్టుబ‌డిదారుల్లో ఆశావ‌హ దృక్ప‌థం నెలకొంది.

S

Business | Published On Jul 10, 2026, 9.48 am IST

Stock Markets | టీసీఎస్ ఫలితాల జోష్.. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం లాభాల‌తో ప్రారంభం అయ్యాయి. ప‌శ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్త‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు కొనుగోళ్ల ప‌ట్ల ఉత్సాహం చూపిస్తున్నారు. గ్లోబ‌ల్ మార్కెట్ల నుంచి వ‌చ్చిన పాజిటివ్ సంకేతాల‌కు తోడు టీసీఎస్ జూన్ త్రైమాసిక ఫ‌లితాల ప్ర‌భావంతో పెట్టుబ‌డిదారుల్లో ఆశావ‌హ దృక్ప‌థం నెలకొంది. దీంతో విలువ ఆధారిత షేర్ల‌లో కొనుగోళ్లు క‌నిపించాయి. ముఖ్యంగా ఐటీ షేర్ల‌లో బ‌ల‌మైన ర్యాలీ వ‌చ్చింది. దీంతో మార్కెట్లు ప్రారంభం నుంచే గ్యాప్ అప్‌తో మొద‌ల‌య్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 652.79 పాయింట్లు (0.85 శాతం) పెరిగి 77,394.61 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 175.95 పాయింట్లు (0.73 శాతం) లాభపడి 24,138.75 వద్ద కొనసాగింది.

టీసీఎస్ ఫ‌లితాల‌తో జోరు..

ఈ ర్యాలీ విస్తృతంగా అన్ని రంగాలకు విస్తరించింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ షేర్లు మార్కెట్‌కు ప్రధాన బలం అందించాయి. అదే సమయంలో ఇండియా విక్స్ దాదాపు 4 శాతం తగ్గడంతో మార్కెట్లో అస్థిరత కూడా తగ్గినట్లు కనిపించింది. జూన్ త్రైమాసిక ఫలితాలతో టీసీఎస్ అంచనాలకు మించిన పనితీరును నమోదు చేయడంతోపాటు కంపెనీ యాజమాన్యం ఇచ్చిన సానుకూల వ్యాఖ్యలు ఐటీ రంగానికి ఊతమిచ్చాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 3.18 శాతం ఎగబాకి అత్యుత్తమ ప్రదర్శన చేసిన రంగంగా నిలిచింది. డిమాండ్ మెరుగుపడుతుందనే అంచనాలు, స్థిరమైన డీల్‌లు కొనసాగుతాయనే ఆశావహ భావనతో ఇతర టెక్నాలజీ షేర్లలో కూడా బలమైన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్‌లో టీసీఎస్ 3.71 శాతం, టెక్ మహీంద్రా 3.57 శాతం, ఇన్ఫోసిస్ 3.58 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3.22 శాతం లాభపడి టాప్ గెయినర్లుగా నిలిచాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 0.96 శాతం, నిఫ్టీ మెటల్ 0.91 శాతం, నిఫ్టీ మీడియా 0.86 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 25/50 సూచీ 0.81 శాతం, నిఫ్టీ సిమెంట్ 0.80 శాతం లాభాల్లో ట్రేడయ్యాయి.

యుద్ధాన్ని ప‌ట్టించుకోని పెట్టుబ‌డిదారులు..

అయితే రియాల్టీ, ఫార్మా రంగాల్లో మాత్రం ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ రియాల్టీ సూచీ 0.56 శాతం, నిఫ్టీ ఫార్మా 0.35 శాతం, నిఫ్టీ హెల్త్‌కేర్ 0.25 శాతం నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం రెండు మాత్రమే నష్టాల్లో ట్రేడయ్యాయి. భారతి ఎయిర్‌టెల్ 0.79 శాతం, సన్ ఫార్మా 0.24 శాతం తగ్గాయి. ప్రధాన సూచీలతోపాటు విస్తృత మార్కెట్‌ల‌లో కూడా కొనుగోళ్లు కొనసాగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.78 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.69 శాతం, నిఫ్టీ 500 సూచీ 0.71 శాతం లాభపడింది. మార్కెట్ అస్థిరతకు సూచికగా భావించే ఇండియా విక్స్ 4 శాతం తగ్గి 12.83 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా ఆసియా మార్కెట్లు బలంగా ట్రేడయ్యాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత టెక్నాలజీ కంపెనీల్లో కొనసాగుతున్న ర్యాలీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌కు బలం చేకూర్చింది. పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఇన్వెస్టర్లు కార్పొరేట్ ఫలితాలు, ఏఐ ఆధారిత వృద్ధిపైనే దృష్టి సారించారు.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

జపాన్ నిక్కీ సూచీ సుమారు 1.8 శాతం, దక్షిణ కొరియా కోస్పీ సూచీ దాదాపు 4 శాతం పెరిగాయి. ముఖ్యంగా చిప్ తయారీ సంస్థలు, ఏఐకు సంబంధించిన కంపెనీల షేర్లు ఈ ర్యాలీకి నాయకత్వం వహించాయి. జపాన్ మినహా ఆసియా-పసిఫిక్ ప్రాంతాన్ని సూచించే ఎంఎస్‌సీఐ సూచీ కూడా 1 శాతానికి పైగా లాభపడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగినా, వాల్ స్ట్రీట్‌లో టెక్నాలజీ షేర్ల ర్యాలీ, కార్పొరేట్ ఫలితాలపై ఉన్న ఆశావహ దృక్పథం ప్రాంతీయ మార్కెట్లకు మద్దతునిచ్చింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న యుద్ధం ప్ర‌భావం కార‌ణంగా హోర్ముజ్ జ‌ల‌సంధి గుండా ర‌వాణాకు ఆటంకం క‌లుగుతుందేమోన‌న్న ఆందోళ‌న‌తో కంపెనీలు చ‌మురు ధ‌ర‌లను పెంచాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.43 శాతం మేర ఎగ‌సి బ్యారెల్‌కు 76 డాల‌ర్ల‌కు చేరింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.45 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 72 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 0.08 శాతం మేర పెరిగిన రూపాయి 95.3 వ‌ద్ద ఉంది.

Advertisement
Advertisement