త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్‌ల‌కు భారీ షాక్.. న‌ష్టాల్లో సూచీలు..

Stock Markets | భారత‌ ఈక్విటీ మార్కెట్లు బుధవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతోపాటు మధ్యప్రాచ్యంలో మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు ఎగసిపడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 0.75 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

S

Business | Published On Jul 8, 2026, 10.34 am IST

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్‌ల‌కు భారీ షాక్.. న‌ష్టాల్లో సూచీలు..
Advertisement

Stock Markets | భారత‌ ఈక్విటీ మార్కెట్లు బుధవారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతోపాటు మధ్యప్రాచ్యంలో మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు ఎగసిపడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 0.75 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో కనిపించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 552 పాయింట్లు (0.71 శాతం) పడిపోయి 77,628 వద్ద ట్రేడ్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 177 పాయింట్లు (0.72 శాతం) క్షీణించి 24,222 వద్ద కొనసాగింది. అయితే విస్తృత మార్కెట్లు కొంత స్థిరత్వాన్ని కనబరిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.32 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.20 శాతం తగ్గాయి. మార్కెట్‌లో భయాందోళనలను సూచించే ఇండియా విక్స్ దాదాపు 7 శాతం ఎగసి 12.43కు చేరుకుంది. అమెరికా తాజాగా ఇరాన్‌పై దాడులు చేపట్టిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్‌లో అస్థిరత పెరిగింది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

పశ్చిమాసియాలో తాజా ఘర్షణలు ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలను మళ్లీ పెంచాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్న భయాలు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75 నుంచి 76 డాలర్ల మధ్యకు చేరుకుంది. చమురును అధికంగా దిగుమతి చేసుకునే భారత్‌ వంటి దేశాలపై ఇది అదనపు ఒత్తిడిని పెంచుతోంది. అమెరికా మార్కెట్లు కూడా రాత్రి ట్రేడింగ్‌లో నష్టాలతో ముగిశాయి. శామ్‌సంగ్ ఆర్థిక ఫలితాల అప్‌డేట్, అలాగే డీప్‌సీక్ స్వంత ఏఐ చిప్‌ను అభివృద్ధి చేస్తోందన్న వార్తలతో సెమీకండక్టర్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. టెక్నాలజీ షేర్లు క్షీణించడంతో వాల్‌స్ట్రీట్ సూచీలు కూడా దిగజారాయి. అదే ప్రభావం ఆసియా మార్కెట్లలోనూ కనిపిస్తోంది. అయితే ఓపెక్ ప్లస్ నుంచి తగిన చమురు సరఫరా కొనసాగుతుందన్న అంచనాలు బ్రెంట్ ధరల పెరుగుదలను కొంతవరకు నియంత్రిస్తున్నాయి.

లాభాల్లో ఫార్మా, హెల్త్ కేర్‌, ఐటీ సూచీలు..

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 25 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దేశంలోనే అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2 శాతానికి పైగా పడిపోవడంతో అత్యధిక నష్టపోయిన స్టాక్‌గా నిలిచింది. అలాగే ఇండిగో, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా 2 శాతానికి పైగా క్షీణించాయి. మరోవైపు సన్ ఫార్మా షేరు 1 శాతానికి పైగా లాభపడుతూ టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు కూడా స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా చూస్తే అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.71 శాతం, ఆటో సూచీ 1.35 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 1.18 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 1.06 శాతం చొప్పున పడిపోయాయి. రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా రంగాల సూచీలు కూడా నష్టాల్లో కొనసాగాయి. అయితే రక్షణాత్మక రంగాలుగా భావించే ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ రంగాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. నిఫ్టీ ఫార్మా 0.93 శాతం, హెల్త్‌కేర్ 0.78 శాతం, ఐటీ సూచీ 0.21 శాతం చొప్పున లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

Advertisement
Advertisement