త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LIC | ఎల్‌ఐసీలో భారీ వాటా విక్రయం.. రూ.31 వేల కోట్ల లక్ష్యంతో కేంద్రం ఓఎఫ్‌ఎస్ ప్రారంభం

LIC | దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో కేంద్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)ను ప్రారంభించింది. మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం.. షేరుకు రూ.382 ఫ్లోర్ ప్రైస్‌తో రెండు రోజుల పాటు ఓఎఫ్‌ఎస్ నిర్వహించనున్న‌ట్లు తెలిపింది.

S

Business | Published On Aug 4, 2026, 2.42 pm IST

LIC | ఎల్‌ఐసీలో భారీ వాటా విక్రయం.. రూ.31 వేల కోట్ల లక్ష్యంతో కేంద్రం ఓఎఫ్‌ఎస్ ప్రారంభం
Advertisement

LIC | దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో కేంద్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)ను ప్రారంభించింది. మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం.. షేరుకు రూ.382 ఫ్లోర్ ప్రైస్‌తో రెండు రోజుల పాటు ఓఎఫ్‌ఎస్ నిర్వహించనున్న‌ట్లు తెలిపింది. ఆగస్టు 4న నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రారంభం కాగా, ఆగస్టు 5న రిటైల్ ఇన్వెస్టర్లు బిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఓఎఫ్‌ఎస్ ప్రకటన అనంతరం ఎల్‌ఐసీ షేర్లు మార్కెట్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రారంభ ట్రేడింగ్‌లో షేరు ధర 8.86 శాతం వరకు పడిపోయి రూ.390.50 వద్ద ట్రేడ్ అయింది. ఈ ఓఎఫ్‌ఎస్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే 82.22 కోట్లకు పైగా షేర్ల విక్రయం ద్వారా సుమారు రూ.31వేల కోట్లకు పైగా నిధులు ప్రభుత్వానికి సమకూరనున్నాయి.

10 శాతం డిస్కౌంట్ ధ‌ర‌కు షేర్లు..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎమ్) కార్యదర్శి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో చేసిన పోస్టులో ప్రభుత్వం 2.5 శాతం ఈక్విటీని విక్రయిస్తోందని, అదనంగా 4 శాతం గ్రీన్ షూ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఈ చర్య ద్వారా సెబీ నిర్దేశించిన మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) లక్ష్యాన్ని గడువు కంటే ముందే చేరుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీలో 96.5 శాతం వాటాను కలిగి ఉంది. సెబీ నిబంధనల ప్రకారం కనీసం 10 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ ఉండాలి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సెబీ ఎల్‌ఐసీకి వ‌చ్చ ఏడాది మే 16 వరకు గడువు ఇచ్చింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో నిర్ణయించిన రూ.382 ఫ్లోర్ ప్రైస్, సోమవారం బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ ముగింపు ధర రూ.424.35తో పోలిస్తే సుమారు 10 శాతం డిస్కౌంట్ కాగా అదే రోజు ఎన్‌ఎస్‌ఈలో షేరు రూ.428.50 వద్ద ముగిసింది.

ఫ్లోర్ ప్రైస్‌, ఇష్యూ ప్రైస్ అంటే..

ఓఎఫ్‌ఎస్‌లో ఫ్లోర్ ప్రైస్ అంటే ప్రభుత్వం లేదా ప్రమోటర్ నిర్ణయించే కనిష్ఠ విక్రయ ధర. ఈ ధర కంటే తక్కువకు పెట్టుబడిదారులు బిడ్ చేయలేరు. ఎల్‌ఐసీ విషయంలో అది షేరుకు రూ.382గా నిర్ణయించారు. ఇక బిడ్డింగ్ పూర్తయిన తర్వాత డిమాండ్ ఆధారంగా నిర్ణయించే తుది కేటాయింపు ధరను ఇష్యూ ప్రైస్ లేదా డిస్కవర్డ్ ప్రైస్ అంటారు. ఇది ఫ్లోర్ ప్రైస్ కంటే సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్లోర్ ప్రైస్ కంటే తక్కువగా ఉండదు. రిటైల్ ఇన్వెస్టర్లు కట్ ఆఫ్ ప్రైస్ వద్ద కూడా బిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్వాసెట్ పీఎంఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసాని అభిప్రాయం ప్రకారం ఈ ఓఎఫ్‌ఎస్‌ను యాజమాన్య మార్పుగా కాకుండా లిక్విడిటీ పెంపు, మార్కెట్ విస్తరణ దిశగా తీసుకున్న చర్యగా చూడాల‌ని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికీ భారీ మెజారిటీ వాటాను కొనసాగిస్తూనే, సెబీ నిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను పెంచుతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఫ‌లితాలు ఎప్పుడు..?

ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డు ఆగస్టు 6న సమావేశమై ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1 ఎఫ్‌వై27) అన్‌ఆడిటెడ్ స్టాండ్అలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను ఆమోదించనుంది. ఫలితాల ప్రకటన అనంతరం అదే రోజు సాయంత్రం 7 గంటలకు విశ్లేషకులు, పెట్టుబడిదారులతో ఎర్నింగ్స్ కాల్ నిర్వహించి త్రైమాసిక ఆర్థిక పనితీరుపై వివరాల‌ను వెల్లడించనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement