త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPF | క్లెయిమ్ చేయ‌ని ఎల్ఐసీ, ఈపీఎఫ్ మొత్తాలు.. ఎల్ఐసీ వ‌ద్ద రూ.16వేల కోట్లు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌..

EPF | ఉద్యోగం మారిన తర్వాత పాత ఈపీఎఫ్ (EPF) ఖాతాను పట్టించుకోకపోవడం, లేదా గతంలో తీసుకున్న ఎల్ఐసీ (LIC) పాలసీ గురించి మరిచిపోవడం జరిగి ఉంటే, ఇప్పుడు ఒకసారి మీ రికార్డులు పరిశీలించడం మంచిదని కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలతో సూచిస్తోంది.

S

Business | Published On Jul 21, 2026, 1.39 pm IST

EPF | క్లెయిమ్ చేయ‌ని ఎల్ఐసీ, ఈపీఎఫ్ మొత్తాలు.. ఎల్ఐసీ వ‌ద్ద రూ.16వేల కోట్లు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌..
Advertisement

EPF | ఉద్యోగం మారిన తర్వాత పాత ఈపీఎఫ్ (EPF) ఖాతాను పట్టించుకోకపోవడం, లేదా గతంలో తీసుకున్న ఎల్ఐసీ (LIC) పాలసీ గురించి మరిచిపోవడం జరిగి ఉంటే, ఇప్పుడు ఒకసారి మీ రికార్డులు పరిశీలించడం మంచిదని కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలతో సూచిస్తోంది. దేశంలో మొత్తం రూ.16,649.06 కోట్లు ఎల్ఐసీ వద్ద క్లెయిమ్ చేయని పాలసీ మొత్తాలుగా లేదా ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. వేలాది మంది పాలసీదారులు, ఈపీఎఫ్ సభ్యులు తమకు రావాల్సిన మొత్తాలను ఇప్పటికీ క్లెయిమ్ చేయలేదని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభలో స‌భ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎల్ఐసీ పాలసీదారుల ఖాతాల్లో రూ.7,318.50 కోట్లు క్లెయిమ్ చేయ‌ని మొత్తం ఉండగా, ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.9,330.56 కోట్లు ఉన్న‌ట్లు తెలిపారు.

క్లెయిమ్ చేయ‌ని మొత్తాన్ని తెలుసుకోవ‌చ్చు..

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం క్లెయిమ్ చేయని ఈపీఎఫ్ ఖాతాలు అనే వర్గీకరణ లేదని, అయితే కొన్ని ఖాతాలను ఇనాపరేటివ్ అకౌంట్లుగా గుర్తించారని మంత్రి వివరించారు. మార్చి 31 నాటికి అలాంటి ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో మొత్తం రూ.9,330.56 కోట్లు ఉన్నట్లు తెలిపారు. కాగా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పాలసీదారులు తమ పేరు, జన్మతేదీ లేదా పాన్ వివరాలను నమోదు చేసి క్లెయిమ్ చేయని మొత్తం ఉందో లేదో తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. అలాగే క్లెయిమ్ చేయని మొత్తాలపై పాలసీదారులకు సమాచారం అందించేందుకు ఎల్ఐసీ శాఖలు, డివిజనల్ కార్యాలయాలు చివరిసారిగా నమోదు చేసిన చిరునామా, మొబైల్ నంబర్లకు లేఖలు, ఎస్ఎంఎస్‌లు పంపుతున్నాయని చెప్పారు. క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన పత్రాలు, బ్యాంకు ఎన్‌ఈఎఫ్‌టీఎఫ్ (NEFT) వివరాలను సమర్పించాలని పాలసీదారులను కోరుతున్నట్లు తెలిపారు. నమోదు చేసిన సంప్రదింపు వివరాల ద్వారా పాలసీదారులను సంప్రదించలేకపోతే స్థానిక శాఖలు, ఏజెంట్లు, బీమా సఖీల ద్వారా వారిని గుర్తించి క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేసే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించారు.

కేవైసీ స్థితి ఆధారంగా ఖాతాల వ‌ర్గీక‌ర‌ణ‌..

అలాగే పాలసీదారులు లేదా వారి లబ్ధిదారుల తాజా చిరునామా, మొబైల్ నంబర్లను గుర్తించేందుకు ఎల్ఐసీ ఒక క్రెడిట్ బ్యూరో ఏజెన్సీ సేవలను కూడా వినియోగిస్తోందని మంత్రి తెలిపారు. ఈపీఎఫ్‌ఓ సభ్యుల కేవైసీ (KYC) స్థితి ఆధారంగా ఇనాపరేటివ్ ఖాతాలను గుర్తించి వర్గీకరించిందని, అలాంటి ఖాతాల్లో ఉన్న మొత్తాలను సులభంగా సభ్యులకు అందించేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఆధార్ ధ్రువీకరణ పూర్తయిన ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.1వేయి లేదా అంతకంటే తక్కువ క్లెయిమ్ చేయని బ్యాలెన్స్ ఉంటే, వాటిని ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే పైలట్ ప్రాజెక్టుకు ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ విధానంలో సభ్యులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుందని తెలిపారు. దీంతో సభ్యులు తమకు రావాల్సిన మొత్తాన్ని వేగంగా, సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.

పైల‌ట్ ప్రాజెక్టు..

ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉందని, తగిన పరిశీలన అనంతరం అధిక బ్యాలెన్స్ ఉన్న ఇనాపరేటివ్ ఖాతాలకూ దీనిని విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నిబంధనల ప్రకారం బీమా పాలసీలకు సంబంధించిన మొత్తాలు 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయకుండా ఉంటే వాటిని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేస్తారని మంత్రి తెలిపారు. అయితే ఈపీఎఫ్ ఖాతాల్లోని ఇనాపరేటివ్ నిధులను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించే ప్రతిపాదన ప్రస్తుతం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement