త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cube Highways Trust | రూ.5వేల కోట్ల ఐపీఓతో క్యూబ్ హైవేస్ ట్రస్ట్.. భారత ఇన్‌విట్ మార్కెట్లో కొత్త అధ్యాయం..

Cube Highways Trust | ఈ ఏడాది మొద‌టి అర్ధ‌భాగంలో ఐపీవోల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. కంపెనీలు కూడా ఐపీవోల‌కు వ‌చ్చేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు. అయితే యుద్ధం ప్ర‌భావం దాదాపుగా ముగియ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతుండ‌డం, భార‌త రూపాయి నెమ్మ‌దిగా కోలుకుంటుండ‌డంతో కంపెనీలు ఐపీవోల‌కు వ‌స్తున్నాయి.

S

Business | Published On Jul 6, 2026, 12.32 pm IST

Cube Highways Trust | రూ.5వేల కోట్ల ఐపీఓతో క్యూబ్ హైవేస్ ట్రస్ట్.. భారత ఇన్‌విట్ మార్కెట్లో కొత్త అధ్యాయం..
Advertisement

Cube Highways Trust | ఈ ఏడాది మొద‌టి అర్ధ‌భాగంలో ఐపీవోల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. కంపెనీలు కూడా ఐపీవోల‌కు వ‌చ్చేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు. అయితే యుద్ధం ప్ర‌భావం దాదాపుగా ముగియ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతుండ‌డం, భార‌త రూపాయి నెమ్మ‌దిగా కోలుకుంటుండ‌డంతో కంపెనీలు ఐపీవోల‌కు వ‌స్తున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధ‌భాగంలో ప‌లు పెద్ద కంపెనీలు భారీ ఐపీఓల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక తాజాగా క్యూబ్ హైవేస్ ట్ర‌స్ట్ త‌న ప్ర‌తిపాదిత రూ.5వేల కోట్ల ఐపీవోకు గాను అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌తో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబీ)కి డ్రాఫ్ట్ దాఖలు చేసింది. ఈ కంపెనీ ఐపీవో పూర్తిగా ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలోనే ఉండ‌నుంది. భార‌త్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్‌విట్) మార్కెట్లో తొలిసారిగా ప్రైవేట్‌గా లిస్ట్ అయిన ఇన్‌విట్ నుంచి పబ్లిక్‌గా లిస్ట్ అయ్యే దిశగా కంపెనీ కీలక ముందడుగు వేసింది. ఇందులో ట్రస్ట్ ఎలాంటి కొత్త యూనిట్లను జారీ చేయదు. ప్రస్తుతం ఉన్న యూనిట్ హోల్డర్లు తమ వాటాలో కొంత భాగాన్ని ప్రజా పెట్టుబడిదారులకు విక్రయిస్తారు. అందువల్ల ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులు ట్రస్ట్‌కు కాకుండా విక్రయిస్తున్న పెట్టుబడిదారులకే వెళ్తాయి.

పెట్టుబ‌డిదారుల వ‌ర్గాన్ని విస్త‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా..

ఈ ఐపీఓకు కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా, యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ ట్రస్టీగా వ్యవహరిస్తోంది. పబ్లిక్ లిస్టింగ్ ద్వారా ట్రస్ట్‌లో పెట్టుబడిదారుల వర్గాన్ని మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సంస్థ భావిస్తోంది. మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్లు, సంస్థాగత పెట్టుబడిదారులు, అర్హత కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ యూనిట్లలో పెట్టుబడి పెట్టే అవకాశం పొందుతారు. దీంతో ట్రస్ట్ యూనిట్లలో లిక్విడిటీ పెరగడంతోపాటు, భారత మౌలిక సదుపాయాల పెట్టుబడి మార్కెట్లో సంస్థ ఉనికి మరింత బలపడనుంది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో క్యూబ్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-2, క్యూబ్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-3, క్యూబ్ మొబిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, బీసీఐ ఐఆర్‌ఆర్ ఇండియా హోల్డింగ్స్, సెవెంటీ సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించనున్నాయి.

భారీగా ఆస్తులు, ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ‌..

పబ్లిక్ లిస్టింగ్‌కు ముందు ట్రస్ట్ స్వాప్ లావాదేవీల ద్వారా మరో నాలుగు రహదారి, సొరంగ ప్రాజెక్టులను కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ కొనుగోళ్లు పూర్తయితే ట్రస్ట్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 31 రహదారి ఆస్తులు ఉండగా, దాదాపు 9,811 లేన్ కిలోమీటర్ల హైవే నెట్‌వర్క్‌ను నిర్వహించే స్థాయికి చేరుకుంటుంది. దీంతో భారత రహదారి మౌలిక సదుపాయాల రంగంలో సంస్థ స్థానం మరింత బలపడుతుంది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కు ఐ స్క్వేర్డ్ క్యాపిటల్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ), ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, బ్రిటిష్ కొలంబియా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ వంటి అంతర్జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి సంస్థల మద్దతు ఉంది. ఇది భారత రవాణా మౌలిక సదుపాయాల రంగంపై ప్రపంచ పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) నమూనాలో దేశవ్యాప్తంగా హైవే ఆస్తులను కలిగి ఉండి నిర్వహిస్తోంది.

ఐపీవో ఎప్పుడంటే..

2025 సెప్టెంబర్ నాటికి ఈ ఇన్‌విట్ 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో విస్తరించిన 27 ఆపరేషనల్ రహదారి ఆస్తులను నిర్వహిస్తోంది. ఇందులో టోల్ రోడ్లు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) ప్రాజెక్టులు, యాన్యుటీ ఆధారిత రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. ట్రస్ట్ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.36,250 కోట్లుగా ఉంది. భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ మార్కెట్‌పై పెట్టుబడిదారుల ఆసక్తి క్రమంగా పెరుగుతున్న సమయంలో ఈ పబ్లిక్ లిస్టింగ్ ప్రతిపాదన రావడం విశేషం. పబ్లిక్ లిస్టింగ్ ద్వారా మార్కెట్ భాగస్వామ్యాన్ని పెంచడం, యూనిట్ల లిక్విడిటీని మెరుగుపరచడం, దేశంలోని అతిపెద్ద హైవే మౌలిక సదుపాయాల పోర్ట్‌ఫోలియోల్లో ఒకదానికి మరింత విస్తృత యాజమాన్యాన్ని కల్పించడం ట్రస్ట్ లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ ఐపీఓను ప్రారంభించాలని ట్రస్ట్ లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది.

Advertisement
Advertisement