త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | బంగారంపై మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న కేంద్రం..?

Gold | దేశంలో బంగారం వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటివరకు మంజూరు చేసిన గోల్డ్ లోన్లు, విదేశీ బులియన్ బ్యాంకుల నుంచి తీసుకున్న గోల్డ్ మెటల్ లోన్స్ (జీఎంఎల్‌) వివరాలను అత్యవసరంగా సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది.

S

Business | Published On Jun 10, 2026, 12.28 pm IST

Gold | బంగారంపై మ‌రిన్ని ఆంక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న కేంద్రం..?
Advertisement

Gold | దేశంలో బంగారం వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటివరకు మంజూరు చేసిన గోల్డ్ లోన్లు, విదేశీ బులియన్ బ్యాంకుల నుంచి తీసుకున్న గోల్డ్ మెటల్ లోన్స్ (జీఎంఎల్‌) వివరాలను అత్యవసరంగా సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత బంగారం దిగుమతుల విలువ 24 శాతం పెరిగి 71.9 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.6 లక్షల కోట్లు) చేరినట్లు సమాచారం. ఈ భారీ దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్‌) బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2023 నుంచి ఇప్పటివరకు మంజూరు చేసిన గోల్డ్ లోన్ల మొత్తం విలువ, గోల్డ్ లోన్ ఖాతాదారుల సంఖ్య, తాకట్టు పెట్టిన బంగారం పరిమాణం, విదేశీ బులియన్ బ్యాంకుల నుంచి తెచ్చుకున్న బంగారం వివరాలు, దేశీయంగా ఆ బంగారం వినియోగ విధానం వంటి పూర్తి సమాచారాన్ని సమర్పించాలని కోరింది.

దేశీయ బంగారంపై దృష్టి..

భారత్‌ దిగుమతి చేసుకునే ప్రతి గ్రాము బంగారం కోసం భారీ మొత్తంలో డాలర్లు విదేశాలకు వెళ్తున్నాయి. దీంతో కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) పెరిగి, రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకింగ్ రంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారం దిగుమతులు ఇదే వేగంతో కొనసాగితే దేశ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్రం ఇప్పటికే దిగుమతి సుంకాలను పెంచడమే కాకుండా, గోల్డ్ లోన్ వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా పరిశీలిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం విదేశాల నుంచి కొత్తగా బంగారం దిగుమతి చేసుకునే బదులు దేశీయంగా లభించే డోర్ గోల్డ్ (Dore Gold) ను శుద్ధి చేసి, అదే బంగారాన్ని గోల్డ్ మెటల్ లోన్ల రూపంలో జ్యువెలరీ వ్యాపారులకు అందించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌లు (ETFs) విదేశీ బంగారం కొనుగోలు చేయకుండా, దేశీయంగా శుద్ధి చేసిన గోల్డ్ బార్లను కొనుగోలు చేసేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావచ్చని తెలుస్తోంది.

80:20 స్కీమ్‌ను అమలు చేస్తారా..?

అవసరమైతే 2013లో అమలు చేసిన 80:20 స్కీమ్‌ను కూడా తిరిగి అమలు చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఈ విధానంలో దిగుమతి చేసిన బంగారంలో కనీసం 20 శాతం ఎగుమతి చేయడం తప్పనిసరి. బంగారం దిగుమతులను నియంత్రించడానికి కేంద్రం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక స్థిరత్వం, రూపాయి బలోపేతం, విదేశీ మారక నిల్వల పరిరక్షణ లక్ష్యాలతో కేంద్రం చేపడుతున్న ఈ చర్యలు బంగారం మార్కెట్‌పై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement